Praja Sankalpam Group Media
Sunday, June 28, 2026
_పిల్లల ప్రాణాల కంటే గొప్పది ఏదీ కాదు - సామజిక కార్యకర్త, న్యాయవాది వి. రవికృష్ణ_
*పిల్లల భద్రతే ప్రభుత్వ మొదటి బాధ్యత*
*పిల్లల ప్రాణాల కంటే గొప్పది ఏదీ కాదు - సామజిక కార్యకర్త, న్యాయవాది వి. రవికృష్ణ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 28:
విద్య అనేది వ్యాపారం కాదు... రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు (ఆర్టికల్ 21ఏ) అని సామజిక కార్యకర్త, న్యాయవాది వి. రవికృష్ణ అన్నారు. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లు, ప్రీ-స్కూళ్లు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి విద్యాసంస్థకు చట్టబద్ధమైన గుర్తింపు, భవన భద్రత, ఫైర్ సేఫ్టీ, స్ట్రక్చరల్ స్టెబిలిటీ, పరిశుభ్రత, తాగునీరు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు తదితర తప్పనిసరి ప్రమాణాలు అమలులో ఉన్నాయా అనే అంశంపై సమగ్ర తనిఖీలు అత్యవసరం అని అన్నారు.దేశంలోని ఇతర రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లలో జరిగిన అగ్ని ప్రమాదాలు అమాయక విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నాయి. అలాంటి విషాదాలు తెలంగాణలో జరగక ముందే ప్రభుత్వం, సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. నేను ఈ అంశంపై ప్రజాప్రయోజన ప్రాతినిధ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు సమర్పించాను అని చెప్పారు.
*నా ప్రధాన డిమాండ్లు:*
1. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కూళ్లు & ప్రీ-స్కూళ్లపై ప్రత్యేక తనిఖీలు
2. గుర్తింపు లేని లేదా చట్టపరమైన నిబంధనలు పాటించని విద్యాసంస్థల గుర్తింపు
3. ఫైర్ సేఫ్టీ, భవన భద్రత, మౌలిక వసతులపై ప్రత్యేక ఆడిట్
4. జిల్లా వారీగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచడం
5. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు... ప్రమాదం జరగకుండా నివారించడమే నిజమైన పరిపాలన.పిల్లల భద్రతే ప్రభుత్వ మొదటి బాధ్యత.
_సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం_
*సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం*
*ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడటంలో రమేష్, మువ్వాలమ్మ దంపతులు చూపిన చొరవ, సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి - వీసీ సజ్జనర్, ఐపీఎస్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 28:
ఏడేళ్ల బాలికను లైంగిక దాడి నుంచి సమయస్ఫూర్తితో రక్షించిన దంపతులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అభినందించారు.బషీర్బాగ్లోని సీపీ కార్యాలయంలో శనివారం కొల్లాటి రమేష్, మువ్వాలమ్మ దంపతులను ఆయన శాలువాతో సత్కరించి, నగదు పురస్కారాన్ని అందజేశారు.ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారికి రూ.20 ఇస్తానని ఆశ చూపి, మహ్మద్ శంషుద్దీన్ (60) అనే రిక్షా కార్మికుడు తన రిక్షాపై ఎక్కించుకొని వెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో స్థానికంగా నివసించే రమేష్, మువ్వాలమ్మ దంపతులు నిందితుడి దుశ్చర్యను గమనించి తక్షణమే స్పందించారు. నిందితుడి బారి నుంచి బాలికను సురక్షితంగా రక్షించడమే కాకుండా, డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మహ్మద్ శంషుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. సమాజంలో నేరాల నియంత్రణకు పౌరుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఇటువంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసుల నిఘాతో పాటు పౌరుల అప్రమత్తత కూడా అంతే ముఖ్యమన్నారు. ''మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ప్రతి పౌరుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాధారణ పరిస్థితులు కనిపిస్తే తక్షణమే డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలి. ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడటంలో రమేష్, మువ్వాలమ్మ దంపతులు చూపిన చొరవ, సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి" అని అన్నారు.ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డీసీపీ రమణా రెడ్డి, బోరబండ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ సురేందర్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Thursday, June 25, 2026
_బెదిరించి డబ్బు వసూలు, నకిలీ పత్రాల సృష్టి మరియు భూ ఆక్రమణ కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్_
*బెదిరించి డబ్బు వసూలు, నకిలీ పత్రాల సృష్టి మరియు భూ ఆక్రమణ కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 24:
హైదరాబాద్ నగరవ్యాప్తంగా క్రమబద్ధంగా బెదిరించి డబ్బు వసూలు చేయడం, నకిలీ పత్రాలను సృష్టించడం, నేరపూరిత కుట్ర మరియు భూ ఆక్రమణలకు పాల్పడుతున్న నేరస్తుడిని చాదర్ఘాట్ పోలీసులు విజయవంతంగా అరెస్టు చేశారు.నిందితుడు మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్, వ్యాపారవేత్త, బండ్లగూడ (హైదరాబాద్) నివాసి. హైదరాబాద్లోని న్యూ మలక్పేటకు చెందిన శ్రీ మహమ్మద్ నజముద్దీన్ షాకిర్ ఒక ఫిర్యాదు చేశారు. GHMC అనుమతితో తన కుటుంబానికి చెందిన పూర్వీకుల స్థలంలో నిర్మాణం మొదలైన తర్వాత, మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ నకిలీ 'హిబానామా' (బహుమతి దస్తావేజు) పత్రాలు మరియు నకిలీ స్టాంప్ పేపర్లను ఉపయోగించి ఆ ఆస్తిపై తప్పుడు యాజమాన్య హక్కులను ప్రకటించాడని ఆయన ఆరోపించారు.ఈ వివాద సమయంలో, ఖుద్దూస్ తరపున వ్యవహరించిన సహ-నిందితుడు రాజా (A-2), ఫిర్యాదుదారుని రూ. 10 లక్షలు డిమాండ్ చేయడంతో పాటు, తప్పుడు క్రిమినల్ కేసులతో బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత, ఇద్దరు నిందితులు కలిసి ఫిర్యాదుదారుని భయపెట్టారు మరియు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే హత్య కేసుల్లో ఇరికిస్తామని బెదిరించినట్లు తెలిసింది.ఆస్తులపై తప్పుడు యాజమాన్య హక్కులను ప్రకటించడానికి, అలాగే న్యాయపరమైన చిక్కులు మరియు తప్పుడు క్రిమినల్ కేసుల పేరుతో బెదిరించి డబ్బు వసూలు చేయడానికి నిందితుడు తరచుగా నకిలీ 'హిబానామా' పత్రాలను ఉపయోగించేవాడు. విచారణలో, అతను పలువురు బాధితుల నుండి సుమారు రూ. 40 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. బెంగళూరుకు పారిపోయిన నిందితుడిని ప్రత్యేక పోలీసు బృందం గుర్తించి అరెస్టు చేసింది; తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతన్ని హైదరాబాద్కు తీసుకువచ్చారు.
_రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా_
*ఐటీ కారిడార్లో 5 ఎకరాల భూమికి హైడ్రా ఫెన్సింగ్*
*రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 24:
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా మంగళవారం కాపాడింది. సర్వే నంబరు 42లో మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కు వెళ్లే మార్గంలో అత్యంత విలువైన భూమిని కాజేయాలని కొంతమంది ప్రయత్నించారు. అక్కడ రెండు తాత్కాలిక షెడ్డులు వేసి ఒక గదిని కూడా నిర్మించారు.5 ఎకరాల చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ కూడా నిర్మించే క్రమంలో హైడ్రాకు రెవెన్యూ శాఖ నుంచి ఫిర్యాదు అందింది. ఎన్నో ఏళ్లుగా ఈ భూమి తనదిగా చెబుతూ ఎవరినీ అటువైపు రానీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితుల్లో శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. రెండు తాత్కాలిక షెడ్డులతో పాటు.. నిర్మించిన గదితో పాటు ఫెన్సింగ్ను హైడ్రా తొలగించింది.
మొత్తం ఆక్రమణలు తొలగించిన తర్వాత 5 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ దాదాపు రూ. వెయ్యికోట్ల వరకూ ఉంటుందని అంచనా.
_"ఊరు బడి మూతపడితే... అది కేవలం ఒక పాఠశాల మూతపడినట్టే కాదు, ఊరి భవిష్యత్తుకే తాళం వేసినట్టే"_
*నల్లగొండ జిల్లా ఊటుకూరు గ్రామానికి చెందిన వై. పురుషోత్తం రెడ్డి చేసిన పని గ్రామానికి ఆదర్శంగా నిలిచింది*
*ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు కుమారులను ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అభినందనీయం*
*ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలను కాపాడేందుకు సమాజం ముందుకు రావాలి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 24:
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కొరతతో మూతపడే పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగించే అంశమని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుండటం గ్రామ ప్రజలను ఆలోచింపజేస్తోంది.
ప్రభుత్వ విద్యను కాపాడాలని వేదికలపై మాట్లాడేవారు చాలా మంది ఉన్నప్పటికీ, ఆ మాటలను ఆచరణలో చూపించే వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఊటుకూరు గ్రామానికి చెందిన వై. పురుషోత్తం రెడ్డి చేసిన పని గ్రామానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ప్రజాసేవకు, తాను నమ్మిన రాజకీయాలకు కార్యాచరణే ప్రాణమని విశ్వసించే వై. పురుషోత్తం రెడ్డి, "ముందుగా మనం మారితేనే సమాజం మారుతుంది" అనే ఆలోచనతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు కుమారులను ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం విశేషమని పేర్కొంటున్నారు.ఇటీవల పాఠశాల పరిస్థితులను పరిశీలించిన సందర్భంగా, గత విద్యా సంవత్సరంలో మొత్తం 23 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 10 మంది పై తరగతులకు వెళ్లిపోయిన తర్వాత కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే మిగిలినట్లు తెలిసింది. ఈ విద్యా సంవత్సరంలో వై. పురుషోత్తం రెడ్డి గారి ఇద్దరు కుమారులు, మరో బీసీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి చేరడంతో ప్రస్తుతం మొత్తం 16 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో ఉన్నారు.అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఒకే గదిలో బోధన కొనసాగుతోంది. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోవడం ఆందోళనకరంగా మారింది.ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఊటుకూరు ప్రభుత్వ పాఠశాల మూతపడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాల మూతపడటం అంటే కేవలం ఒక భవనం మూతపడటం కాదని, పేద పిల్లల విద్యా అవకాశాలు, గ్రామ భవిష్యత్తు, సామాజిక సమానత్వం దెబ్బతినడమేనని వారు పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రజలు, మేధావులు, యువత, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరుతున్నారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరచడం, ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించడం, గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయడం ద్వారా మాత్రమే ఊరి బడిని కాపాడగలమని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అనేది కేవలం విద్యాశాఖ బాధ్యత మాత్రమే కాదని, అది సమాజం మొత్తం బాధ్యత అని సామాజిక వర్గాలు పేర్కొంటున్నాయి. వై. పురుషోత్తం రెడ్డి చూపించిన ఆచరణను ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందుకు వస్తే ఊటుకూరు ప్రభుత్వ పాఠశాల మాత్రమే కాదు, గ్రామీణ ప్రభుత్వ విద్య కూడా బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
*సందేశం*
"ఊరు బడి మూతపడితే... అది కేవలం ఒక పాఠశాల మూతపడినట్టే కాదు, ఊరి భవిష్యత్తుకే తాళం వేసినట్టే."
"ఊరు బడి కోసం మాటలు కాదు... పిల్లల అడ్మిషన్లే నిజమైన మద్దతు."
Wednesday, June 24, 2026
Subscribe to:
Posts (Atom)