*ప్రెస్ నోట్*
*నీళ్లు.. నిధులు.. నియామకాలు.. సమాన హక్కుల సాధనే లక్ష్యం: ఎంపల్ల పురుషోత్తం రెడ్డి*
*నూతన ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకం కావాలి*
బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే,సెప్టెంబర్ 05:
ఎందరో అమరుల బలిదానాలు, ప్రజల పోరాటాలు, ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు ఇంకా పూర్తిస్థాయిలో నెరవేరలేదని, నీళ్లు, నిధులు, నియామకాలు, ఉచిత విద్య, ఉపాధి, నాణ్యమైన ఉచిత వైద్యం, సమానత్వం, సమాన హక్కుల కోసం మరో ప్రజా ఉద్యమం అవసరమని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో ప్రజాసంఘాలు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారని, అయితే రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా సామాన్య ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదన్నారు. గత పాలకులు, ప్రస్తుత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో పోటీపడుతున్నారనే విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని తెలిపారు.ఈ పరిస్థితుల్లో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమై నూతన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది.
*32 ప్రజాసంఘాలతో తెలంగాణ జేఏసీ పునర్నిర్మాణం*
ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 32 ప్రజాసంఘాల ప్రతినిధులు ఏకమై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని బలోపేతం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్గా హైకోర్టు అడ్వకేట్ జి. కరుణాకర్ రెడ్డిని ఎన్నుకుని, ఆయన నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులను సమన్వయం చేస్తూ జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
**నల్లగొండ జిల్లా చైర్మన్గా ఎంపల్ల పురుషోత్తం రెడ్డి*
ఈ క్రమంలో నల్లగొండ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓపెన్ పార్కులో నల్లగొండ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ప్రజాసంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన ఎంపల్ల పురుషోత్తం రెడ్డిని తెలంగాణ జేఏసీ నల్లగొండ జిల్లా చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జి. కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపల్ల పురుషోత్తం రెడ్డి ఎన్నిక రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ నిర్ణయమని తెలిపారు. నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక శక్తులను సమన్వయం చేస్తూ ప్రజా సమస్యలపై ఉద్యమాలను నిర్మించాలని సూచించారు.
*అన్ని శక్తులను కలుపుకుని పోరాడుతా: ఎంపల్ల పురుషోత్తం రెడ్డి*
తనపై నమ్మకంతో నల్లగొండ జిల్లా చైర్మన్గా ఎన్నుకున్న తెలంగాణ జేఏసీ రాష్ట్ర కమిటీకి, రాష్ట్ర చైర్మన్ జి. కరుణాకర్ రెడ్డికి ఎంపల్ల పురుషోత్తం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, కర్షకులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలను కలుపుకుని నూతన ప్రజాస్వామిక తెలంగాణ కోసం జరిగే పోరాటంలో ముందుండి పనిచేస్తానని తెలిపారు.
తన ఎన్నికకు సహకరించిన నల్లగొండ జిల్లా ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, మేధావులకు, ఉద్యమకారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ అంటే కేవలం ఒక రాష్ట్రం ఏర్పడటం కాదు.. ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు రావడం.
అమరుల త్యాగాలకు నిజమైన నివాళి అంటే.. ప్రతి పేదవాడికి న్యాయం, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యం, ప్రతి బిడ్డకు ఉచిత విద్య, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించే తెలంగాణను నిర్మించడం.
అందుకోసం ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఏకమై నూతన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని సమావేశం పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ జి. కరుణాకర్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ ప్రఖండ నాయకులు పైళ్ల మన్మధరెడ్డి, రిటైర్డ్ టీచర్ యానాల పాపిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ముచ్చపోతుల వెంకన్న, గంధం అశోక్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు యార శ్రీను, వేల్పుల వెంకన్న, బహుజన సమాజ్ పార్టీ నాయకులు వేముల సహదేవుడు, చింతపల్లి సైదులు, తెలగమల్ల యాదగిరి, శనగోని సత్తయ్య, తండు పున్నయ్య, సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ భూమి రిపోర్టర్ వేముల శ్రీను తదితరులు పాల్గొన్నారు.