Thursday, August 26, 2021

సర్కారు మారితే రాజద్రోహం కేసులా! దేశంలో ఇదో ఇబ్బందికర పరిణామం ఇందుకు పోలీసులూ కారకులే సీజేఐ జస్టిస్‌ రమణ ధర్మాసనం వ్యాఖ్య

హైదరాబాద్ : 27/08/2021

సర్కారు మారితే రాజద్రోహం కేసులా!

  దేశంలో ఇదో ఇబ్బందికర పరిణామం

  ఇందుకు పోలీసులూ కారకులే

  సీజేఐ జస్టిస్‌ రమణ ధర్మాసనం వ్యాఖ్య

సర్కారు మారితే రాజద్రోహం కేసులా!

!!ఈనాడు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో!!

దేశంలో బాధాకరమైన పరిస్థితులు నడుస్తున్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పోలీసులు దానివైపు మొగ్గుచూపుతారు. తరువాత ఇంకో పార్టీ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుంటుంది. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.

ఈనాడు, దిల్లీ: ప్రభుత్వం మారినప్పుడల్లా రాజద్రోహం కేసులు నమోదు చేయడం ఆందోళనకర పరిణామంగా మారిందని గురువారం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారిని రాజద్రోహం కేసు కింద అరెస్టు చేయకుండా ఊరట కలిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్య చేసింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ వ్యాఖ్యానిస్తూ ‘‘చట్టాన్ని (రూల్‌ ఆఫ్‌ లా) పాటిస్తే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి అనుకూలంగా వ్యవహరిస్తే తర్వాత (పోలీసులకు) సమస్యలు వస్తాయి. దేశంలో పరిస్థితులు విచారకరంగా ఉన్నాయి. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు ఆ పార్టీ వైపు ఉంటున్నారు.

ఆ తరువాత కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఆయా పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటోంది. పోలీసులు అధికార పార్టీ వైపు ఉన్నప్పుడు రాజద్రోహం కేసులు ఉండడం లేదు. ఆ పార్టీ మారగానే రాజద్రోహం కేసులు పెడుతున్నారు. దేశంలో ఇదో కొత్త పోకడ. దీనిని ఆపాల్సి ఉంది’’ అని అన్నారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే...1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన గుర్జీందర్‌ పాల్‌ సింగ్‌ ఛత్తీస్‌గఢ్‌లో భాజపా అధికారంలో ఉన్నప్పుడు రాయ్‌పుర్‌, దుర్గ్‌, బిలాస్‌పుర్‌ల్లో ఐజీగా పనిచేశారు. ప్రస్తుతం అదనపు డీజీపీ హోదా పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. కేసుల కారణంగా సస్పెండయ్యారు. ప్రభుత్వం మారిన అనంతరం అవినీతి నిరోధక శాఖ, ఆర్థిక నేరాల విభాగం సోదాలు జరిపి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసు నమోదు చేసింది. వివిధ వర్గాల మధ్య విభేదాలు కలిగేలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ రాజద్రోహం కేసు కూడా నమోదయింది. రాజద్రోహం కేసును కొట్టివేయాలంటూ తొలుత ఆయన హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. దాంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా రెండు కేసుల్లోనూ నాలుగు వారాల పాటు ఎలాంటి అరెస్టు చేయకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని సింగ్‌కు సూచించింది.

వాదోపవాదాలు

తొలుత గుర్జీందర్‌ సింగ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఫాలీ.ఎస్‌.నారిమన్‌ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే అభియోగపత్రం దాఖలయినందున కస్టడీలోకి విచారణ జరపాల్సిన పనిలేదని చెప్పారు. ఆయనను ఒకసారి ప్రస్తుత ముఖ్యమంత్రి పిలిపించి మాజీ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన ముకుల్‌ రోహత్గీ అభ్యంతరం తెలిపారు. ‘‘ఆయన ప్రవర్తన చూడండి. పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉండి విచారణకు గైర్హాజరవుతున్నారు. అరెస్టు నుంచి ఆయనను రక్షించకూడదు’’ అని కోరారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ‘‘మేం రాజద్రోహం కేసును పరిశీలిస్తాం. ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. పోలీసు విభాగం కూడా ఇందుకు కారణమే.... మీ క్లయింట్‌ (గుర్జీందర్‌ సింగ్‌) అమాయకులని చెప్పకండి. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవహరించి ఉండవచ్చు’’ అని వ్యాఖ్యానించింది. వెల్లడయిన ఆదాయానికి మించి తొమ్మిదింతలు అధికంగా.. దాదాపు రూ. పది కోట్లు... అక్రమంగా సంపాదించినట్టు గుర్తించినందున ఆయనకు ఎలాంటి ఊరట ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మరో న్యాయవాది రాకేశ్‌ ద్వివేది కోరారు. సోదాలు జరుగుతున్న సమయంలో కొన్ని చించి పారివేసిన కాగితాలు కనిపించాయని, వాటిని అతికించి చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసినట్టు తేలిందని దర్యాప్తు సంస్థలు తమ నివేదికలో పేర్కొన్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, అధికార్లకు వ్యతిరేకంగా ఆంగ్లంలో రాసిన మరో అయిదు పేజీల పత్రాలు కూడా లభించాయని తెలిపింది.

No comments:

Post a Comment