Praja Sankalpam Group Media
Tuesday, August 4, 2026
విధి నిర్వహణలో గాయపడిన కానిస్టేబుళ్లకు సీపీ సజ్జనర్ పరామర్శ_
*విధి నిర్వహణలో గాయపడిన కానిస్టేబుళ్లకు సీపీ సజ్జనర్ పరామర్శ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 29:
విధి నిర్వహణలో భాగంగా డ్రగ్స్ తనిఖీల సమయంలో గాయపడిన హెచ్-న్యూ కానిస్టేబుళ్లు ఎన్.మహేందర్ యాదవ్, ఎమ్.వంశీధర్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరామర్శించారు. లంగర్హౌజ్, ప్రశాంత్నగర్లోని ఆ కానిస్టేబుళ్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి.. వారి ఆరోగ్య పరిస్థితిని, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విధి నిర్వహణలో వారు చూపిన తెగువను ప్రశంసించారు. వారికి మనోధైర్యం కల్పిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ పరామర్శలో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ కూడా సీపీ వెంట ఉన్నారు.ఈ నెల 26న ఆబిడ్స్ తిలక్రోడ్డు ప్రాంతంలో డ్రగ్స్ సమాచారంతో 'హెచ్-న్యూ' బృందం తనిఖీలకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న నీలిరంగు బలేనో కారు (TG 12 8766) డ్రైవర్.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వాహనాన్ని అత్యంత వేగంగా రివర్స్ చేస్తూ వారిపైకి దూసుకొచ్చాడు.ఈ ప్రమాదంలో కారు చక్రం కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్ వంశీధర్కు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇటీవల డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.మరోవైపు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ప్రాణాంతక దాడికి పాల్పడి పరారైన కారు డ్రైవర్పై ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Wednesday, July 29, 2026
గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి_
*గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 29:
పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువులందరికీ హృదపూర్వక నమస్సుమాంజలులు తెలిపారు.“గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మన జీవితాన్ని మలిచిన గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే పవిత్రమైన రోజు. గురువు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, వారి బోధనలను ఆచరిస్తే ప్రతి అడుగూ విజయానికి నాంది అవుతుంది” అని పేర్కొన్నారు.తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే, గురువు జీవితానికి అర్థాన్ని, లక్ష్యాన్ని అందిస్తారని అన్నారు. జీవితానికి దిశానిర్దేశం చేసి, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించి మనలోని సామర్థ్యాన్ని గుర్తించి, క్రమశిక్షణ, విలువలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి అమూల్యమైన సంపదను ప్రసాదిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం, అధికారులు గౌరవించడం నేర్చుకోవాలి_
*తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం, అధికారులు గౌరవించడం నేర్చుకోవాలి*
*కోర్టు ఆదేశాలతో విభేదిస్తే అప్పీల్ చేయాలి కానీ వాటిని ఉల్లంఘించకూడదు*
*వి. రవికృష్ణ, న్యాయవాది & సామాజిక కార్యకర్త*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 29:
తెలంగాణ హైకోర్టు ఇటీవల హైడ్రా HYDRAA వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు ఎంతో గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని వి.రవికృష్ణ (న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త) అన్నారు. ఈ సందర్బంగా రవికృష్ణ మాట్లాడుతూ హైడ్రా కమిషనర్ను ఆ పదవి నుంచి తప్పించాలని హైకోర్టు చీఫ్ సెక్రటరీని ఆదేశించడం ఒక సాధారణ విషయం కాదు. ఆ ఆదేశానికి దారితీసిన కారణాలను కూడా న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా నమోదు చేసింది అని అన్నారు.ఒక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం లేదా అధికారి విభేదిస్తే, చట్టం చూపిన మార్గం పైకోర్టును ఆశ్రయించడం. డివిజన్ బెంచ్, అనంతరం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం రాజ్యాంగం కల్పించింది. అయితే కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా, అదే సమయంలో కోర్టు తప్పుదోవ పట్టిందని లేదా తమ చర్యలే సరైందని బహిరంగంగా ప్రకటించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని అన్నారు.హైడ్రా HYDRAA కమిషనర్ పలుమార్లు "ల్యాండ్ గ్రాబర్స్ 63 కంటెంప్ట్ కేసులు వేశారు, కోర్టును తప్పుదోవ పట్టించారు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి చేయాల్సినవా అనే ప్రశ్న తలెత్తుతోంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు అనేది కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించనప్పుడు వస్తుంది. ఆ ఆదేశాలు తప్పని భావిస్తే వాటిని చట్టబద్ధంగా సవాలు చేయాలి. కానీ వాటిని ఉల్లంఘించి, అనంతరం కోర్టు తప్పుదోవ పట్టిందని చెప్పడం సరైన విధానం కాదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైడ్రాను మరింత బలోపేతం చేస్తామని, కోర్టు అధికారాలపై వ్యాఖ్యానించడం కంటే ముందుగా కోర్టు తీర్పును గౌరవించి, అవసరమైతే చట్టబద్ధంగా అప్పీల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తించాలి అని అన్నారు. ఇటీవల ప్రభుత్వ సమాచార శాఖ (IPR) అధికారిక సోషల్ మీడియా వేదికలో ఐలాపూర్ ప్రాంతంలో 860 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందని ప్రచురించింది. అయితే అదే భూమికి సంబంధించి న్యాయస్థానాల్లో వివాదాలు పెండింగ్లో ఉండగా, స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉండగా, కోర్టు తుది నిర్ణయం రాకముందే దానిని ప్రభుత్వ భూమిగా ప్రకటించడం ఏ చట్టబద్ధమైన ఆధారంపై జరిగిందో ప్రభుత్వం ప్రజలకు వివరించాలి.