Thursday, August 20, 2026

అధికారులు మూసివేసినా.. మళ్లీ ఎలా తెరిచారు?_

అనుమతులు లేకుండా విద్యారణ్య స్కూల్ నిర్వహణపై ఆరోపణలు

మూసివేసినా.. మళ్లీ ఎలా తెరిచారు?

అనుమతులు ఎక్కడ? అధికారుల చర్యలు ఏమిటి?

హైదరాబాద్(ప్రశ్న న్యూస్): 

అంబర్ పేట డివిజన్ పటేల్‌నగర్‌లోని విద్యారణ్య స్కూల్‌లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో జూలై 6న పాఠశాలను మూసివేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.

అయితే రెండు రోజులు మూసివేసి.. మళ్లీ యథావిధిగా తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు? ప్రస్తుతం పాఠశాలకు ఏ తరగతుల వరకు అనుమతులు ఉన్నాయి? అనుమతులు లేకపోతే తిరిగి పాఠశాల నిర్వహణకు ఎవరు అనుమతించారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదే పేరుతో వివేక్‌నగర్–రామంతపూర్‌లో మరో పాఠశాల కొనసాగుతుండటం, పటేల్‌నగర్ పాఠశాల విద్యార్థులను అక్కడి నుంచి 10వ తరగతి పరీక్షలకు పంపుతున్నారనే ఆరోపణలపై కూడా స్పష్టత ఇవ్వాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. హైదరాబాద్ జిల్లాలోని అనుమతి లేని పాఠశాల విద్యార్థులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఎలా రాస్తున్నారు? అనే అంశంపైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై హిమాయత్‌నగర్ డిప్యూటీ ఎంఈఓ శ్యామల్ రాజుకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారులు ఆరోపించారు. దీంతో 13-08-2026న హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంలో అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? పాఠశాలకు ఉన్న అనుమతులు, ప్రస్తుతం నిర్వహిస్తున్న తరగతులకు ఉన్న గుర్తింపులు, విద్యార్థుల పరీక్షల నిర్వహణకు సంబంధించిన అనుమతులు అన్నింటినీ విద్యాశాఖ తక్షణమే బహిర్గతం చేయాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.

అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, గతంలో పాఠశాలను మూసివేసిన తర్వాత తిరిగి నిర్వహణకు దారితీసిన పరిస్థితులపైనా సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.

ఇది కేవలం ఒక పాఠశాల వ్యవహారం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా హక్కులు, భద్రతకు సంబంధించిన ప్రశ్న. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. తప్పైతే వాస్తవాలను విద్యాశాఖ స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలి.

Wednesday, August 19, 2026

గచ్చిబౌలి పోలీసులు మరియు సైబరాబాద్ SOT బృందాలు ముగ్గురు MDMA విక్రేతలను (peddlers)అరెస్ట్ చేశారు_

*భారీ మొత్తంలో ఎండీఎంఏ (MDMA) మత్తుమందు పలువురు పెడ్లర్లను అరెస్ట్*

*గచ్చిబౌలి పోలీసులు మరియు సైబరాబాద్ SOT బృందాలు ముగ్గురు MDMA విక్రేతలను (peddlers)అరెస్ట్ చేశారు*

*అదుపులోకి తీసుకుని, రూ. 16.4 లక్షల విలువైన 95.41 గ్రాముల MDMA డ్రగ్ మరియు 50 గ్రాముల OG కుష్ (OG Kush) ను స్వాధీనం చేసుకున్నారు.*

బాపట్ల కృష్ణమోహన్, ఆగస్టు 19:

ఖచ్చితమైన సమాచారం మేరకు, గచ్చిబౌలి పోలీసులు మరియు సైబరాబాద్ SOT బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించి, ముగ్గురు డ్రగ్ విక్రేతలు మరియు 16 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నాయి. వీరి వద్ద నుండి రూ. 16.49 లక్షల విలువైన 95.41 గ్రాముల MDMA డ్రగ్ మరియు 50 గ్రాముల OG కుష్‌ను స్వాధీనం చేసుకున్నాయి.*కేసు వివరాలు:* గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో NDPS చట్టంలోని సెక్షన్లు 27(B), 8C, 22(C) కింద కేసు (నం. 1431/2026) నమోదు చేయబడింది.
**స్వాధీనం చేసుకున్న వస్తువులు:**
*(1)*: MDMA – 95.41 గ్రాములు (విలువ రూ. 11,40,920/-)
*(2)*: OG కుష్ – 50 గ్రాములు (విలువ రూ. 5,00,000/-)
స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ: రూ. 16,40,920/-
*(3)*: రెండు సెల్ ఫోన్లు
**నిందితుల వివరాలు:**

