అనుమతులు లేకుండా విద్యారణ్య స్కూల్ నిర్వహణపై ఆరోపణలు
మూసివేసినా.. మళ్లీ ఎలా తెరిచారు?
అనుమతులు ఎక్కడ? అధికారుల చర్యలు ఏమిటి?
హైదరాబాద్(ప్రశ్న న్యూస్):
అంబర్ పేట డివిజన్ పటేల్నగర్లోని విద్యారణ్య స్కూల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో జూలై 6న పాఠశాలను మూసివేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.
అయితే రెండు రోజులు మూసివేసి.. మళ్లీ యథావిధిగా తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు? ప్రస్తుతం పాఠశాలకు ఏ తరగతుల వరకు అనుమతులు ఉన్నాయి? అనుమతులు లేకపోతే తిరిగి పాఠశాల నిర్వహణకు ఎవరు అనుమతించారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదే పేరుతో వివేక్నగర్–రామంతపూర్లో మరో పాఠశాల కొనసాగుతుండటం, పటేల్నగర్ పాఠశాల విద్యార్థులను అక్కడి నుంచి 10వ తరగతి పరీక్షలకు పంపుతున్నారనే ఆరోపణలపై కూడా స్పష్టత ఇవ్వాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. హైదరాబాద్ జిల్లాలోని అనుమతి లేని పాఠశాల విద్యార్థులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఎలా రాస్తున్నారు? అనే అంశంపైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై హిమాయత్నగర్ డిప్యూటీ ఎంఈఓ శ్యామల్ రాజుకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారులు ఆరోపించారు. దీంతో 13-08-2026న హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంలో అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? పాఠశాలకు ఉన్న అనుమతులు, ప్రస్తుతం నిర్వహిస్తున్న తరగతులకు ఉన్న గుర్తింపులు, విద్యార్థుల పరీక్షల నిర్వహణకు సంబంధించిన అనుమతులు అన్నింటినీ విద్యాశాఖ తక్షణమే బహిర్గతం చేయాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.
అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, గతంలో పాఠశాలను మూసివేసిన తర్వాత తిరిగి నిర్వహణకు దారితీసిన పరిస్థితులపైనా సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
ఇది కేవలం ఒక పాఠశాల వ్యవహారం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా హక్కులు, భద్రతకు సంబంధించిన ప్రశ్న. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. తప్పైతే వాస్తవాలను విద్యాశాఖ స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలి.