Sunday, August 29, 2021

పాఠశాలల ప్రారంభాన్ని ఆపండిహైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

హైదరాబాద్ : 29/08/2021

పాఠశాలల ప్రారంభాన్ని ఆపండి

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

శాస్త్రీయ ఆధారం లేకుండా ఉత్తర్వులు ఇచ్చారంటూ ఆరోపణ

ఈనెల 31న విచారణ

పాఠశాలల ప్రారంభాన్ని ఆపండి

Courtesy ఈనాడు మీడియా ట్విట్టర్
హైదరాబాద్‌: సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ శనివారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ఈ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. కొవిడ్‌ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక చర్యలను చేపట్టలేదన్నారు. భౌతిక దూరం, పిల్లల హాజరు, ఆన్‌లైన్‌ తరగతుల నిలిపివేత తదితరాలపై స్పష్టత లేదన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపడంపై తల్లిదండ్రుల అంగీకార పత్రం అవసరమో లేదో కూడా పేర్కొనలేదన్నారు. పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసులను తెప్పించి పరిశీలించాలని కోరారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) నివేదిక ప్రకారం సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కొవిడ్‌ మూడోదశ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్‌ కూడా కాలేదన్నారు. వారు కొవిడ్‌ బారిన పడ్డారో లేదో గుర్తించడం కూడా కష్టమని నిపుణులు చెబుతున్నారన్నారు. రాష్ట్రం మొత్తం మీద పూర్తిస్థాయిలో..ముఖ్యంగా పాఠశాల సిబ్బందికి వ్యాక్సినేషన్‌ పూర్తికాలేదని, ఎలాంటి సంసిద్ధత లేకుండానే పాఠశాలలను ప్రారంభిస్తున్నారన్నారు. అందువల్ల విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్‌, నిపుణుల సలహా కమిటీలను చేర్చారు. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈనెల 31న విచారణ చేపట్టనుంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించే మొదటి పిటిషన్‌ ఇదే కావడం విశేషం.

No comments:

Post a Comment