*(1)*: Md రజల్ అబ్దుల్ గఫూర్, వయసు 26 ఏళ్లు, వృత్తి: వ్యాపారం, నివాసం: బెగూర్, బెంగళూరు (కర్ణాటక), స్వస్థలం: త్రిసూర్ (కేరళ).
*(2)*: నవీన KD, వయసు 22 ఏళ్లు, వృత్తి: వ్యాపారం, నివాసం: బెగూర్, బెంగళూరు (కర్ణాటక), స్వస్థలం: త్రిసూర్ (కేరళ). 3)కొరిపెల్ల యశ్వంత్ సాయి షణ్ముఖ్, వయస్సు: 26 సంవత్సరాలు, Occ: నిరుద్యోగ R/o మూసాపేట్, కూకట్‌పల్లి, హైదరాబాద్. N/o తూర్పు గోదావరి, A.P రాష్ట్రం.
**కేసు వాస్తవాలు:** 
11.08.2026న, వట్టినాగులపల్లిలోని కిండోమ్ పబ్ రోడ్డు సమీపంలో MDMA పెడ్లర్ కొరిపెల్ల యశ్వంత్ సాయి షణ్ముఖ్‌తో పాటు 16 మంది వినియోగదారులను అరెస్టు చేశారు, విచారణలో యశ్వంత్ ఎండీ రజల్ అబ్దుల్ గఫూర్ R/o కేరళ మరియు నవీన KD R/o బెంగుళూరుకు చెందిన నిందితుల వ్యక్తి నుండి MDMA కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.18.08.2026న, కేరళలోని త్రిసూర్‌లో Md Razal Abdul Gafoorను అరెస్టు చేశారు. విచారణలో, తాను Sam (నైజీరియన్) నుండి సేకరించిన 44.41 గ్రాముల MDMAని Koripella Yashwanth Sai Shanmukhకు ఇచ్చినట్లు అతను వెల్లడించాడు. అదే రోజున కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, బేగూర్ వద్ద Navina KDని అరెస్టు చేశారు; బేగూర్‌లోని ఆమె నివాసంలో జరిపిన సోదాలో 51 గ్రాముల MDMA మరియు 50 గ్రాముల OG Kush లభించాయి. విచారణలో, స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను కేరళకు చెందిన తన స్నేహితుడు Aneshwar నుండి సేకరించినట్లు Navina KD తెలిపింది.ఈ అరెస్టులు CH. శ్రీనివాస్ (DCP, శేరిలింగంపల్లి జోన్), శోభన్ కుమార్ (DCP, SOT సైబరాబాద్), T. గోవర్ధన్ (Addl. DCP-I, SOT సైబరాబాద్), ఉదయ్ రెడ్డి (Addl. Dy. Commissioner of Police, శేరిలింగంపల్లి జోన్),  G. వెంకట రమణ గౌడ్ (ACP, నార్సింగి డివిజన్), SOT సైబరాబాద్ బృందాలు, అలాగే గచ్చిబౌలి PS SHO, DI మరియు గచ్చిబౌలి పోలీస్ సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగాయి.
**సూచన**
డ్రగ్స్ లేదా గంజాయి సరఫరాదారులకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే, 'Dial 100' ద్వారా లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 8712663061 ద్వారా పోలీసులకు తెలియజేయాలని పౌరులను కోరుతున్నాము. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, డ్రగ్స్ లేదా గంజాయికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నాము. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

మాభూమి మాకు దక్కింది ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు -22 ఏ దరఖాస్తుదారులు_

*22/ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం*

*ప్రతి కేసును వేగంగా పరిష్కరించాలి*

*ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి పొంగులేటి*

*అధికారులకు టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం*

*మాభూమి మాకు దక్కింది ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు -22 ఏ దరఖాస్తుదారులు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 19:

