Monday, September 14, 2026

మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి_

*"మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి"*

*శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ - బాపట్ల పుష్పలత*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 13:

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించి భక్తిశ్రద్దలతో పూజించాలని శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బాపట్ల పుష్పలత అన్నారు.హెచఎండిఏ సహకారంతో హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం( హైదరాబాద్ జిందాబాద్)మరియు శ్రీనిధి మహిళా ఫౌండేషన్ మరియు ప్రజాసంకల్పం స్వచ్చంద సంస్థ / ప్రజాసంకల్పం మీడియా ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గత పది సంవత్సరాలనుండి మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నాము అని అన్నారు.రామంతాపూర్ చిన్నచెరువు కట్ట కింద భరత్ నగర్ క్రాస్ రోడ్డు లో మరియు ఆర్టీసి కాలనీలో మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించే విధంగా అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాము అని అన్నారు.హెచ్ఎండిఏ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నదని అన్నారు.హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF) సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు  చెరువులు కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే  ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో  వైభవంగా  నిర్వహించుకొనే  “వినాయక చవితి” పండుగ  సందర్భంగా  అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను  ప్రతిష్టించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజెన్  రాలపళ్ళి కుసుమ మేడం,సరిత,ప్రజావాణి సంస్థ ఫౌండర్ ఎర్రం శ్రీనివాస్, రవీందర్ రావు, పోలిశెట్టి సత్యనారాయణ,ముదిగొండ శివ ప్రసాద్,సాయి వర్ధన్, మండల శివకుమార్,వెంకటేష్,బాపట్ల కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖ, ఫైర్ సేఫ్టీ రికార్డుల్లో అసలు వివరాలేమిటి?_

*హబ్సిగూడ ‘యోధ’ అపార్ట్‌మెంట్‌పై ప్రశ్నల వర్షం!*

- ఓసీ జారీ అయిందా? లేకుండానే ఫ్లాట్లలో నివాసం ఎలా?

- దాదాపు 20 ఫ్లాట్లు.. ఒకే విద్యుత్‌ మీటర్‌పై రూ.20–30 వేల బిల్లు ఎలా?

- నీటి కనెక్షన్‌కు ఏ పత్రాలు ఆధారం?.. లిఫ్ట్‌ విద్యుత్‌ సరఫరాపైనా సందేహాలు

- జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖ, ఫైర్ సేఫ్టీ రికార్డుల్లో అసలు వివరాలేమిటి?

మేడ్చల్ బ్యూరో సురేష్ ఇడపాక, హబ్సిగూడ, సెప్టెంబర్‌ 13(మీడియా టుడే): 

హబ్సిగూడ జేఎస్‌ఎన్‌ కాలనీలోని ‘యోధ’ అపార్ట్‌మెంట్‌ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 20 ఫ్లాట్లు ఉన్న ఈ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) జారీ అయిందా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేకుండానే కొన్ని ఫ్లాట్లలో కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందుతోంది. దీంతో భవన నిర్మాణ అనుమతులు, ఓసీ, నీటి, ఫైర్ సేఫ్టీ,విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

**ఓసీ జారీ అయిందా?**

భవన నిర్మాణానికి ఏ అనుమతులు మంజూరయ్యాయి? ఆమోదిత ప్లాన్‌ ప్రకారమే నిర్మాణం జరిగిందా? ఓసీ కోసం దరఖాస్తు చేశారా? చేసి ఉంటే దాని ప్రస్తుత స్థితి ఏమిటి? ఓసీ జారీ కాకముందే భవనంలో నివాసం కొనసాగుతున్నట్లయితే అందుకు సంబంధించిన నిబంధనలు ఏమిటి? అన్న విషయాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

భవనాన్ని అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేశారా? నిర్మాణంలో ఏవైనా తేడాలు లేదా ఉల్లంఘనలు గుర్తించారా? నోటీసులు జారీ చేశారా? అన్న వివరాలను అధికారిక రికార్డుల ఆధారంగా వెల్లడించాల్సి ఉంది.

**నీటి కనెక్షన్‌ ఎలా వచ్చింది?**

భవనంలో కుటుంబాలు నివాసం ఉంటున్న నేపథ్యంలో నీటి కనెక్షన్‌ అంశం కూడా ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 20 ఫ్లాట్లకు నీటి సరఫరా కోసం కనెక్షన్‌ ఎప్పుడు మంజూరైంది? ఏ కేటగిరీలో ఇచ్చారు? కనెక్షన్‌ మంజూరు సమయంలో భవన నిర్మాణ అనుమతులు, ఓసీ లేదా ఇతర అవసరమైన పత్రాలను పరిశీలించారా? అన్న ప్రశ్నలకు వాటర్‌ వర్క్స్‌ అధికారులు సమాధానం ఇవ్వాల్సి ఉంది.

నీటి కనెక్షన్‌కు సంబంధించిన దరఖాస్తు, మంజూరు పత్రాలు, కనెక్షన్‌ నంబర్‌, కేటగిరీ తదితర వివరాలను అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

**దాదాపు 20 ఫ్లాట్లు.. మీటర్‌ ఒక్కటేనా?**

అపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం సుమారు ఐదు ఫ్లాట్లలో కుటుంబాలు నివసిస్తున్నట్లు సమాచారం. అయితే భవనానికి ఒకే విద్యుత్‌ మీటర్‌ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ మీటర్‌కు నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు విద్యుత్‌ బిల్లు వస్తున్నట్లు సమాచారం. అదే విద్యుత్‌ సరఫరా నుంచి లిఫ్ట్‌ కూడా పనిచేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ఇది వాస్తవమైతే.. దాదాపు 20 ఫ్లాట్లకు ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి? ప్రస్తుతం ఉన్న మీటర్‌ ఏ కేటగిరీకి చెందినది? ఒకే మీటర్‌ ద్వారా పలు ఫ్లాట్లకు విద్యుత్‌ సరఫరా జరుగుతోందా? లిఫ్ట్‌కు కూడా అదే కనెక్షన్‌ నుంచి విద్యుత్‌ వినియోగిస్తున్నారా? అన్న అంశాలపై విద్యుత్‌ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

నెలకు రూ.20–30 వేల వరకు బిల్లు నమోదవుతున్నట్లయితే ఆ మీటర్‌ వినియోగ వివరాలు, కనెక్షన్‌ కేటగిరీ, మీటర్‌ సామర్థ్యం, గత బిల్లింగ్‌ చరిత్ర తదితర అంశాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.

**లిఫ్ట్‌ భద్రతపై తనిఖీలు జరిగాయా?**

అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ వినియోగంలో ఉంటే దానికి సంబంధించిన అనుమతులు, నిర్వహణ, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లిఫ్ట్‌కు విద్యుత్‌ సరఫరా ఏ కనెక్షన్‌ నుంచి జరుగుతోంది? సంబంధిత భద్రతా తనిఖీలు, అనుమతులు ఉన్నాయా? అన్న అంశాలపైనా సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

**బిల్డర్ ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నారా??**

 ఫైర్ ఎక్స్‌టింగిషర్లు (Fire Extinguishers): ప్రతి ఫ్లోర్‌లో, కారిడార్లలో సులభంగా అందుబాటులో ఉండేలా ఫైర్ ఎక్స్‌టింగిషర్లను ఏర్పాటు చేశారా??. 

**సంబంధిత శాఖలు.. సమాధానాలు ఎక్కడ?**

ఈ వ్యవహారంలో జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. భవన నిర్మాణ అనుమతులు, ఆమోదిత ప్లాన్‌, ఓసీ విషయంలో జీహెచ్‌ఎంసీ.. నీటి కనెక్షన్‌ విషయంలో వాటర్‌ వర్క్స్‌.. విద్యుత్‌ మీటర్‌, కనెక్షన్‌ కేటగిరీ, బిల్లింగ్‌ విషయంలో విద్యుత్‌ శాఖ తమ రికార్డుల ఆధారంగా వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.ఫైర్ సేఫ్టీ అధికారులు NOC ఇచ్చారా ??

