Saturday, September 19, 2026

ప్రతిపాదిత బహుళ ఫ్లైఓవర్ల నుండి ఒకే ఎలివేటెడ్ కారిడార్ వైపు ప్రభుత్వం మళ్లడానికి గల కారణాలు_

*తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని నిలిపివేసి,వాటి స్థానంలో ఎలివేటెడ్ కారిడార్‌ ను ఎందుకు ఏర్పాటు చేస్తుంది - సేవ్ కేబీఆర్*

*డీపీఆర్ మరియు పూర్తి వాస్తవ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి - సేవ్ కేబీఆర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 18:

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) జాతీయ పార్కును మరియు దాని చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత మండలాన్ని (Eco-Sensitive Zone) కాపాడుకోవడానికి పౌరులు, పర్యావరణ ప్రేమికులు 'సేవ్ కేబీఆర్' (#SaveKBR) ఉద్యమాన్ని చేపట్టారు.ప్రభుత్వ ప్రతిపాదిత ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాల (H-CITI / SRDP ప్రాజెక్ట్‌లు) వల్ల వందలాది ఏళ్ల నాటి చెట్లు నరికివేతకు గురవుతుండటంతో ఈ ఆన్‌లైన్ పిటిషన్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది.కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని నిలిపివేసి, వాటి స్థానంలో ఎలివేటెడ్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై స్పందించాలని చాలా మీడియా సంస్థలు సేవ్ కేబీఆర్ (SaveKBR) బృందాన్ని అడిగారు.దీనిపై సేవ్ కేబీఆర్ ఇచ్చిన వివరణ.

**ప్రతిపాదిత బహుళ ఫ్లైఓవర్ల నుండి ఒకే ఎలివేటెడ్ కారిడార్ వైపు ప్రభుత్వం మళ్లడానికి గల కారణాలు:**

*(1)*: క్షేత్రస్థాయిలో పౌరుల నిరంతర ప్రతిఘటన,

*(2)*: సుప్రీంకోర్టు జోక్యం - కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ ఉన్న 25–35 మీటర్ల పర్యావరణ సున్నిత ప్రాంతం (ESZ)లో చెట్లను నరకడాన్ని నిరోధిస్తూ, కాజల్ మహేశ్వరి వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో ఎస్ఎల్పీ (సి) నెం. 17054/2026 కింద సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు ఇప్పటికీ అమలులో ఉంది.

*(3)*: ప్రభావిత భూ యజమానులు హైకోర్టులో వేసిన న్యాయపరమైన సవాళ్లు.

అయితే, అది ఒక ఎలివేటెడ్ కారిడార్ అయినా లేదా బహుళ ఫ్లైఓవర్లు అయినా, ఎప్పటిలాగే జవాబుదారీతనం విషయంలో రాజీ పడకూడదు. రాష్ట్ర ప్రభుత్వం మరియు జీహెచ్‌ఎంసీ ముందుకు వెళ్లే ముందు డీపీఆర్, వివరణాత్మక ట్రాఫిక్ అధ్యయనాలు, పర్యావరణ అంచనాలు మరియు వాటికి మద్దతుగా ఉన్న సాంకేతిక అధ్యయనాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
ప్రజా ఖజానా ఇప్పటికే గణనీయమైన ఖర్చులను భరించిన తర్వాత, దాదాపు 1,000 చెట్లు నష్టపోయిన తర్వాత, న్యాయం కోసం పౌరులు తమ వ్యక్తిగత సమయాన్ని, శక్తిని, నిధులను కోర్టు కేసులపై వెచ్చించిన తర్వాత - కొత్త ప్రతిపాదన యొక్క అవసరాన్ని, సాధ్యతను మరియు పర్యావరణ పరిణామాలను నిర్ధారించకుండా, కేవలం తాము ఆందోళన చెందుతున్నామని చెప్పి, డిజైన్‌ను మార్చి ముందుకు సాగడం జీహెచ్‌ఎంసీ మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తగదు.ఇది కేవలం ఒక ఫ్లైఓవర్ లేదా ఒక కారిడార్‌కు సంబంధించిన విషయం కాదు. పర్యావరణ సున్నిత మండలాన్ని (ESZ) ప్రభావితం చేసే ఏ ప్రాజెక్టుతోనైనా ముందుకు వెళ్లే ముందు, ప్రభుత్వం ఇప్పుడు పారదర్శకమైన, శాస్త్రీయమైన మరియు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించి, ఆ ప్రాంతంపై సుప్రీంకోర్టు విచారణల ఫలితాన్ని గౌరవిస్తుందా లేదా అనేదే అసలు విషయం.