 22/ఎ  నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22/ఎ జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి 22/ఎ అంశంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు సబ్‌ రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు.అనంతరం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.22/ఎ జాబితాలో భూమి ఉందనే కారణంతో మాత్రమే రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం లేదా తిరస్కరించడం చేయవద్దని ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించాల‌ని ఆదేశించారు. సంబంధిత భూమి 22/ఎ నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి? హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి? గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమిటి? వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
22/ఎభూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను కూడా పరిరక్షిస్తూ, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
*“నా భూమి నాకు దక్కింది.. -ప్రభుత్వానికి కృతజ్ఞతలు”*
 22/ఎ సమస్యను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్న ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్షంగా లబ్ధి పొందిన పోచారం గ్రామానికి చెందిన రాకేష్ తన అనుభవాన్ని వెల్లడించారు.“నేను 2022లో పోచారం గ్రామంలో వంద గజాల స్థలం కొనుగోలు చేశాను. ఇటీవల ఆ స్థలాన్ని విక్రయించేందుకు నార్లపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాను. మొదట డాక్యుమెంట్ రైటర్‌ను సంప్రదించగా, మీ భూమి22/ఎ లో ఉందని చెప్పారు. దీంతో కొంత ఆందోళనకు గురయ్యాను. అయితే మూడు, నాలుగు రోజుల క్రితం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి మీ భూమికి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ఈ రోజు నేను ఆ స్థలాన్ని కొనుగోలుదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేశాను. నా భూమి నాకు దక్కేలా సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు” అని తెలిపారు.“ క్లియరెన్స్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం”.నార‌ప‌ల్లి సబ్‌ రిజిస్ట్రార్ సునీల్ మాట్లాడుతూ.. పోచారం గ్రామంలోని సర్వే నంబర్ 50ను ఏపీ హౌసింగ్ బోర్డు భూమిగా పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్‌లో22/ఎ జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని తెలిపారు. ఇటీవల కలెక్టర్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. వెంటనే గతంలో రిజిస్ట్రేషన్ కోసం మమ్మల్ని సంప్రదించిన వారికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నాం. వారు కార్యాలయానికి వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం” అని సబ్‌ రిజిస్ట్రార్ సునీల్ తెలిపారు.మా సొసైటీలోని 300 ప్లాట్ల‌కు పూర్తి విముక్తి క‌లిగింది- చ‌క్ర‌పాణి (కొనుగోలుదారు).కూక‌ట్‌పల్లి అడ్డ‌గుట్ట సొసైటీలోని నెంబ‌ర్ 80సిలోగ‌ల 250 గ‌జాల స్ద‌లాన్ని నెల‌రోజుల క్రితం కొనుగోలు చేశాను. అయితే రిజిస్ట్రేషన్ కోసం కూక‌ట్‌ప‌ల్లి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే ఆభూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉంద‌ని రిజిస్ట్రేష‌న్ చేయ‌లేదు. తాజాగా ప్ర‌భుత్వ చ‌ర్య‌ల కార‌ణంగా నిన్న‌నే నాకు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యం నుంచి ఫోన్ వ‌చ్చింది. ఈ రోజు వెళ్ల‌గా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేశారు. అంతేగాక మా సొసైటీలోని 300 ప్లాట్ల‌ను నిషేధిత జాబితా నుంచి తొల‌గించిన‌ట్లు అధికారులు చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు- అని చ‌క్ర‌పాణి అనే కొనుగోలుదారు తెలిపారు. ప్ర‌భుత్వ స‌కాల చ‌ర్య‌ల వ‌ల్ల రిజిస్ట్రేష‌న్ పూర్త‌యింది- రాజేంద్ర‌ప్ర‌సాద్‌.