భవన నిర్మాణం నుంచి నివాసం ప్రారంభమయ్యే వరకు ఆయా శాఖల అధికారులు ఎప్పుడు తనిఖీలు నిర్వహించారు? ఏ పత్రాలను పరిశీలించారు? ఎలాంటి అనుమతులు మంజూరు చేశారు? ఏవైనా అభ్యంతరాలు లేదా ఉల్లంఘనలు గుర్తించారా? అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు అవసరమవుతున్నాయి.

**ఫ్లాట్‌ కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చారా?**

జీవితకాల పొదుపుతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవనానికి సంబంధించిన నిర్మాణ అనుమతులు, ఓసీ పరిస్థితి, నీటి, విద్యుత్‌ కనెక్షన్ల వివరాలు ముందుగానే తెలియజేశారా? ఓసీ ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే ఆ విషయం కొనుగోలుదారులకు వెల్లడించారా? స్వాధీనం ఇచ్చే సమయంలో అవసరమైన పత్రాలను పరిశీలించారా? అన్న అంశాలపై కూడా స్పష్టత అవసరం.

భవనానికి సంబంధించిన అనుమతులు, సర్టిఫికెట్లు, కనెక్షన్ల వివరాలపై భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు వాస్తవాలను స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

**అధికారిక రికార్డులు వెల్లడించాలి**

భవన నిర్మాణ అనుమతి, ఆమోదిత ప్లాన్‌, ఓసీ దరఖాస్తు మరియు ప్రస్తుత స్థితి, జారీ చేసిన నోటీసులు, నీటి కనెక్షన్‌ వివరాలు, విద్యుత్‌ మీటర్ల సంఖ్య, కనెక్షన్‌ కేటగిరీ,ఫైర్ సేఫ్టీ అధికారులు NOC ఇచ్చారా??బిల్లింగ్‌ వివరాలు తదితర అంశాలను సంబంధిత శాఖలు రికార్డుల ఆధారంగా వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

**స్పష్టత కావాల్సిన ప్రధాన అంశాలు..**

ఓసీ జారీ అయిందా?
నీటి కనెక్షన్‌ ఏ పత్రాల ఆధారంగా మంజూరైంది?
దాదాపు 20 ఫ్లాట్లకు ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి?
ఒకే మీటర్‌పై నెలకు రూ.20–30 వేల బిల్లు ఎలా నమోదవుతోంది?
అదే మీటర్‌ నుంచి లిఫ్ట్‌కు కూడా విద్యుత్‌ సరఫరా జరుగుతోందా? ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి NOC ఇచ్చారా ??
మూడు శాఖల అధికారులు ఇప్పటివరకు ఏ తనిఖీలు నిర్వహించారు?
ఫ్లాట్‌ కొనుగోలుదారులకు అన్ని అనుమతుల వివరాలు ముందుగానే తెలియజేశారా?

ఈ అంశాలపై జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖల అధికారులు అధికారిక రికార్డుల ఆధారంగా స్పష్టత ఇవ్వడంతో పాటు వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు కోరుతున్నారు.

Saturday, September 12, 2026

హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_

*హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు.శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో #Hyderabad మహానగరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వెం నరేందర్ రెడ్డి, నగర ప్రజాప్రతినిధులు,కమీషనర్ ghmc , సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్ , మల్కాజ్గిరి మున్సిపల్ కమీషనర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ ,హైడ్రా కమీషనర్ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలని కోరారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్వాహకులకు తెలిపారు.ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత సంప్రదాయాన్ని పునరుద్ధరించామని చెప్పారు. నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తానే సమీక్ష నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.గణేశ్ మండపాలకు అతిథులను ఆహ్వానించిన సందర్భాల్లో ఆ వివరాలను నిర్వాహకులు స్థానిక కమిషనరేట్‌కు అందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని పరిణామాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు అందించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, అయితే, మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని చెప్పారు.
ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగడానికి చెరువుల వద్ద చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - నల్లకుంట ఇన్స్పెక్టర్ SHO మారుతి ప్రసాద్_

*మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - నల్లకుంట ఇన్స్పెక్టర్ SHO మారుతి ప్రసాద్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

