*వస్తావా? రేట్ ఎంత?*
*ఆమె సీపీ సుమతి కాబట్టి ఎవరేం అనడంలేదు.అదే వేరే మహిళ అయ్యుంటే..?*
*రాత్రిపూట మహిళ బయట ఉంటే, ఆమెను ఏమైనా అడిగే హక్కు తమకు ఉందనే భ్రమలో వీరు బతుకుతున్నారు...సైకాలజిస్ట్ విశేష్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 07:
మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, అంతరిక్షంలోకి వెళ్తున్నాం,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపంచాన్ని శాసిస్తున్నాం.కానీ, మల్కాజ్గిరి పోలీస్ కమీషనర్ బి.సుమతి నిర్వహించిన ఒక్క 'స్టింగ్ ఆపరేషన్' మన నాగరికత అట్టడుగున ఇంకా ఎంతటి కుళ్ళిన మనస్తత్వం దాగి ఉందో బట్టబయలు చేసింది.ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారిణి సాధారణ మహిళగా రోడ్డు మీద నిలబడితే,40 మంది మగవారు ఆమెను చుట్టుముట్టి వేధించారంటే... అది కేవలం ఒక క్రైమ్ రిపోర్ట్ కాదు; అది మన సమాజం సామూహిక మానసిక వైఫల్యం.ఈ 40 మందిలో ప్రతి ఒక్కరూ ఒక వేటగాడిలా (Predator) ప్రవర్తించడం వెనుక ఉన్న వికృత సైకాలజీని మనం లోతుగా తవ్వాల్సి ఉంది.ఒక సైకాలజిస్ట్ గా ఈ 40 మంది ప్రదర్శించిన ఆ Predatory Filth పై నా విశ్లేషణ ఇక్కడ ఇస్తున్నాను.
*1️⃣ Serial Predatory Behavior*
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే — ఆ 40 మంది ఒకే గుంపుగా లేరు.విడివిడిగా వెళ్తున్న బ్యాచ్లు కూడా ఆమెను చూడగానే ఒకేలా స్పందించాయి.అంటే, రాత్రిపూట తిరుగుతున్న యువతలో ఎంతమంది ఈ Objectification (స్త్రీని వస్తువుగా చూడటం) అనే మానసిక రోగంతో ఉన్నారో అర్థమవుతోంది.వీరి దృష్టిలో రాత్రిపూట ఒంటరిగా కనిపించే మహిళ ఒక మనిషి కాదు,కేవలం తమ శారీరక వాంఛలను తీర్చుకునే ఒక 'వ్యాపార వస్తువు'."రేట్ ఎంత?" అని అడిగే ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే — అది మన పితృస్వామ్య వ్యవస్థ వారికి ఇచ్చిన Unconscious License.
ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి, గౌరవించాల్సిన పనిలేదు, ఆమెకు ఒక ధర కట్టి కొనొచ్చు అనే అహంకారం వీరి రక్తంలో ఇంకిపోయింది.
*2️⃣ The Psychology of Male Entitlement*
ఈ 40 మందిలో అత్యధికులు చదువుకున్న విద్యార్థులే కావడం అత్యంత విషాదకరం. వీరి మెదడులో ఒక ప్రమాదకరమైన Cognitive Distortion ఉంది. తాము 'మగవారం' కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే Entitlement Mindsetతో బతుకుతున్నారు.రాత్రిపూట మహిళ బయట ఉంటే, ఆమెను ఏమైనా అడిగే హక్కు తమకు ఉందనే భ్రమలో వీరు బతుకుతున్నారు.ఒక మహిళను మాటలతో లొంగదీసుకోవాలని చూడటం, ఆమెను భయపెట్టడం ద్వారా తాము 'శక్తివంతులం' అని నిరూపించుకోవాలని చూస్తారు. దీనినే సైకాలజీలో Toxic Masculinity అంటారు. అంటే తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి స్త్రీపై అధికారాన్ని ప్రదర్శించడం.
*3️⃣ ఇద్దరు ముగ్గురు కలిస్తే చాలు.. మృగం నిద్రలేస్తుంది!*
ఆ 40 మంది విడివిడిగా ఇద్దరు ముగ్గురు చొప్పున వేధించారు.దీన్ని Small Group Deindividuation' అంటారు. ఒక్కడున్నప్పుడు భయపడేవాడు కూడా, పక్కన ఇంకో స్నేహితుడు తోడవ్వగానే తన నైతికతను చంపేసుకుంటాడు.ఒకడు నీచంగా వాగితే, పక్కన ఉన్నవాడు నవ్వి ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహం వారిని మరిన్ని అసభ్య పదజాలం వాడేలా చేస్తుంది.రాత్రి చీకటి తమను గుర్తుపట్టనివ్వదు అనే ధీమా వారిని 'కవర్డ్స్' (పిరికిపందలు) నుండి 'ప్రిడేటర్స్' (వేటాడే మృగాలు) గా మారుస్తుంది.
