Saturday, July 4, 2026

_ఆదివాసీ, గిరిజన, మారుమూల‌, వెనుకబడిన జీపీల‌కు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి_

*కేంద్ర నిధుల కేటాయింపులో పన్నుల వసూళ్లే పనితీరుకు కొలమానం కాకూడదు - మంత్రి సీతక్*

*ఆదివాసీ, గిరిజన, మారుమూల‌, వెనుకబడిన జీపీల‌కు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి*

*స్థానిక అవసరాల కోసం అన్‌టైడ్ గ్రాంట్లను కొనసాగించాలి*

*16వ ఆర్థిక సంఘం జాతీయ వర్క్‌షాప్‌లో తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 03:

16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన పనితీరు ఆధారిత గ్రాంట్లు, ఓన్ సోర్స్ రెవిన్యూ వంటి నిబంధనల్లో ఆదివాసి, గిరిజన, షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క కోరారు. గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే అంచనా వేయకుండా, ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల సిఫార్సులపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజ‌న్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో మంత్రి సీతక్క తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను వివరించారు. స్పెష‌ల్ సీఎస్ దాన‌కిషోర్ తో పాటు ఇత‌ర రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఈ స‌మావేశంలో పాల్గోన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ...జీపీల‌కు పనితీరు ఆధారిత గ్రాంట్లను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని, అయితే ఆదాయ సామర్థ్యం తక్కువగా ఉన్న ఆదివాసీ, గిరిజన, మారుమూల ప్రాంతాల గ్రామ పంచాయతీలపై అదనపు పన్నుల భారం మోపే విధంగా నిబంధనలు ఉండకూడదన్నారు. అభివృద్ధిని ప్రజల ఆర్థిక స్థితితో ముడిపెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అనేక గ్రామ పంచాయతీల జనాభా చాలా తక్కువగా ఉండటంతో వాటి సొంత ఆదాయ వనరులు కూడా పరిమితంగానే ఉంటాయని తెలిపారు. అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని, ఆదివాసీ, గిరిజన, షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండల స్థాయి స్థానిక సంస్థలకు కూడా పనితీరు గ్రాంట్ల అర్హతలో వెసులుబాటు కల్పించాలని కోరారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా ఎన్నికలు జరగని 62 గ్రామ పంచాయతీలకు  కేంద్ర ప్ర‌భుత్వం అభివృద్ధి నిధులు నిలిపివేయడం వ‌ల్ల అక్క‌డి ప్రజలకు అన్యాయం జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల వల్ల ఎన్నికలు ఆలస్యమైన ప్రత్యేక పరిస్థితుల్లో నిధులు కొనసాగించేలా నిబంధనలు ఉండాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి గ్రామ అవసరం భిన్నంగా ఉంటుందని, అందువల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయాలు తీసుకునేలా అన్‌టైడ్ బేసిక్ గ్రాంట్లను తగిన స్థాయిలో కొనసాగించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. డిజిటల్ గవర్నెన్స్, ఈ-గ్రామ్ స్వరాజ్, పీఎఫ్‌ఎంఎస్ వంటి వ్యవస్థలను తెలంగాణ ప్రభుత్వం స్వాగ‌తిస్తోంద‌ని... వాటి అమలుకు అవసరమైన శిక్షణ, సిబ్బంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ, సాంకేతిక మౌలిక వసతులను మారుమూల గ్రామాల్లో కేంద్రం బలోపేతం చేయాలని కోరారు. 
షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో ప్రజా సేవలను అంద‌చేసేందుకు అధిక వ్యయం అవుతున్నందున నిధుల కేటాయింపులో అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని కోరారు. బలమైన గ్రామ పంచాయతీలు, బలమైన రాష్ట్రాలు కలిసి బలమైన భారత నిర్మాణానికి పునాది వేస్తాయని మంత్రి సీతక్క అన్నారు. బలమైన గ్రామ పంచాయతీలు, బలమైన రాష్ట్రాలు కలిసి బలమైన భారత నిర్మాణానికి పునాది వేస్తాయని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలంటే రాష్ట్రాలకు తగిన ఆర్థిక సామర్థ్యం ఉండాలని, సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను బలోపేతం చేస్తూనే పంచాయతీలను మరింత శక్తివంతం చేసే విధంగా 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉండాలని మంత్రి సీత‌క్క సూచించారు.