ఎన్నికల అఫిడవిట్ తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి_

*సున్నా ఎకరాల నుండి  వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్*

*ఎన్నికల అఫిడవిట్ తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 17:

తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన కేసీఆర్ గారికి, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయి..?.తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్ గారికి భూములు భారీగా పెరిగిన విషయం, స్వయంగా కేసీఆర్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ల ద్వారా స్పష్టమవుతుంది.బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు అప్పులే మిగిలాయి, కానీ కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి..? ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా..! ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద లక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబం..పుట్టుకతోనే కేసీఆర్ గారికి వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్న డ్రామారావు, ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు రాసి మోసం చేసారా? లేక, ప్రజలకు అబద్దాలు చెప్తున్నారా...?

చరిత్రను రాజకీయ ప్రయోజనాలకు కాకుండా... భవిష్యత్ తరాలకు అందిద్దాం-యంపల్ల పురుషోత్తం రెడ్డి - చైర్మన్, తెలంగాణ జేఏసీ, నల్లగొండ జిల్లా_

ప్రెస్ నోట్ 

*చరిత్రను రాజకీయ ప్రయోజనాలకు కాకుండా... భవిష్యత్ తరాలకు అందిద్దాం*

*యంపల్ల పురుషోత్తం రెడ్డి -  చైర్మన్, తెలంగాణ జేఏసీ, నల్లగొండ జిల్లా*

బాపట్ల కృష్ణమోహన్, సెప్టెంబర్ 17:

చరిత్రలో ఒక కీలకమైన చారిత్రక ఘట్టం. ఈ రోజును విలీన దినోత్సవం, విమోచన దినోత్సవం, జాతీయ సమైక్యత దినోత్సవం, ప్రజా పాలన దినోత్సవం వంటి భిన్న పేర్లతో వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు తమ తమ దృక్పథాల మేరకు గుర్తిస్తున్నాయి.భిన్న అభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో సహజమే.అయితే చారిత్రక ఘటనలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు, రాజకీయ ప్రయోజనాలకు లేదా పరస్పర ఆరోపణలకు పరిమితం చేయడం మాత్రం సమాజానికి మేలు చేయదు.1948 నాటి పరిణామాలను రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకుని చెప్పడం కాకుండా, ఆ కాలం నాటి సమగ్ర చరిత్రను ప్రజల ముందుంచాలి. నిజాం పాలన, రజాకార్ల పాత్ర, తెలంగాణ రైతాంగ పోరాటం, ప్రజల త్యాగాలు, భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం ఏకీకరణకు దారితీసిన పరిణామాలు — చరిత్రలోని ప్రతి కోణాన్ని ఆధారాలతో ప్రజలకు, ముఖ్యంగా నేటి యువతకు అందించాలి.

**తెలంగాణ జేఏసీ కార్యాచరణ పిలుపు**

ఈ నేపథ్యంలో తెలంగాణ జేఏసీ తరఫున ప్రజలకు, మేధావులకు, చరిత్రకారులకు, విద్యావేత్తలకు, యువతకు మా విజ్ఞప్తి:

*(1)*: చరిత్రపై చర్చ జరగాలి... కానీ చరిత్ర వక్రీకరణకు తావుండకూడదు.

*(2)*: భిన్న అభిప్రాయాలు ఉండాలి... కానీ పరస్పర ద్వేషానికి తావుండకూడదు.

*(3)*: రాజకీయ కార్యక్రమాలు జరగవచ్చు... కానీ చరిత్రను ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం చేయకూడదు.

*(4)*: ప్రతి గ్రామం, మండలం, పట్టణంలో రాజకీయాలకు అతీతంగా చారిత్రక చర్చలు, సదస్సులు నిర్వహించాలి. పాత పత్రాలు, అరుదైన ఫొటోలు, ప్రత్యక్ష సాక్షుల జ్ఞాపకాలు, చారిత్రక ఆధారాలను సేకరించి భద్రపరచాలి. విద్యార్థులు, యువత చరిత్రపై అధ్యయనం చేసి వాస్తవాలను తెలుసుకునేలా ప్రోత్సహించాలి.

*(5)*: సోషల్ మీడియాలో ఆధారాలు లేని ప్రచారాన్ని నమ్మకుండా, చారిత్రక ఆధారాలతో నిజానిజాలను పరిశీలించే బాధ్యతాయుతమైన పౌర సంస్కృతిని పెంపొందించాలి.

**చరిత్ర ఎవరి సొత్తు కాదు**

సెప్టెంబర్ 17 ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదు. ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. అది తెలంగాణ ప్రజల చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం.అందుకే ఈ చారిత్రక రోజును రాజకీయ విభేదాలకు వేదికగా కాకుండా, చరిత్రను తెలుసుకునే, త్యాగాలను స్మరించుకునే, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే సందర్భంగా మలచాలి.ఓట్ల కోసం చరిత్రను ఉపయోగించకండి...
చరిత్ర నుంచి భవిష్యత్ తరాలు నేర్చుకునేలా చేయండి. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను మలచకండి...
వాస్తవ చరిత్రను రేపటి తరాలకు అందించండి.చరిత్రను మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు...చరిత్ర నుంచి మనల్ని మనం తెలుసుకోవడం ముఖ్యం.
వాస్తవాలను తెలుసుకుందాం.
భిన్న దృక్పథాలను గౌరవిద్దాం.
చారిత్రక ఆధారాలను పరిరక్షిద్దాం.రేపటి తరాలకు వాస్తవ చరిత్రను అందిద్దాం.
ఇదే తెలంగాణ జేఏసీ ప్రజలకు ఇస్తున్న పిలుపు.

తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మల పాత్ర అనిర్వచనీయం - ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్_

*తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మల పాత్ర అనిర్వచనీయం - ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 17:

ఉప్పల్ బాగాయత్ లోని తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ విశ్వకర్మలు కేవలం సృష్టికర్తలే కాదు… నవనాగరికత, ప్రగతి చోదకులు అని అన్నారు.సబ్బండ వర్గాలకు, ఉత్పత్తి కులాలకు ఆరాధ్య దైవం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు
 మారుతున్న కాలానికి అనుగుణంగా చేతివృత్తుల్లో సాంకేతిక నైపుణ్యం, వ్యాపార మెళకువలు పెంచుకోవాలి. రాజకీయ చైతన్యంతోనే శాసన నిర్మాణంలో భాగస్వామ్యం, హక్కుల సాధన సాధ్యం.సృష్టి నిర్మాణానికే కాక నవనాగరికత, ఆధునిక ప్రగతికి విశ్వకర్మలే ఆద్యులని, సబ్బండ వర్గాలకు, సమస్త ఉత్పత్తి కులాలకు విశ్వకర్మ భగవానుడే మూలకారకుడని తెలంగాణ శాసనమండలి సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం / వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కీలక అంశాలను ప్రస్తావించారు:సృష్టికి మూలకారకులు: బ్రహ్మ ఆలోచన చేస్తే, ఆ ఆలోచనకు క్రియారూపం ఇచ్చి, జీవం పోసి సృష్టిని నిలబెట్టిన మహోన్నతుడు విశ్వకర్మ భగవానుడు. బంగారం, లోహం, చెక్క, శిల్పం, వస్త్రం ఇలా ఏ ఉత్పత్తి రంగమైనా సృష్టికి జీవం పోసింది విశ్వకర్మలేనని, సమాజంలోని సమస్త ఉత్పత్తి కులాలకు ఆయనే ఆరాధ్య దైవమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మల పాత్ర అనిర్వచనీయం: తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకులు, బరిశెలు తయారు చేసి పోరాటానికి ఆయుధాలు సమకూర్చిన ఘనత విశ్వకర్మలదేనని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో 'తెలంగాణ జనసభ' ద్వారా వెయ్యికి పైగా సభలు పెట్టి ఉద్యమించిన మారోజు వీరన్న, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రాణత్యాగం చేసిన అమరుడు కాసోజు శ్రీకాంతాచారి, ఉద్యమంలో కీలకంగా నిలిచిన సిరికొండ మధుసూదనాచారి వంటి విశ్వకర్మ బిడ్డల పాత్ర ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు.వృత్తులపై దాడి – వ్యాపార మెళకువల ఆవశ్యకత: మార్కెట్ ఎకానమీ, సాంకేతిక మార్పుల వల్ల ఒకప్పుడు సమాజాన్ని శాసించిన విశ్వకర్మలు నేడు యాచన చేసే దుస్థితికి చేరడం బాధాకరమన్నారు. టాటాలు, బిర్లాల వంటి బహుళజాతి సంస్థల వ్యాపార ధోరణి వల్ల పుస్తెమెట్టెల నుంచి కలప పనుల దాకా సంప్రదాయ చేతివృత్తులన్నీ దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో 'కుబుసం' చిత్రంలో గోరేటి వెంకన్న రాసిన 'పల్లె కన్నీరు పెడుతుందో' పాట నాటి పరిస్థితి నుంచి నేటికీ గ్రామీణ చేతివృత్తుల బతుకుల్లో పెద్ద మార్పు రాలేదని గుర్తుచేశారు.విద్యతో పాటు విత్తం, రాజ్యాధికారం: విశ్వకర్మల వద్ద అపారమైన నైపుణ్యం, విద్య ఉన్నప్పటికీ, దానిని వ్యాపారంగా మార్చే యుక్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని స్వయంగా పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. విద్యకు విత్తం (ఆర్థిక శక్తి) తోడవ్వాలని, ఆ ఆర్థిక బలం రాజకీయ అధికారంగా మారినప్పుడే మన సమస్యలకు మనమే చట్టాలు చేసుకోగలమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ఉన్న నాయకులు రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు బాణాల నారాయణాచారి, ప్రధాన కార్యదర్శి నాగారం భాస్కరాచారి, కోషాధికారి మహేశ్వరం వేణుగోపాలాచారి, బీసీ ఉద్యమ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, భవన నిర్మాణ దాతలు బ్రహ్మశ్రీ జి.ఆర్. సూర్యరాజు, కుందారం గణేశాచారి, వేములవాడ మదన్మోహన్, బొడ్డుపల్లి సుందర్, వెంజమూరి రాఘవాచారి, బొడ్డుపల్లి రవి ప్రశాంతాచార్య, రాగిపల్లి రవీంద్రాచారి, ఎర్రోజు వేణుగోపాల్, దానకర్ణాచారి, తదితరులు పాల్గొన్నారు.

Wednesday, September 16, 2026

జర్నలిస్టులు పిరికి వాళ్ళా.? నాటి దుమ్ము , ధైర్యం ఎక్కడికి పోయింది. డబ్బు సంపాదించిన వాడి చేతుల్లో కీలుబొమ్మలు అయ్యారా?_

*_ఇదే 'నా' జర్నలిజం_*
ఈడీ భారీ దాడులపై *_తెలుగు మీడియా సైలెన్స్ దేనికి రా..?_*
_# యాజమాన్య పాదాల కింద నలుగుతున్న వైనాలు_
_# కొండెక్కిన గుండె ధైర్యం_
_# దమ్మున్నోళ్ళు ఎక్కడ.?_

_(తెలుగు జర్నలిజంపై ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009 అందిస్తున్న సంచలన కథనం)_

జర్నలిస్టులు పిరికి వాళ్ళా.? నాటి దుమ్ము , ధైర్యం ఎక్కడికి పోయింది. 
డబ్బు సంపాదించిన వాడి చేతుల్లో కీలుబొమ్మలు అయ్యారా.? అంతరాత్మ ఎక్కడికి పోయింది.? బట్ నేను..నేనే. నన్ను కొనెటోడు లేడు. పుట్టలేదు. కేసులు 'వెంట్రుక'తో సమానం‌. జైళ్ళ గోడలు బద్దలు కొట్టుకొని.. 'ఫాంహౌజ్ పశుపతి'ని పడుకోపెట్టిన 'నా' జర్నలిజం ఇంతే ఉంటది. నాకు దుమ్ము, ధైర్యం ఉంది. అందుకే 'తెలుగు జర్నలిస్టు'ల తరఫున 'నా' కథనం ఇలాగే ఉంటుంది ర్రా.. రాజకీయుల్లారా.! 'యూజ్ లెస్ ఫేలోస్'.

*_గ్రూప్‌పై ఈడీ దాడులు, రుణాల మోసం & మీడియా సంబంధాలపై సమగ్ర కథనం…:_*
AMR సంస్థ పై ఈడీ రైడ్స్ కి సంబంధించి తెలుగు దినపత్రికల్లో ఎక్కడా వార్తలు రాయడం లేదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు చేసిన ట్వీట్ చూసి ఆశ్చర్యం వేసింది ..

*_ఏందిరా ఇది.!:_*
'ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఇది తెలుగు మీడియాలో ఎందుకు హైలెట్ కాలేదు' అని స్టడీ చేస్తే . . ఆ సంస్థ యజమానికి తెలుగు మీడియా సంస్థల యజమానులకు ఉన్న ఆర్ధిక సంబంధాలపై సమాచారం తెలిసింది.

*_మాకేం తెల్వద్.. కన్పించద్_*
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్ సంస్థ AMR ఇండియా లిమిటెడ్ (AMR India Limited), దాని ప్రమోటర్ అల్తురు మహేష్ కుమార్ రెడ్డి (A. Mahesh Reddy) నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దేశవ్యాప్తంగా ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద హైదరాబాద్ (కమలాపురి కాలనీ/బంజారాహిల్స్ పరిసరాలు), కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.

*_రుణాల బాగోతం_*
ఈడీ దాడుల వెనుక ప్రధాన కారణాలు & ఆరోపణలు
కోల్‌కతాకు చెందిన NBFCలు అయిన SREI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ (SIFL), SREI ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ (SEFL) నుంచి ఒడిశాకు చెందిన ARSS గ్రూప్, AMR గ్రూప్ భారీగా రుణాలు తీసుకున్నాయి.

*_రూ.919 కోట్లా..?_*
నిబంధనలకు విరుద్ధంగా పొందిన ఈ రుణాలను ప్రాజెక్టుల కోసం కాకుండా ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించడం (Fund diversion), ‘ఎవర్‌గ్రీనింగ్’ పేరిట రౌండ్ ట్రిప్పింగ్ చేయడం, తిరిగి చెల్లించకుండా ఎగవేతకు పాల్పడటం వంటి ఆర్థిక నేరాలపై ఈడీ విచారణ జరుపుతోంది. SREI క్లెయిమ్‌లలో ఒక్క ARSS గ్రూప్‌పైనే దాదాపు ₹919 కోట్ల వివాదం ఉంది.

*_రశీదులు ఇచ్చి మరీ.._*
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని మైనర్ ఖనిజాల రవాణాపై సీనరైజ్ ఫీజు వసూలు చేసేందుకు ‘సీనరైజ్ కలెక్టింగ్ కాంట్రాక్టర్ (SCC)’గా AMR ఇండియా కాంట్రాక్ట్ దక్కించుకుంది (గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో సుమారు 650 చెక్‌పోస్టులు).
ప్రభుత్వ అధికారిక ‘OMEPS’ పోర్టల్ నిబంధనలను ఉల్లంఘించి, AMR సంస్థ సొంత ప్రైవేట్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా అనధికారిక పర్మిట్లు/ రశీదులు జారీ చేసింది.

*_ఇలా గండి కొట్టి‌.._*
వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన UPI క్యూఆర్ (QR) కోడ్ల ద్వారా, అలాగే నేరుగా నగదు (Cash) రూపంలో మైనింగ్ వ్యాపారుల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారనేది విజిలెన్స్, మైనింగ్ అధికారుల ప్రధాన ఆరోపణ. తాజా సోదాల్లో మహేష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల నుంచి మెర్సిడెస్- మేబ్యాక్, లెక్సస్, ఫెరారీ, లంబోర్ఘిని, నిస్సాన్ జీటీఆర్ వంటి సుమారు 11 అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను అధికారులు గుర్తించి, నిధుల మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు.

*_రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు & మీడియా మౌనం_*
ఈడీ సోదాలు, AMR సంస్థ అక్రమాల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ABV) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

*_ప్రధాన మీడియా మౌనం…:_*
జాతీయ స్థాయిలో ఈడీ ఇంత భారీ ఎత్తున సోదాలు జరిపి, వందల కోట్ల అక్రమ నగదు లావాదేవీలు, లగ్జరీ కార్ల సీజ్ వ్యవహారాలు బయటపెడుతున్నా… తెలుగు ప్రధాన దినపత్రికలు, ప్రముఖ న్యూస్ ఛానెళ్లు దీనిని కావాలనే తొక్కిపెట్టాయని ఆయన ఆక్షేపించారు. ఏ ఒక్క ప్రధాన ఛానెల్‌లోనూ దీనిపై సరైన చర్చగానీ, హెడ్‌లైన్స్ గానీ రాలేదని ఆయన వేలెత్తి చూపారు.

*_మీడియా యజమానులతో సంబంధాలు & నిధుల ప్రవాహం…:_*
AMR సంస్థ ప్రమోటర్లకు ప్రధాన తెలుగు మీడియా సంస్థలు, పలు టీవీ ఛానెళ్ల మేనేజ్‌మెంట్లు/ యజమానులతో ప్రత్యక్ష, పరోక్ష వ్యాపార బంధాలు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. AMR గ్రూప్ నుంచి అడ్వర్టైజ్‌మెంట్లు, పెట్టుబడులు, స్పాన్సర్‌షిప్‌లు లేదా ఇతర ఆర్థిక రూపాల్లో మీడియా సంస్థలకు నిధులు మళ్లడం వల్లనే… ఈడీ దాడుల విషయాన్ని కప్పిపుచ్చుతూ వార్తలను బ్లాక్ చేశారనే అంశాన్ని ఆయన బహిర్గతం చేశారు.

*_అంతా 'వెధవ'ల రాజకీయమే..!_*
రాజకీయ అండదండలు, మీడియా సంస్థల భాగస్వామ్యంతోనే గత ప్రభుత్వంలో మొదలైన ఈ అక్రమ వసూళ్ల వ్యవహారం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారుల నివేదికలు ఉన్నప్పటికీ సజావుగా విచారణ జరగకుండా అడ్డుకోగలుగుతున్నారని ఆయన విమర్శించారు. ఇంగ్లీష్ ప్రధాన పత్రికలైన డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హన్స్ ఇండియా తదితర పత్రికలు ఈ ఆర్థిక మోసం, నిధుల మళ్లింపు, కోల్‌కతా ఈడీ బృందం జరిపిన తనిఖీల వివరాలను వెలుగులోకి తీసుకురాగా, తెలుగు మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో ఈ వార్త మాయమవడం విచిత్రం…

Monday, September 14, 2026

మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి_

*"మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి"*

*శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ - బాపట్ల పుష్పలత*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 13:

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించి భక్తిశ్రద్దలతో పూజించాలని శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బాపట్ల పుష్పలత అన్నారు.హెచఎండిఏ సహకారంతో హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం( హైదరాబాద్ జిందాబాద్)మరియు శ్రీనిధి మహిళా ఫౌండేషన్ మరియు ప్రజాసంకల్పం స్వచ్చంద సంస్థ / ప్రజాసంకల్పం మీడియా ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గత పది సంవత్సరాలనుండి మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నాము అని అన్నారు.రామంతాపూర్ చిన్నచెరువు కట్ట కింద భరత్ నగర్ క్రాస్ రోడ్డు లో మరియు ఆర్టీసి కాలనీలో మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించే విధంగా అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాము అని అన్నారు.హెచ్ఎండిఏ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నదని అన్నారు.హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF) సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు  చెరువులు కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే  ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో  వైభవంగా  నిర్వహించుకొనే  “వినాయక చవితి” పండుగ  సందర్భంగా  అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను  ప్రతిష్టించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజెన్  రాలపళ్ళి కుసుమ మేడం,సరిత,ప్రజావాణి సంస్థ ఫౌండర్ ఎర్రం శ్రీనివాస్, రవీందర్ రావు, పోలిశెట్టి సత్యనారాయణ,ముదిగొండ శివ ప్రసాద్,సాయి వర్ధన్, మండల శివకుమార్,వెంకటేష్,బాపట్ల కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖ, ఫైర్ సేఫ్టీ రికార్డుల్లో అసలు వివరాలేమిటి?_

*హబ్సిగూడ ‘యోధ’ అపార్ట్‌మెంట్‌పై ప్రశ్నల వర్షం!*

- ఓసీ జారీ అయిందా? లేకుండానే ఫ్లాట్లలో నివాసం ఎలా?

- దాదాపు 20 ఫ్లాట్లు.. ఒకే విద్యుత్‌ మీటర్‌పై రూ.20–30 వేల బిల్లు ఎలా?

- నీటి కనెక్షన్‌కు ఏ పత్రాలు ఆధారం?.. లిఫ్ట్‌ విద్యుత్‌ సరఫరాపైనా సందేహాలు

- జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖ, ఫైర్ సేఫ్టీ రికార్డుల్లో అసలు వివరాలేమిటి?

మేడ్చల్ బ్యూరో సురేష్ ఇడపాక, హబ్సిగూడ, సెప్టెంబర్‌ 13(మీడియా టుడే): 

హబ్సిగూడ జేఎస్‌ఎన్‌ కాలనీలోని ‘యోధ’ అపార్ట్‌మెంట్‌ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 20 ఫ్లాట్లు ఉన్న ఈ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) జారీ అయిందా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేకుండానే కొన్ని ఫ్లాట్లలో కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందుతోంది. దీంతో భవన నిర్మాణ అనుమతులు, ఓసీ, నీటి, ఫైర్ సేఫ్టీ,విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

**ఓసీ జారీ అయిందా?**

భవన నిర్మాణానికి ఏ అనుమతులు మంజూరయ్యాయి? ఆమోదిత ప్లాన్‌ ప్రకారమే నిర్మాణం జరిగిందా? ఓసీ కోసం దరఖాస్తు చేశారా? చేసి ఉంటే దాని ప్రస్తుత స్థితి ఏమిటి? ఓసీ జారీ కాకముందే భవనంలో నివాసం కొనసాగుతున్నట్లయితే అందుకు సంబంధించిన నిబంధనలు ఏమిటి? అన్న విషయాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

భవనాన్ని అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేశారా? నిర్మాణంలో ఏవైనా తేడాలు లేదా ఉల్లంఘనలు గుర్తించారా? నోటీసులు జారీ చేశారా? అన్న వివరాలను అధికారిక రికార్డుల ఆధారంగా వెల్లడించాల్సి ఉంది.

**నీటి కనెక్షన్‌ ఎలా వచ్చింది?**

భవనంలో కుటుంబాలు నివాసం ఉంటున్న నేపథ్యంలో నీటి కనెక్షన్‌ అంశం కూడా ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 20 ఫ్లాట్లకు నీటి సరఫరా కోసం కనెక్షన్‌ ఎప్పుడు మంజూరైంది? ఏ కేటగిరీలో ఇచ్చారు? కనెక్షన్‌ మంజూరు సమయంలో భవన నిర్మాణ అనుమతులు, ఓసీ లేదా ఇతర అవసరమైన పత్రాలను పరిశీలించారా? అన్న ప్రశ్నలకు వాటర్‌ వర్క్స్‌ అధికారులు సమాధానం ఇవ్వాల్సి ఉంది.

నీటి కనెక్షన్‌కు సంబంధించిన దరఖాస్తు, మంజూరు పత్రాలు, కనెక్షన్‌ నంబర్‌, కేటగిరీ తదితర వివరాలను అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

**దాదాపు 20 ఫ్లాట్లు.. మీటర్‌ ఒక్కటేనా?**

అపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం సుమారు ఐదు ఫ్లాట్లలో కుటుంబాలు నివసిస్తున్నట్లు సమాచారం. అయితే భవనానికి ఒకే విద్యుత్‌ మీటర్‌ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ మీటర్‌కు నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు విద్యుత్‌ బిల్లు వస్తున్నట్లు సమాచారం. అదే విద్యుత్‌ సరఫరా నుంచి లిఫ్ట్‌ కూడా పనిచేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ఇది వాస్తవమైతే.. దాదాపు 20 ఫ్లాట్లకు ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి? ప్రస్తుతం ఉన్న మీటర్‌ ఏ కేటగిరీకి చెందినది? ఒకే మీటర్‌ ద్వారా పలు ఫ్లాట్లకు విద్యుత్‌ సరఫరా జరుగుతోందా? లిఫ్ట్‌కు కూడా అదే కనెక్షన్‌ నుంచి విద్యుత్‌ వినియోగిస్తున్నారా? అన్న అంశాలపై విద్యుత్‌ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

నెలకు రూ.20–30 వేల వరకు బిల్లు నమోదవుతున్నట్లయితే ఆ మీటర్‌ వినియోగ వివరాలు, కనెక్షన్‌ కేటగిరీ, మీటర్‌ సామర్థ్యం, గత బిల్లింగ్‌ చరిత్ర తదితర అంశాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.

**లిఫ్ట్‌ భద్రతపై తనిఖీలు జరిగాయా?**

అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ వినియోగంలో ఉంటే దానికి సంబంధించిన అనుమతులు, నిర్వహణ, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లిఫ్ట్‌కు విద్యుత్‌ సరఫరా ఏ కనెక్షన్‌ నుంచి జరుగుతోంది? సంబంధిత భద్రతా తనిఖీలు, అనుమతులు ఉన్నాయా? అన్న అంశాలపైనా సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

**బిల్డర్ ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నారా??**

 ఫైర్ ఎక్స్‌టింగిషర్లు (Fire Extinguishers): ప్రతి ఫ్లోర్‌లో, కారిడార్లలో సులభంగా అందుబాటులో ఉండేలా ఫైర్ ఎక్స్‌టింగిషర్లను ఏర్పాటు చేశారా??. 

**సంబంధిత శాఖలు.. సమాధానాలు ఎక్కడ?**

ఈ వ్యవహారంలో జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. భవన నిర్మాణ అనుమతులు, ఆమోదిత ప్లాన్‌, ఓసీ విషయంలో జీహెచ్‌ఎంసీ.. నీటి కనెక్షన్‌ విషయంలో వాటర్‌ వర్క్స్‌.. విద్యుత్‌ మీటర్‌, కనెక్షన్‌ కేటగిరీ, బిల్లింగ్‌ విషయంలో విద్యుత్‌ శాఖ తమ రికార్డుల ఆధారంగా వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.ఫైర్ సేఫ్టీ అధికారులు NOC ఇచ్చారా ??

భవన నిర్మాణం నుంచి నివాసం ప్రారంభమయ్యే వరకు ఆయా శాఖల అధికారులు ఎప్పుడు తనిఖీలు నిర్వహించారు? ఏ పత్రాలను పరిశీలించారు? ఎలాంటి అనుమతులు మంజూరు చేశారు? ఏవైనా అభ్యంతరాలు లేదా ఉల్లంఘనలు గుర్తించారా? అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు అవసరమవుతున్నాయి.

**ఫ్లాట్‌ కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చారా?**

జీవితకాల పొదుపుతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవనానికి సంబంధించిన నిర్మాణ అనుమతులు, ఓసీ పరిస్థితి, నీటి, విద్యుత్‌ కనెక్షన్ల వివరాలు ముందుగానే తెలియజేశారా? ఓసీ ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే ఆ విషయం కొనుగోలుదారులకు వెల్లడించారా? స్వాధీనం ఇచ్చే సమయంలో అవసరమైన పత్రాలను పరిశీలించారా? అన్న అంశాలపై కూడా స్పష్టత అవసరం.

భవనానికి సంబంధించిన అనుమతులు, సర్టిఫికెట్లు, కనెక్షన్ల వివరాలపై భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు వాస్తవాలను స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

**అధికారిక రికార్డులు వెల్లడించాలి**

భవన నిర్మాణ అనుమతి, ఆమోదిత ప్లాన్‌, ఓసీ దరఖాస్తు మరియు ప్రస్తుత స్థితి, జారీ చేసిన నోటీసులు, నీటి కనెక్షన్‌ వివరాలు, విద్యుత్‌ మీటర్ల సంఖ్య, కనెక్షన్‌ కేటగిరీ,ఫైర్ సేఫ్టీ అధికారులు NOC ఇచ్చారా??బిల్లింగ్‌ వివరాలు తదితర అంశాలను సంబంధిత శాఖలు రికార్డుల ఆధారంగా వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

**స్పష్టత కావాల్సిన ప్రధాన అంశాలు..**

ఓసీ జారీ అయిందా?
నీటి కనెక్షన్‌ ఏ పత్రాల ఆధారంగా మంజూరైంది?
దాదాపు 20 ఫ్లాట్లకు ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి?
ఒకే మీటర్‌పై నెలకు రూ.20–30 వేల బిల్లు ఎలా నమోదవుతోంది?
అదే మీటర్‌ నుంచి లిఫ్ట్‌కు కూడా విద్యుత్‌ సరఫరా జరుగుతోందా? ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి NOC ఇచ్చారా ??
మూడు శాఖల అధికారులు ఇప్పటివరకు ఏ తనిఖీలు నిర్వహించారు?
ఫ్లాట్‌ కొనుగోలుదారులకు అన్ని అనుమతుల వివరాలు ముందుగానే తెలియజేశారా?

ఈ అంశాలపై జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖల అధికారులు అధికారిక రికార్డుల ఆధారంగా స్పష్టత ఇవ్వడంతో పాటు వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు కోరుతున్నారు.