బాలా న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య ప‌రిధిలోని మూసాపేట్‌లో గ‌ల రెయిన్‌బో విస్టాలో ఉన్న‌ప్లాట్ నెంబ‌ర్ 804 ను విక్ర‌యించేందుకు కొద్దికాలం క్రితం య‌జ‌మాని వెంక‌ట విజ‌య్‌కుమార్ ప్ర‌య‌త్నించారు. అయితే 22ఎ నిషేధిత జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేష‌న్ జ‌ర‌గ‌లేదు. వెంక‌ట విజ‌య్‌కుమార్ ఆస్ట్రేలియా వెళ్లిపోతూ త‌న మామ రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఈనెల 12న స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యం నుంచి స‌మాచారం రావ‌డంతో ఈరోజు రాజేంద్ర‌ప్ర‌సాద్ వెళ్లి రిజిస్ట్రేషన్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాజేంద్ర ప్ర‌సాద్ ఏమ‌న్నారంటే...
మా అల్లుడు సేల్ చేద్దామనుకున్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వస్తే... 22ఎ కింద గవర్నమెంట్ నిషేధం విధించింద‌ని  చెప్పినందున  ఆ రోజు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ త‌ర్వాత నా అల్లుడు నా పేరు మీద స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. అది ఇంకా చాలా కాలమే పడుతుందేమో అనుకున్నాం గానీ... అదృష్టవశాత్తూ ప్ర‌భుత్వం స‌కాలంలో చ‌ర్య‌లు తీసుకున్నందున  వెంట‌నే  ఒక  వారం రోజుల్లోనే ఇది క్లియర్ అయ్యి... అనుకూలంగా తేలింది. ఈ రోజు రిజిస్ట్రేషన్ కోసం వచ్చాం, రిజిస్ట్రేషన్ కూడా మాకు సంతృప్తి కరంగా పూర్తిగా  అవుతుంది. ప్ర‌భుత్వానికి చాలా కృతజ్ఞతలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేష‌న్ పూర్తి - శ్రీ‌నివాస్.బాలా న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య ప‌రిధిలోని మూసాపేట్‌లో గ‌ల వైష్ణ‌వి ఎస్టేట్ ప్ర‌తినిధి శ్రీ‌నివాస్ మూసాపేట స‌ర్వే నెంబ‌ర్ 108లోగ‌ల భూమిని విక్రయించేందుకు రాగా 22ఎ నిషేధిత జాబితాలో ఉంద‌ని రిజిస్ట్రేష‌న్ శాఖ అధికారులు తిర‌స్క‌రించారు. తాజాగా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు కార‌ణంగా ఈరోజు శ్రీ‌నివాస్ త‌న భూమికి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌నివాస్ మాట్లాడుతూ..
మాకు 2005 లో సీలింగ్ పర్మిషన్ వచ్చింది. మేము రిజిస్ట్రేషన్ కి అప్పటినుంచి  ప్ర‌య‌త్నం  చేస్తున్నాము. . తాజాగా రెండు వారాల క్రితం   మూసాపేట్ బాలానగర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కి వెళ్తే 22ఎ లో పెట్టామని చెప్పారు. మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యాము. ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ అది క్లియర్ చేశారు. దాంతో ఈ రోజు  ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాము. ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ అయింది. థాంక్యూ వెరీ మచ్.ప‌లు స‌ర్వే నెంబ‌ర్ల‌లో నిషేధం తొల‌గింపు - ఎస్‌.ఆర్‌.వో
బాలాన‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య ప‌రిధిలో గ‌ల స‌ర్వే నెంబ‌ర్లు 101/1, 101/2, 102, 108, 109, 112, 81 లో ఉన్న సుమారు 3000 చ‌ద‌ర‌పు మీట‌ర్ల  స్ద‌లంపై ఉన్న 22ఎ నిషేధం తొలగిపోయింది. ఈ స‌ర్వే నెంబ‌ర్ల‌లో ఉన్న భూమికి సంబంధించి రిజిస్ట్రేష‌న్లు జ‌రుపుకోవ‌చ్చున‌ని బాలా న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ స్ప‌ష్టం చేశారు. 
అధికారుల ఆదేశాల‌తో వెంట‌నే రిజిస్ట్రేష‌న్.మేము ఏజీ కాలనీ, గుండ్ల పొచంప‌ల్లిలోని .గౌరీశంకర్ వద్ద మేము ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది.మేము జూలై ఆరు నాడు ఇక్కడ రిజిస్ట్రేషన్ కి రాగా 22ఎ నిషేధిత జాబితా పేరిట‌ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.
అప్పటినుంచి మేము కలెక్టర్ ఆఫీస్ కి, అక్కడ ఇక్కడ తిరుగుతుంటే... ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి, క్లియర్ చేయమని సబ్-రిజిస్ట్రార్ గారికి చెప్పారు. ఆ వెంట‌నే స‌బ్ రిజిస్ట్రార్ మేడమ్ గారు మాకు ఫోన్ చేసి, రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసి  మాకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది అని ఒక ద‌ర‌ఖాస్తుదారు తెలిపారు.

కరీంనగర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ_

పత్రికా ప్రకటన
*గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి*

*కరీంనగర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 19:

గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ.. ప్రజల్లో దేశభక్తిని, గోసంరక్షణపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గోసమేత తిరంగా ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు.​నగరంలోని చారిత్రక తెలంగాణ చౌక్ వేదికగా సాగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఆయన గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీని అట్టహాసంగా ప్రారంభించారు. తెలంగాణ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ తిరంగా ర్యాలీ బస్టాండ్ వరకు సాగి, తిరిగి తెలంగాణ చౌక్ వద్ద ముగిసింది. సుమారు 600 మంది విద్యార్థులు, యువతీ యువకులు, గోమాత ట్రస్ట్ సభ్యులు, నాయకులు ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో భాగస్వామ్యులయ్యారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని, గోమాత జాతీయ మాతగా గుర్తింపు పొందాలని నినాదాలు చేస్తూ సాగిన ఈ ర్యాలీ నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంది.​ఈ కార్యక్రమంలో నమో మిషన్ వందే గోమాత వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య మద్విరాజ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కో-ఫౌండర్ లు జూపెల్లి ధీరజ్, వేణు, దీపక్, అదిశేషు, నవీన్, మాజీ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గోమాత ట్రస్ట్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

బలూచ్ భూభాగం నుండి అన్ని బలగాలను వెంటనే ఉపసంహరించుకోండి_

*పాకిస్తాన్‌కు బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం హెచ్చరిక*

*బలూచ్ భూభాగం నుండి అన్ని బలగాలను వెంటనే ఉపసంహరించుకోండి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 19:

బలూచిస్తాన్‌ను విడిచిపెట్టాలని బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం మరోసారి పాకిస్తానీ బలగాలన్నింటినీ గుర్తుచేస్తోంది. ఎందుకంటే, ఒక స్వతంత్ర దేశంగా, పాకిస్తాన్ యొక్క బాహ్య మరియు దురాక్రమణ శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బలూచిస్తాన్‌కు అన్ని చట్టపరమైన మరియు నైతిక సమర్థనలు ఉన్నాయి.పాకిస్తానీ సైన్యం బలూచిస్తాన్‌లో చట్టవిరుద్ధంగా మోహరించి, తుపాకీతో బెదిరించి దాని వనరులను, ఖనిజాలను దోచుకుంటోంది. అదే సమయంలో, బలూచిస్తాన్ పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు, వ్యాపారాలకు, గౌరవానికి మరియు శాంతికి నిరంతరం ముప్పు కలిగిస్తోంది. అంతర్జాతీయ సమాజంలో అమలులో ఉన్న చట్టాలను తమ సొంత గడ్డపై వర్తింపజేస్తూ, బలూచిస్తాన్ పాకిస్తానీ సైన్యాన్ని ఒక దురాక్రమణదారుగా మరియు బలూచిస్తాన్ వలస చట్టాలను ఉల్లంఘించిన వారిగా పరిగణిస్తుంది. అందువల్ల, పాకిస్తానీ బలగాల ఉనికి అంతా చట్టవిరుద్ధమని ప్రకటిస్తోంది.బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్న తర్వాత, దానిని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించి, బలూచిస్తాన్ రక్షణ, భద్రత, ఖనిజాల పరిరక్షణ, సరిహద్దు భద్రత, భూ, సముద్ర మరియు గగనతల భద్రతను ఉల్లంఘిస్తున్న పాకిస్తానీ బలగాలను పంజాబ్‌కు తిరిగి పంపించడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని బలూచిస్తాన్ కోరుతోంది.బలూచిస్తాన్‌లో నివసిస్తూ, సైన్యం, ఎఫ్‌సి, పోలీసు మరియు ఇతర సంస్థలలో, అలాగే పాకిస్తాన్ వాయు మరియు నావికా దళాలలో పనిచేస్తున్న బలూచ్-యేతర పాకిస్తానీలకు బలూచిస్తాన్ రిపబ్లిక్ ఆదేశాలు జారీ చేస్తోంది. వారు బలూచిస్తాన్‌కు చెందిన అన్ని ఆయుధాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకులు, భారీ ఫిరంగులు, నౌకాదళ నౌకలు మరియు సైనిక సామగ్రిని బలూచిస్తాన్‌లోని బలూచ్ బలగాలకు అప్పగించి, ఒట్టి చేతులతో పంజాబ్‌కు తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే, పైన పేర్కొన్న సామగ్రి అంతా బలూచిస్తాన్ డబ్బుతోనే కొనుగోలు చేయబడింది. సరిగ్గా 1947లో బ్రిటన్, భారతదేశాన్ని విడిచిపెట్టినప్పుడు, అన్ని సైనిక ఆయుధాలు మరియు యుద్ధ సామగ్రిని భారతదేశానికి అప్పగించి, ఒట్టి చేతులతో బ్రిటన్‌కు తిరిగి వెళ్ళినట్లే; 1971లో బంగ్లాదేశ్‌లో యుద్ధంలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ అక్కడి నౌకాదళ, వాయు, భూతల దళాలను మరియు యుద్ధ సామగ్రిని బంగ్లాదేశ్ దళాలకు అప్పగించినట్లే; సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలగేటప్పుడు తన ఆయుధాలను మరియు సైనిక సామగ్రిని అక్కడే వదిలిపెట్టినట్లే; మరియు 2025లో యునైటెడ్ స్టేట్స్ మరియు నాటో తమ ఉపసంహరణ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను మరియు యుద్ధ సామగ్రిని వదిలిపెట్టినట్లే; అదే విధంగా పాకిస్తాన్ ఆక్రమణ దళాలు ఇప్పుడు బలూచిస్తాన్ నుండి తమ ఉపసంహరణ తేదీని మరియు గడువును స్పష్టంగా ప్రకటించాలి, మరియు బలూచిస్తాన్ విడిచి వెళ్లేటప్పుడు వారిని ఒక్క తూటా కూడా తగలనివ్వరు.
బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యంలో భూ యుద్ధంలో తాము ఇప్పటికే ఓడిపోయామని పాకిస్తాన్‌కు కూడా బాగా తెలుసు. అందువల్ల, 1971లో మూడు మిలియన్ల బెంగాలీల ఊచకోత తర్వాత వారు లొంగిపోయి తప్పించుకోవడానికి మార్గం వెతికినట్లే, అదేవిధంగా బలూచిస్తాన్‌లో లక్షలాది మంది ప్రజల ఊచకోత తర్వాత పాకిస్తాన్‌కు తప్పించుకునే మార్గం దొరకదు. బలూచిస్తాన్ ప్రజలు తమ ప్రతీకారాన్ని మరచిపోలేదు; అందువల్ల అమాయక బలూచ్ పౌరులపై మరిన్ని ఊచకోతలు జరపడం కంటే, బలూచిస్తాన్ నుండి తన బలగాలను ఉపసంహరించుకోవడమే పాకిస్తాన్‌కు మంచిది. ఎందుకంటే, బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ చేస్తున్నది ఒక వ్యర్థమైన యుద్ధం, దాని అంతం పాకిస్తాన్ ఓటమే. పాకిస్తాన్‌లో ఒక్క వివేకి అయినా ఉంటే, అతను రాబోయే ప్రమాదాన్ని గ్రహించాలి: బలూచిస్తాన్ ఇప్పుడు ఒక స్వతంత్ర దేశం, మరియు ఈ దేశాన్ని గుర్తించడంలోనే పాకిస్తాన్ భద్రత ఉంది.

Tuesday, August 18, 2026

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణి లో పౌరసమాజం నుంచి 43 వినతిపత్రాలు_

*సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ప్రజావాణి లో పౌరసమాజం నుంచి 43 వినతిపత్రాలు*

*టౌన్ ప్లానింగ్ విభాగంలో అత్యధికంగా 28 వినతిపత్రాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 17:

పౌరసమాజం తమ సమస్యలను నేరుగా కార్పొరేషన్‌కు తెలియజేసేందుకు వీలుగా సోమవారం సైబరాబాద్ మున్సిపల్ అధికారులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఇందులో మొత్తం 43 వినతిపత్రాలు పౌరసమాజం నుంచి అందాయి అని అన్నారు.
*(1)*: ఇంజనీరింగ్ – 10
*(2)*:ఎంటమాలజీ (కీటక శాస్త్రం) – 1
*(3)*: పారిశుధ్యం – 1
*(4)*: టౌన్ ప్లానింగ్ (పట్టణ ప్రణాళిక) – 28
*(5)*:అర్బన్ బయోడైవర్సిటీ (పట్టణ జీవవైవిధ్యం) – 3
ప్రతి సమస్యను ఒక ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఐడి మరియు ట్రాకింగ్ లింక్‌తో నమోదు చేయడం జరుగుతుంది అని అధికారులు అన్నారు.దీనివల్ల పౌరులు తమ వినతిపత్రం యొక్క స్థితిని తెలుసుకోగలుగుతారు.సంబంధిత శాఖలను ఈ సమస్యలను పరిశీలించి, సకాలంలో పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, అరుదైన రాయి పేరిట మోసం — ఆరుగురిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్_

*నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, అరుదైన రాయి పేరిట మోసం — ఆరుగురిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 17:

నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, మహిమలు ఉన్నాయంటూ ప్రచారం చేసిన ఒక రాయిని అధిక ధరలకు విక్రయించి అమాయకులను మోసం చేసేందుకు యత్నిస్తున్న ఆరుగురి ముఠాను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ మరియు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఉమ్మడిగా దాడి చేసి పట్టుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. శనివారం (15-08-2026) రోజున కాటేదాన్‌లోని లక్ష్మిగూడ ప్రాంతంలో కొనుగోలుదారుల కోసం వేచి చూస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి నిర్వహించారు.
**కేసు పూర్వాపరాలు:**
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం — మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన పి. నరసింహ, వడత్య కుమార్, ప్రవీణ్ సింగ్, మంగళి బసవ నరేష్ మరియు వేములవాడకు చెందిన సిద్ధాంతి చల్లా రవి ఒక ముఠాగా ఏర్పడ్డారు.2024లో పి. నరసింహ అనే వ్యక్తి వేములవాడకు చెందిన చల్లా రవి, కొండపల్లి భిక్షపతి వద్ద నుంచి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని రూ. 10,00,000లకు కొనుగోలు చేసి మోసపోయాడు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని వడత్య కుమార్‌కు అందజేశాడు. దాంతో తామంతా ఒక గుంపుగా ఏర్పడి, ఆ నకిలీ విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మబలికి అమాయకులకు భారీ ధరలకు విక్రయించాలని ప్లాన్ చేశారు.
ఇదే సమయంలో కేతావత్ రాజు తన వద్ద ఒక అరుదైన గులాబీ రంగు రాయి ఉందని, దాన్ని కూడా అధిక ధరకు విక్రయించవచ్చని భావించి ముఠాలో చేరాడు. శనివారం కాటేదాన్, లక్ష్మిగూడ సమీపంలో ఈ నకిలీ విగ్రహం మరియు రాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
**అరెస్ట్ అయిన నిందితులు:**
*(1)*: కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప (38): కార్ డ్రైవర్, చౌదూర్ (గ్రామం), నవాబ్‌పేట, మహబూబ్‌నగర్ జిల్లా.
*(2)*: వడత్య కుమార్ (34): కార్ డ్రైవర్, లక్ష్మిగూడ, కాటేదాన్, హైదరాబాద్.
*(3)*: ప్రవీణ్ సింగ్ (34): డ్రైవర్, మధుబన్ కాలనీ, కాటేదాన్, హైదరాబాద్.
*(4)*: మంగళి బసవ నరేష్ (38): కార్మికుడు, లక్ష్మిగూడ, కాటేదాన్, హైదరాబాద్.
*(5)*: పి. నరసింహ (45): కార్ డ్రైవర్, లక్ష్మిగూడ, కాటేదాన్ (స్వస్థలం: లోయపల్లి, మంచాల్, రంగారెడ్డి జిల్లా).
*(6)*: చల్లా రవి (38): జోతిష్యుడు, చీర్లవంచ, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా.
**స్వాధీనం చేసుకున్న సొత్తు:**

*(1)*: ఒక నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం
*(2)*: ఒక గులాబీ రంగు రాయి (Pink Colour Stone)
*(3)*: ఎర్టిగా (Ertiga) వాహనం (TS 04 B 0549)
*(4)*: ఐదు మొబైల్ ఫోన్లు
*(5)*: మూడు రసాయన ద్రావణాల బాటిళ్లు (Unknown Liquid Bottles)
*(6)*: రెండు ఎరుపు రంగు తువాళ్లు.
జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఛెత్రి యాదేందర్, సబ్-ఇన్‌స్పెక్టర్ జి. సందీప్ రెడ్డి బృందం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులతో కలిసి ఈ అపరేషన్ నిర్వహించారు. నిందితులను స్వాధీనం చేసుకున్న సొత్తుతో సహా తదుపరి విచారణ నిమిత్తం మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO)కు అప్పగించారు.