అక్రమ నిర్మాణాల తొలగింపు అవసరమే. కానీ ఆ చర్యలు కూడా చట్టబద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా జరగాలి. బాధితులకు నోటీసులు ఇవ్వడం, వారి వస్తువులు తరలించుకునే అవకాశం కల్పించడం, అద్దెదారుల హక్కులను గౌరవించడం వంటి కనీస న్యాయ ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.నేను గత మూడు సంవత్సరాలుగా అమీన్పూర్, బీరంగూడ, శంభునికుంట తదితర ప్రాంతాల్లోని భారీ చెరువు ఆక్రమణలపై హైడ్రా కమిషనర్కు అనేక ఫిర్యాదులు చేశాను. ముఖ్యంగా శంభునికుంట చెరువు శికం భూమిలో నిర్మించబడిన ఐదు అంతస్తుల వాణిజ్య భవనంపై చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు, "మిగతా శాఖలను అడగండి" అనే సమాధానం మాత్రమే వచ్చింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో మాత్రం అత్యంత వేగంగా కూల్చివేతలు జరగడం ప్రజల్లో సమాన న్యాయం అమలవుతోందా అనే అనుమానాలకు దారితీస్తోంది.హైడ్రా వంటి సంస్థ చట్ట పరిపాలనను బలోపేతం చేయడానికి ఉండాలి కానీ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా వ్యవహరించకూడదు. భూ చట్టాలు, సాగునీటి చట్టాలు, మున్సిపల్ చట్టాలు, పట్టణాభివృద్ధి చట్టాల అమలులో న్యాయపరమైన అవగాహన, పరిపాలనా సమతుల్యత అత్యంత అవసరం.ఈ అంశాన్ని నేను ఏ వ్యక్తి లేదా ఏ ప్రభుత్వంపై వ్యక్తిగత వ్యతిరేకతతో ప్రస్తావించడం లేదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం, చట్టం, న్యాయస్థానాల పట్ల గౌరవం ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి అధికారి చూపాల్సిన బాధ్యత. కోర్టు తీర్పుతో విభేదిస్తే చట్టబద్ధమైన అప్పీల్ చేయాలి; కానీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం లేదా న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
మత్తుపదార్థాలకు దూరంగా ఉందాం ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుందాం - మల్కాజ్గిరి పోలీస్_
*మత్తుపదార్థాలకు దూరంగా ఉందాం ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుందాం - మల్కాజ్గిరి పోలీస్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 28:
రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'యాంటీ-డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్' (Anti-Drug Awareness Program) నిర్వహించడం జరిగింది. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు మరియు చట్టపరమైన చర్యల గురించి విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు.
యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో మనందరం భాగస్వాములం అవుదాం! అనే నినాదాలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
*ముఖ్య గమనిక*: మీ చుట్టుపక్కల ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం జరిగితే వెంటనే డయల్ 100 కి లేదా ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని పోలీస్ అధికారులు అన్నారు .
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రదానం చేయనున్న టెలివిజన్ అవార్డులు_
*తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రదానం చేయనున్న టెలివిజన్ అవార్డులు*
*టెలివిజన్ అవార్డుల రూపకల్పనలో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 28:
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న టెలివిజన్ (టీవీ) అవార్డుల రూపకల్పన, మార్గదర్శకాలు, లోగో, అవార్డుల పేర్లు తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షతన టెలివిజన్ అవార్డుల కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ శంకర్ నాయక్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముకుంద రెడ్డి, టెలివిజన్ అవార్డుల కమిటీ చైర్మన్, సభ్యులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో టెలివిజన్ అవార్డులకు ప్రత్యేక లోగో రూపకల్పన, అవార్డులకు ప్రముఖ వ్యక్తి పేరును ప్రతిపాదించడం, వివిధ విభాగాల్లో అవార్డుల ప్రదానం, ఎంపిక విధానం, అవార్డుల ప్రదానోత్సవ వేదిక వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, టెలివిజన్ రంగం అత్యధిక వినోదాన్ని అందించే మాధ్యమమని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు టెలివిజన్ కార్యక్రమాల పట్ల విశేష ఆసక్తి చూపుతున్నారని అన్నారు. టెలివిజన్ రంగంలో ప్రతిభ కనబరిచిన అన్ని విభాగాల కళాకారులు, సాంకేతిక నిపుణులు, మంచి సామాజిక సందేశాలను అందించే సీరియళ్లు, కార్యక్రమాలు, బాలల చిత్రాలను రూపొందించే వారిని ప్రోత్సహించేలా అవార్డులను రూపొందిస్తామని తెలిపారు.కమిటీ సభ్యులు సూచించిన విధంగా టెలివిజన్ అవార్డులకు మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని మంత్రి తెలిపారు. బహుభాషా కోవిదుడైన పి.వి. నరసింహారావు దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన మహనీయుడని, అలాంటి మహోన్నత వ్యక్తుల పేర్లను పరిశీలించడంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు.టెలివిజన్ అవార్డులకు సంబంధించిన మార్గదర్శకాలు, లోగో, అవార్డుల పేర్లు తదితర అంశాలను వీలైనంత త్వరగా సిద్ధం చేసి సమర్పించాలని కమిటీని మంత్రి ఆదేశించారు. అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మను, సంస్కృతిని, ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో తొలిసారిగా ప్రదానం చేయనున్న ఈ టెలివిజన్ అవార్డులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, అవార్డు గ్రహీతల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలని కమిటీ చైర్మన్, సభ్యులకు మంత్రి సూచించారు.
అవార్డుల నిర్వహణలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముకుంద రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని, అవార్డుల ప్రదానోత్సవానికి రెండు లేదా మూడు వేదికల ఎంపికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
సమావేశంలో వచ్చిన అన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం టెలివిజన్ అవార్డులపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Subscribe to:
Posts (Atom)