వినాయక చవితి పండుగను, భక్తి శ్రద్దలతో, సంప్రదాయాలతో, పర్యావరణాన్ని కాపాడుకుంటూ జరుపుకుందామని నల్లకుంట ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ పిలుపునిచ్చారు.నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ NCA, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం HCF ఆధ్వర్యంలో ఈరోజు నల్లకుంటలో జరిగిన మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మారుతి ప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు  చెరువులు, కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే  ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో  వైభవంగా  నిర్వహించుకొనే  “వినాయక చవితి” పండుగ  సందర్భంగా  అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను  ప్రతిష్టించాలని అన్నారు.
కార్యక్రమంలోNCA అధ్యక్షులు వి మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి మోహన్ నాయుడు, పి శ్రీనివాసరావు, HCF ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య, రామకృష్ణారావు, రాజీవ్ కుమార్, డాక్టర్ అమర్నాథ్, సత్యనారాయణ,  కృష్ణ బాబు, కిరణ్, గోపాల్, శివకుమార్, వినోద్, సుకుమార్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

దళితుల ఇల్లు కూల్చివేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి_

*దళితుల ఇల్లు కూల్చివేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

12 సెప్టెంబర్ 2026, శనివారం నాడు డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ ఆధ్వర్యంలో  మానవ హక్కుల వేదిక కార్యకర్త సంజీవ్, అంబేద్కర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి , హైకోర్టు న్యాయవాది ఎద్దు దివాకర్, సామాజిక కార్యకర్త భాస్కర్ లతో కలిసి గద్వాల జిల్లా, గద్వాల మండలం,రేపల్లె గ్రామాన్ని సందర్శించి దళితుల కూల్చివేత ను పరిశీలించారు. బాధిత కుటుంబంతో గ్రామస్తులతో మాట్లాడి సంఘటన సంబంధించిన వివరాలను సేకరించారు.మాదిగ కులానికి చెందిన అబ్బాయి బోయ కులానికి చెందిన అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకళ్ళను ఒకళ్ళు ఇష్టపడ్డారు. 9 సెప్టెంబర్ 2026 న హైదరాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాదులో  మాసబ్ ట్యాంకు  పోలీసులను కలిసి తాము పెళ్లి చేసు కొన్నామని రక్షణ కల్పించాలని కోరారు. ఇరు కుటుంబాలను పోలీసులు పిలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు. కులాంతర వివాహం పై  ఆగ్రహించిన కుటుంబ సభ్యులు దాదాపు 15 మంది 10 సెప్టెంబర్ 2026 మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో దళితుడైన రంగముని ఇంటిని గడ్డపారలు, ట్రాక్టర్ తదితర వస్తువులతో కాయకష్టం చేసి దళితులు కట్టుకున్న ఇల్లును నేలమట్టం చేశారు. 10వ తారీఖునే FIR నమోదు చేశారు. 6 మందిని అరెస్ట్ చేశారు. అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 12 వ తారీఖున డీఎస్పీ మోగులయ్య రేపల్లె గ్రామాన్ని సందర్శించారు. నిజనిర్ధారణ బృందం డీఎస్పీ మొగులయ్యని, గద్వాల రూరల్  సబ్ ఇన్స్పెక్టర్ని కలిసి, దాడిలో పాల్గొన్న అందర్నీ, దాడికి ప్రోత్సహించిన వారందర్నీ గుర్తించి అరెస్ట్ చేయవలసిందిగా కోరింది. FIR లో నమోదు చేసిన సెక్షన్లతో పాటు, ఆస్తి నష్టానికి సంబంధించిన సెక్షన్లు కూడా నమోదు చేయమని కోరింది.ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం ఇల్లు కూల్చివేసిన వేసిన నిందితుల నుండి నష్టపరిహారాన్ని జరిమాన రూపంలో వసూలు చేసి తిరిగి దళితుల ఇల్లు నిర్మించాలని నిజ నిర్ధారణ బృందం  డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం నిందితులను గ్రామానికి దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు. సంఘటన కేవలం బోయలు చేసింది మాత్రమే కాదని దీని వెనుక ఆధిపత్య రెడ్డి వర్గం ప్రోత్సహించినట్లు వివరించారు. వారిని సైతం గుర్తించి చర్యలు తీసుకోవాలని వెంటనే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేసింది.

ధర్మో రక్షతి రక్షితః - ఖైరతాబాద్ ధర్మరక్షణ సభ_

*ధర్మో రక్షతి రక్షితః - ఖైరతాబాద్ ధర్మరక్షణ సభ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

ఖైరతాబాద్ ధర్మరక్షణ సభ అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో సంఘ పెద్దలు, ఉత్సవ సమితి పదాధికారులు, కన్వీనర్లు, కేంద్ర కమిటీ సభ్యులు మరియు కో-కన్వీనర్లు పాల్గొన్నారు.
**సమావేశంలోని ముఖ్యాంశాలు:**
 ఉత్సవాల ప్రణాళిక: రాబోయే 47వ సామూహిక గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు.
**ప్రత్యేక సందర్భాలు:** వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరియు హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం ప్రాధాన్యతను సభలో ప్రస్తావించారు.ఘనంగా ఉత్సవాలు: రాబోయే వినాయక నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు.

పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_

*ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఖాతాల్లోకి డైరెక్టుగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది*

*పాలిలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి*

*పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, పాలిటెక్నిక్ విద్యలో తీసుకొచ్చిన మార్పులు, వాటిపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు.. వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టమైన వివరణ ఇచ్చారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన సమాధానమిచ్చి ఆయా వర్గాల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను నివృతి చేశారు.
పాలిలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విద్యార్థులు ఎవరి చేతుల్లోనో పావులుగా, కీలుబొమ్మలుగా మారొద్దని కోరారు. ముందు యుగం దూతలుగా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, నిజాయితీగా వివరాలందించిన కాలేజీల రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతల వారిగా చెల్లిస్తామని చెప్పారు.ప్రజాప్రభుత్వం విద్యా రంగానికి ఎందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందో సభలో వివరించిన ముఖ్యమంత్రి సభ్యులు లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానమిచ్చారు. 
ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలలను విద్యాశాఖ పరిధి నుంచి స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీయడానికి కాదని, వారిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకేనని తెలిపారు.
ఈ విషయంలో ఇప్పటికీ అనుమానాలుంటే సభ్యులు, నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చర్యలు చేపట్టి సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

*“విద్య ఒక్కటే మన జీవితాల్లో వెలుగును తీసుకొస్తుంది” అనే సంపూర్ణ విశ్వాసంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.*

సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కాకుండా విద్య లేకపోవడమే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
“తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించేందుకు కే కేశవరావు గారి నేతృత్వంలో కమిటీని నియమించాం. సభ్యులు, విద్యా రంగ నిపుణులు ఎవరైనా తమ సూచనలు, సలహాలను కమిటీకి అందిస్తే వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
విద్యాశాఖను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించడం ఆ శాఖకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం.  తాను విద్యాశాఖపై ఒక తపనతో పనిచేస్తున్నా. ముఖ్యమంత్రి హోదాలో విద్యాశాఖను సమీక్షిస్తే మొత్తం వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరుగుతుంది.2023-24లో గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయించగా, తమ ప్రభుత్వం 2024-25లో రూ.21,292 కోట్లు కేటాయించాం. 2025-26లో రూ.23,108 కోట్లకు, 2026-27లో రూ.26,647 కోట్లకు పెంచాం.  కేవలం మూడేళ్లలోనే విద్యాశాఖ బడ్జెట్‌ను రూ.7,554 కోట్ల మేర పెంచాం” అని ముఖ్యమంత్రి గారు సభ ముందు వివరించారు.

*“తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేవలం 55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేశాం.*

ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7,857 మంది ఉపాధ్యాయులను మాత్రమే నియమించింది” అని పేర్కొన్నారు.“జెన్ జీ ఒక్కటే కాదు. రానున్న జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తున్నాం. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది.. తలరాతలను మార్చేది విద్య” అనే నమ్మకంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నా. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తెలంగాణకు తీసుకొచ్చేందుకు, దేశానికి తెలంగాణను ఒక రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం” అని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న ఆదరణ
“విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మేర పెరిగిందని సీఎం తెలిపారు. ఇది తన పనితీరుకు నిదర్శనమన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో రెండున్నరేళ్లకే పిల్లలను చేర్చుకుంటుండగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్ల వయసు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నర్సరీ, ఎల్‌కేజీతో పాటు ఇంగ్లిష్ మీడియం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్తున్నారు.
అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ-ప్రైమరీ విధానాన్ని ప్రారంభించాం. ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులకు ప్రీ-ప్రైమరీ విద్య అందిస్తున్నాం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా నాణ్యమైన, పరిశుభ్రమైన బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం” అని వివరించారు.

**పాలిటెక్నిక్‌లపై అపోహలు వద్దు**

“పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన జీఓ ఎంఎస్ నెం.97పై కొన్ని వివాదాలు తలెత్తాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తారనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. “పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణ అనే ప్రసక్తే లేదు” అని సభలో స్పష్టం చేశారు.ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు ఇకపై కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయి.  కేవలం సాంకేతిక విద్యా వ్యవస్థను స్కిల్స్ యూనివర్సిటీ పరిధితో అనుసంధానం చేస్తున్నాం.
ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి టాటా సంస్థ సహకారంతో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. అంతమాత్రాన ఐటీఐలను ప్రైవేటు పరం చేసినట్లు కాదు. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్‌షిప్ అందించాలని నిర్ణయించాం” అని చెప్పారు.పాలిటెక్నిక్‌ల విషయంలో భూములు అమ్ముకుంటారని, ఉద్యోగాలు పోతాయని కొందరు విద్యార్థుల్లో అపోహలు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రభుత్వం అదనంగా 282 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏటీసీలకు బదలాయించిందని, ఒక్కో ఏటీసీపై సుమారు రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

**పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా... **

సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడమే పాలిటెక్నిక్‌లను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి గారు వివరించారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్ లను టాటా టెక్నాలజీ సంస్థ సహకారంతో రూ. 4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు.
విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలను పెంచడమే లక్ష్యమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా టాటా టెక్నాలజీస్ సంస్థ సహకారంతో కోర్సులను ఆధునీకరిస్తామని చెప్పారు.
సాంకేతిక విద్య–నైపుణ్యాభివృద్ధి విభాగాల అనుసంధానంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌లు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో నెలకొన్న అపోహలను తొలగిస్తామని, జీఓలో సవరణలు అవసరమైతే వాటిని కూడా చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్స్ యూనివర్సిటీకి ఏఐసీటీఈ అనుమతి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
పేద విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని అన్నారు. వారి భవిష్యత్తును మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలని సభ్యులను కోరారు.

**ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లెక్కలు...**

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపైనా ముఖ్యమంత్రి సభలో స్పష్టత ఇచ్చారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5,435 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వదిలివెళ్లిందని తెలిపారు. అందులో గత ప్రభుత్వం పెట్టిన బకాయిల నుంచి రూ.1,410 కోట్లు తమ ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందన్నారు.అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ.1,465 కోట్లను చెల్లించామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం చెల్లించిన వాటితో కలిపి మొత్తంగా 32 నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.3,488 కోట్లు చెల్లించినట్లు సభలో వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఖాతాల్లోకి డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల కోసం అడ్వాన్స్‌గా గ్రీన్ చానెల్‌లో డబ్బు చెల్లిస్తున్నామని చెప్పారు. బకాయిల విషయంలో విజిలెన్స్ నివేదికను పరిశీలించిన తర్వాత నిజాయితీగా ఉన్న వాటన్నింటినీ బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.విద్యను కేవలం ఒక శాఖగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే సాధనంగా భావిస్తున్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి  విద్య, నైపుణ్యం, ఉద్యోగం, ఉపాధిని అనుసంధానించేలా సంస్కరణలు చేపట్టామని తెలిపారు