*4️⃣ Dark Triad*
మనస్తత్వ శాస్త్రం ప్రకారం, ఇలాంటి నేరస్తులలో మూడు ప్రధాన వికృత లక్షణాలు ఉంటాయి.
*🔹 Narcissism:* తమ కోరికలే ముఖ్యం,ఎదుటివారి గౌరవం తృణప్రాయం అనే అహంభావం.
*🔹Psychopathy:* ఒక మహిళకు అంతటి నీచమైన ప్రశ్న వేస్తున్నప్పుడు కనీసం మనస్సాక్షి (Conscience) అడ్డుపడకపోవడం. ఎదుటివారి వేదన వీరికి వినోదం.
*🔹Machiavellianism:* పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని, బాధితురాలిని మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించడం.
సీపీ సుమతి గారు ఆ 40 మందికి ఇచ్చిన ట్రీట్మెంట్ సామాన్యమైనది కాదు. దీనిని సైకాలజీలో Cognitive Shock అంటారు."తాము ఒక 'వస్తువు' అనుకుని రేటు కట్టాలని చూసిన వ్యక్తి, తమ మెడకు బేడీలు వేసే 'అత్యున్నత శక్తి' అని తెలిసినప్పుడు వారి అహంకారం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది." "నువ్వు ఏ అమ్మాయిని చూసినా, ఆమె వెనుక ఒక సిపీ సుమతి ఉండొచ్చు అనే భయం నీ మెదడులో నిరంతరం ఉండాలి" అని ఈ ఘటన ద్వారా ఆమె సమాజానికి స్పష్టమైన ఇచ్చిన సందేశం ఇచ్చారు.ఈ భయం మాత్రమే ఇలాంటి మృగాలను అదుపులో ఉంచుతుంది. గౌరవం లేని చోట భయమైనా ఉండాలి.ఆమె సీపీ సుమతి కాబట్టి ఎవరేం అనడంలేదు. అదే వేరే మహిళ అయ్యుంటే.. "అంత అర్ధరాత్రి ఆమె అక్కడ ఎందుకు ఉంది?" అని అడిగే వెధవలు కూడా మన చుట్టూనే ఉన్నారు.మనం ఇంకా Victim Blaming దశలోనే ఉంటే, ఈ 40 మంది మృగాల కంటే మనం భయంకరమైన వాళ్ళం.హీరోయిన్ వెంటపడటమే హీరో లక్షణం అని నమ్మే పిచ్చితనం నుండి యువత బయటకు రావాలి.తోటి మనిషి బాధను పంచుకునే 'సహానుభూతి' లేని సమాజం శవాల కుప్పతో సమానం.డిగ్రీలు వస్తున్నాయి కానీ క్యారెక్టర్ రావడం లేదు. ఈ 40 మంది విద్యార్థులకు ఇప్పుడు కావాల్సింది జైలు శిక్షతో పాటు Behavioral Therapy.
"నైట్ కు వస్తావా?" అని అడిగిన ఆ 40 మంది యువకులు మన సమాజపు 'నైతిక పతనానికి' సజీవ సాక్ష్యాలు.
సిపీ సుమతి గారు కేవలం ఆ 40 మందిని పట్టుకోలేదు,మన కళ్లముందు ఉన్న ముసుగును తొలగించారు.ఆ బస్టాండ్లో ఉన్నది కేవలం ఒక అధికారిణి కాదు,ఆమె మన సమాజపు ఆత్మగౌరవం.శిక్ష పడటం వల్ల నేరస్థుడు భయపడతాడు, కానీ సరైన సంస్కారం ఉన్నప్పుడు అసలు నేరస్తుడే పుట్టడు. ఈ 40 మంది పోకిరీల ఉదంతం ప్రతి తల్లికి, తండ్రికి ఒక మేలుకొలుపు — మీ అబ్బాయిలను మనుషులుగా పెంచుతున్నారా లేక మృగాలుగా మారుస్తున్నారా?
*పునరాలోచించుకోండి!*
*సైకాలజిస్ట్ విశేష్*
Founder, Genius Matrix Hub