_యువతను డ్రగ్స్ బారిన పడకుండా రక్షించడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కట్టుబడి ఉంది_

*అక్రమంగా గంజాయి కలిగి ఉండి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్*

*యువతను డ్రగ్స్ బారిన పడకుండా రక్షించడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కట్టుబడి ఉంది*

*ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భవానీ నగర్ పి.ఎస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 03:

భవానీ నగర్ పోలీసులు ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేశారు; 2.334 కిలోల గంజాయి, నగదు, వాహనం మరియు మొబైల్ ఫోన్లు స్వాధీనం. మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు విక్రయాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న నిరంతర నిఘాలో భాగంగా, భవానీ నగర్ పోలీసులు మరియు చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా అక్రమంగా గంజాయిని కలిగి ఉండి, రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను విజయవంతంగా పట్టుకున్నారు. భవానీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎన్.డి.పి.ఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదైంది. నిందితులను గౌరవ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో మాదకద్రవ్యాలను సరఫరా చేసిన ప్రధాన నిందితుడిని (Supplier) పట్టుకోవడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
*ఘటన వివరాలు: నమ్మదగిన సమాచారం ప్రకారం..* 02.07.2026 నాడు భవానీ నగర్ పోలీసులు మరియు చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కలిసి భవానీ నగర్ పరిధిలోని తలాబ్‌కట్ట, రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రోడ్ నంబర్ 0 వద్ద సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. సాయంత్రం 16:10 గంటల సమయంలో, నంబర్ ప్లేట్ లేని ఎరుపు రంగు హోండా యాక్టివాపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, ఎన్.డి.పి.ఎస్ చట్టం ప్రకారం చట్టపరమైన నిబంధనలను అనుసరించి తనిఖీ చేయగా వారి వద్ద 2.334 కిలోల గంజాయి లభించింది. పాతబస్తీ ప్రాంతంలోని అవసరమున్న వినియోగదారులకు విక్రయించడానికి వారు ఈ గంజాయిని రవాణా చేస్తున్నట్లు తేలింది. స్వాధీనం చేసుకున్న 2.334 కిలోల గంజాయి మొత్తం విలువ సుమారు ₹54,900/- ఉంటుంది.
*దర్యాప్తు*: నిందితులు స్థానిక వినియోగదారుల కోసం చిన్న చిన్న ప్యాకెట్లను సిద్ధం చేసి గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు అందిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఈ గంజాయిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుండి ఒక సప్లయర్ ద్వారా సేకరించి, ఇక్కడ పంపిణీ చేయడానికి హైదరాబాద్ తీసుకువచ్చినట్లు వెల్లడైంది. నిందితులు దీనిని చిన్న ప్యాకెట్లుగా చేసి, స్థానిక వినియోగదారులకు విక్రయించడం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించాలని భావించారు. నిందితులు క్రమం తప్పకుండా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతూ, స్థానిక అలవాటుపడిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. ఈ డ్రగ్ సప్లై నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ప్రధాన సప్లయర్‌ను మరియు ఇతరులను గుర్తించి పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
*అరెస్టయిన నిందితుల వివరాలు:*
1. మహ్మద్ నశీర్ అలియాస్ చాకు నశీర్ అలియాస్ ఛోటీ చాకు (వయస్సు: 43 సంవత్సరాలు): భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్. ఇతను గతంలో గంజాయి అక్రమ రవాణా, ఆర్మ్స్ యాక్ట్, మరియు దొంగతనాలకు సంబంధించి 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
2. మహ్మద్ మెహరాజ్ అలీ అలియాస్ ఆమేర్ (వయస్సు: 24 సంవత్సరాలు): ఇతను కూడా గతంలో గోపాల్‌పురం పోలీస్ స్టేషన్ మరియు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
*స్వాధీనం చేసుకున్న సొత్తు:*
• 2.334 కిలోల గంజాయి
• గంజాయి ఉన్న 05 చిన్న ప్యాకెట్లు
• 06 ఖాళీ జిప్ లాక్ కవర్లు
• ₹6,000/- నగదు
• నంబర్ ప్లేట్ లేని ఒక ఎరుపు రంగు హోండా యాక్టివా వాహనం
• ఒక నోకియా కీప్యాడ్ మొబైల్ ఫోన్
• ఒక శామ్‌సంగ్ S22 ఆల్ట్రా మొబైల్ ఫోన్
ప్రజా విజ్ఞప్తి (Public Advisory):
• మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు మరియు వ్యవస్థీకృత నేరాల పట్ల హైదరాబాద్ సిటీ పోలీస్ 'జీరో టాలరెన్స్' (సహించేది లేదు) విధానాన్ని అనుసరిస్తుంది.
• మాదకద్రవ్యాల విక్రయం, రవాణా లేదా కలిగి ఉన్న వ్యక్తులపై ఎన్.డి.పి.ఎస్ చట్టం ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
• పౌరులు తమ ప్రాంతాలలో మాదకద్రవ్యాల రవాణా లేదా అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే 100/112 నంబర్లకు డయల్ చేయడం ద్వారా గానీ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించడం ద్వారా గానీ నివేదించాల్సిందిగా కోరుతున్నాము.
మాదకద్రవ్యాల మహమ్మారిని నిర్మూలించడానికి మరియు సమాజాన్ని, ముఖ్యంగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా రక్షించడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కట్టుబడి ఉంది. మాదకద్రవ్యాల రవాణా మరియు విక్రయాలకు పాల్పడే వారందరిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

_ఉస్మానియా డాక్టర్లు తెలంగాణతో పాటు, యావత్ దేశానికే గర్వకారణమైన ఘనతను సాధించారు - ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ_

*“అవయవదానం… మహాదానం”*

*మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని ట్రాన్స్‌ప్లాంట్ బృందం*

*ఉస్మానియా డాక్టర్లు తెలంగాణతో పాటు, యావత్ దేశానికే గర్వకారణమైన ఘనతను సాధించారు - ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 03:

భారత్‌లోనే తొలిసారిగా ప్రభుత్వ హాస్పిటల్‌లో ఒకే రోగికి, ఒకేసారి ఐదు అవయవాల (మల్టీ-విసెరల్) మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి దేశ వైద్య చరిత్రలో అరుదైన ఘనత సాధించిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌ప్లాంట్ బృందానికి శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉస్మానియా డాక్టర్లు తెలంగాణతో పాటు, యావత్ దేశానికే గర్వకారణమైన ఘనతను సాధించారని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో ఒకటిగా భావించే మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా నిర్వహించడం అసాధారణ విజయమన్నారు.
డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని ట్రాన్స్‌ప్లాంట్ బృందం 36 గంటల పాటు శ్రమించి ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం అసాధారణ విజయమని కొనియాడారు. ఈ చారిత్రాత్మక విజయానికి కృషి చేసిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, క్రిటికల్ కేర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లు, ఇతర సిబ్బంది అందరికీ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.అలాగే, అవయవదానం ద్వారా మరో ప్రాణానికి జీవం పోసిన అవయవదాత కుటుంబ సభ్యుల సేవాభావాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందిస్తూ, “అవయవదానం… మహాదానం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ సమాజంలో విస్తృతంగా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌ను కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా, పోటీగా వైద్య సేవలు అందించే విధంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఆరోగ్యశాఖలో సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేశామని, తాజాగా మరో 6238 పోస్టులను మంజూరు చేశామని మంత్రి గుర్తు చేశారు.పాత భవనాలు, అద్దె భవానల్లో కొనసాగుతున్న హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలకు కొత్త భవానలు నిర్మిస్తున్నామని తెలిపారు. రోగ నిర్దారణ కోసం అత్యాధునిక ఎక్విప్‌మెంట్, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే ప్రజలకు అన్నిరకాల మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా  డాక్టర్లు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకొస్తున్నారని మంత్రి ప్రశంసించారు.

Thursday, July 2, 2026

_భూ అక్రమణదారులకు అండ... సామాన్య రైతులకు చుక్కలు చూపుతున్నారనే ఆరోపణలు_

*శాలి గౌరారం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందా?*

*భూ అక్రమణదారులకు అండ... సామాన్య రైతులకు చుక్కలు చూపుతున్నారనే ఆరోపణలు*

*లంచం ఇస్తేనే ఫైల్ కదులుతుందా?... జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలకూ విలువ లేదా?*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 02:

నల్లగొండ జిల్లా శాలి గౌరారం తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం అవినీతి, అక్రమాలు, లంచాల ఆరోపణలకు కేంద్రబిందువుగా మారిందని మండల వ్యాప్తంగా ప్రజలు, రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ కార్యాలయం కొందరు భూ అక్రమణదారులకు రక్షణ కవచంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో ప్రభుత్వ భూములు భూ ఆక్రమణ దారుల చేతుల్లో ఉన్నా వారివద్ద ముడుపులు తీసుకొని చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారు.గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బదిలీపై వెళ్లిన ఎమ్మార్వో అనంతరం.. తహసీల్దార్ కార్యాలయంలో.. ఓ ముఖ్య అధికారి భూ వివాదాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ, నిజమైన రైతుల కంటే అక్రమ పట్టాదారులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.మండలంలోని అనేక గ్రామాల్లో వాస్తవంగా భూమిని సాగు చేస్తున్న రైతుల పేర్లు రికార్డుల్లో లేకపోగా, భూమి కబ్జాలో లేని కొందరి పేర్లపై పట్టాలు కొనసాగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తున్నారని వారు చెబుతున్నారు.
*"లంచం ఇస్తేనే పని... లేకపోతే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే"* అనే పరిస్థితి నెలకొన్నదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ పట్టాలు కలిగిన వారి వద్ద భారీ మొత్తంలో లంచాలు తీసుకుని, నిజమైన భూ హక్కుదారుల వద్ద పదిగుంటల భూమి కి పదిలక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు, సూచనలను సైతం పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఎమ్మార్వోపై కూడా ప్రభావం చూపుతూ, కార్యాలయంలో తాను చెప్పిందే తుది నిర్ణయంగా అమలు అవుతోందనే వాదనలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.ఈ పరిస్థితులతో మండల వ్యాప్తంగా రైతులు, బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఫిర్యాదు చేసినా స్పందన లేక న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*మండల ప్రజల డిమాండ్లు:*
- శాలి గౌరారం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న అవినీతి వ్యవహారాలపై జిల్లా స్థాయి ప్రత్యేక విచారణ చేపట్టాలి.
- మండలంలోని అన్ని గ్రామాల భూ రికార్డులు, పట్టాలపై సమగ్ర పరిశీలన నిర్వహించాలి.
- అక్రమ పట్టాలు, భూ అక్రమాలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
- నిజమైన భూమి హక్కుదారులకు వెంటనే న్యాయం చేయాలి.
- రెవెన్యూ కార్యాలయంలో పారదర్శక పరిపాలనను అమలు చేసి రైతుల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి.

శాలి గౌరారం రెవెన్యూ కార్యాలయంపై వస్తున్న ఈ ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి స్వతంత్ర విచారణకు ఆదేశించి, వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

_నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు_

*కుళ్లిన చేపలు, రొయ్యల అక్రమ నిల్వ: నలుగురు నిందితుల అరెస్ట్*

*నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు*

*అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం, కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్ సిటీ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 02:

కుళ్లిన చేపలు, రొయ్యల అక్రమ నిల్వ: నలుగురు నిందితుల అరెస్ట్. మంగళహాట్ పరిధిలో టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసుల సంయుక్త దాడులు రూ. 90 వేల విలువైన నిల్వలు, సోడియం బైకార్బోనేట్ పౌడర్ స్వాధీనం. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తూ, కుళ్లిన చేపలు మరియు రొయ్యలను రసాయనాలతో నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఒక ముఠాను కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ గోల్కొండ బృందం, మంగళహాట్ పోలీసులతో కలిసి మంగళవారం రట్టు చేసింది. మంగళహాట్ పరిధిలోని మాచిపురా బైఠక్ వద్ద గల "తార ఫిషరీస్" దుకాణంపై నిర్వహించిన ఈ ఆకస్మిక దాడుల్లో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో అరెస్టయిన నిందితులను శంకర్ సింగ్ (24, దుకాణ యజమాని), మాన్ సింగ్ (32, మార్కెటింగ్ సహాయకుడు), గులాబ్ సింగ్ (36, కార్మికుడు), రోహిత్ సింగ్ (31, దుకాణాన్ని అద్దెకు ఇచ్చిన వ్యక్తి)గా గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ. 90,000 విలువైన 100 కిలోల పాడైపోయిన రొయ్యలు, 162 కిలోల వివిధ రకాల చేపలు (సాల్మన్, మారుల్), 6 బస్తాల ఉప్పు మరియు 10 కిలోల సోడియం బైకార్బోనేట్ పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేసు వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు శంకర్ సింగ్ బేగంబజార్ మార్కెట్ నుండి తక్కువ ధరకే చేపలు, రొయ్యలను కొనుగోలు చేసేవాడు. జనావాసాల మధ్య ఉన్న తన దుకాణంలో ఏమాత్రం పరిశుభ్రత లేకుండా, కుళ్లిపోకుండా ఉండేందుకు మరియు దుర్వాసన రాకుండా నిరోధించడానికి సోడియం పౌడర్‌ను ఉపయోగించేవాడు. వీటిని ప్లాస్టిక్ టబ్బులు, డీప్ ఫ్రీజర్లలో నిల్వ ఉంచి, తాజా చేపలుగా భ్రమింపజేస్తూ శుభకార్యాలకు, ఈవెంట్లకు మరియు హోటళ్లకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి లాభాలు గడిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అధికారులు హెచ్చరించారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ సంయుక్త దాడి నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.ఈ ఆపరేషన్ హైదరాబాద్ సిటీ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో, గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్. వెంకటేష్, మంగళహాట్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర, సబ్-ఇన్‌స్పెక్టర్లు కె. వెంకటరమణ, ఎన్. నవీన్, ఆంజనేయులు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది.

_బాలకార్మికులు లేని సమాజం కోసం మనవంతు కృషి చేద్దాం_

*ఆపరేషన్ ముస్కాన్*

*బాలకార్మికులు లేని సమాజం కోసం మనవంతు కృషి చేద్దాం*

*అనురాధ రావు అధ్యక్షురాలు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 02:

July 1st నుండి 31 వరకు దేశ వ్యాప్తంగా Operation Muskan నిర్వహిస్తారు.ఇది ప్రత్యేక లక్ష్యంతో నిర్వహించే కార్యక్రమం, తప్పిపోయిన పిల్లలను గుర్తించడం,వీరిని రక్షించి వారి కుటుంబాలకు చేర్చడం, బాలల అక్రమరవాణా, బాల కార్మికులుగా మగ్గుతున్న చిన్నారులను, బిచ్చగాళ్ల ముఠాల్లో చిక్కుకున్న చిన్నారులను,వీధి బాలలను, భిక్షాటనం చేస్తున్న చిన్నారులను రెస్క్యూ చేయడం అని అనురాధ రావు - బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అన్నారు.NCRB నివేదికల ప్రకారం భారత దేశం లో ప్రతి సంవత్సరం పదివేల పిల్లలు కనిపించకుండా పోతున్నారు, కొందరు దొరికినా, కొంతమంది పిల్లలు కనిపించడం లేదు. ప్రతి చిన్నారి వెనుక ఆ కుటుంబం ఆందోళన, బాధ, భయం ఉంటాయి. ఈ చిన్నారుల భవిష్యత్తు అంధకారం. తప్పిపోయిన చిన్నారులు - బాల కార్మికులుగా, అక్రమ రవాణా ముఠాల చేతుల్లో కొందరు, కొందరు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో,వీధుల్లో భిక్షాటనం చేస్తూ, కొందరు చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో జివీస్తుంటారు. ఇది కేవలం ఒక పోలీస్ డ్రైవ్ కాదు, పిల్లల భద్రత కోసం దేశవ్యాప్తంగా జరిగే రక్షణ కార్యక్రమం. రక్షించిన చిన్నారులను child welfare committee ద్వారా పునరావాసం కల్పిస్తారు.
2025 సంవత్సరం ఆపరేషన్ ముస్కాన్లో 7678 చిన్నారులను రెస్క్యూ చేశారు.ఎక్కువగా రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో,ఇటుక బట్టీల వద్ద, మెకానిక్ షాపుల్లో, నిర్మాణ సంస్థ వద్ద, టీ స్టాల్స్ మరియు రిలిజియస్ ప్లేసులో రెస్క్యూ చేశారు.6718 మంది చిన్నారులు బాలకార్మికులు,357 మంది చిన్నారులు వీధి బాలలు,42 మంది చిన్నారులు భిక్షాటనం చేస్తూన్న వారు.తెలంగాణకు చెందిన చిన్నారులు 3891, ఇతర 12 రాష్ట్రాలకు చెందిన పిల్లలు,నెపాల్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు.
1713 ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు,1718 మంది ఎంప్లాయర్స్/ట్రాఫికర్స్ పై కేసులు నమోదు చేశారు.మరి ఈ సంవత్సరం ఎంత మంది చిన్నారులు ఉన్నారో?
*తల్లితండ్రలకు సూచనలు ఇస్తున్నది బాలల హక్కుల సంఘం.*
1) పిల్లలకు మీ పోన్ నంబర్ గుర్తుండేలా నేర్పించండి.
2) పిల్లలను వంటరిగా వదలి పెట్టకండి.
3) జన సమూహ ప్రాంతాల్లో పిల్లలను ఒంటరిగా వదలకండి.
4 ) ఆరు బయట ఆడుతున్నారని, మీ పనుల్లో నిమగ్నం కావద్దు. వారిపై మీ దృష్టి ఉంచాలి.
5) పిల్లలు కనిపించక పోతే మీ సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి, 24 గం॥ లు వేచి చూడాల్సిన పని లేదు, 
అప్రమత్తంగా ఉండాలి.
6) child line అందు బాటులో ఉంటుంది,ఎక్కడైన పిల్లలు బిక్షాటన చేస్తున్న, బాల కార్మికులుగా కనిపించిన వెంటనే 1098 కాల్ చేయండి లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో చెప్పండి.
7) రెగ్యులర్ తనీఖీలు నిర్వహిస్తే సమస్య చాల వరకు తగ్గుతుంది . ఎక్కువగా పిల్లలు ఎక్కడ పని చేస్తుంటారో,ఆ స్థావరాలు, ఆ సంస్థ వివరాలు ప్రభుత్వం వద్ద ఉంటాయి,అంటే ఇటుక బట్టీలు, కావచ్చు, construction కంపెనీలు, గాజుల ఫ్యాక్టరీలు, ఇతర ప్యాక్టరీలు. వీటిపై రెగ్యులర్గా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి, ట్రాఫికింగ్ ముఠాలను అదుపులోకి తీసుకోవాలి, బల్క్ బుకింగ్ చేస్తూన్న రైల్వే స్టేషన్లో,బస్ స్టేషన్లో సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలి. బాల కార్మికులను ఇతర రాష్ట్రాల నుండి తీసుకురావడానికి ఎక్కువగా రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తారు. చెక్ పొస్ట్ల వద్ద తనిఖీలు నిర్వహించాలి.చిన్నారులను కాపాడడం సమాజం లో ఉన్న అందరి బాధ్యత. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఇంకా ముమ్మరం చేయాలి. ఇదొక మొక్కుబడి కార్యక్రమం కాకుండ బాలకార్మికులు లేని సమాజం కోసం మనవంతు కృషి చేద్దాం.

_తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB)కి ఒక వినయపూర్వక విజ్ఞప్తి_

*తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB)కి ఒక వినయపూర్వక విజ్ఞప్తి*

*వి. రవికృష్ణ - సామాజిక కార్యకర్త, న్యాయవాది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 02:

ఇటీవల తెలంగాణ ACB వరుసగా ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) కేసులు నమోదు చేస్తూ, భారీ మొత్తంలో నగదు, బంగారం, వజ్రాలు, భూములు, ఫ్లాట్లు, వాహనాలు తదితర ఆస్తులను గుర్తిస్తోంది. శామీర్‌పేట్ తహసీల్దార్ కేసుతో పాటు తాజాగా మరికొన్ని DA కేసులపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.అయితే, ఆస్తులు బయటపడ్డాయనే దానితోనే దర్యాప్తు ముగియకూడదు.
*ప్రధానంగా ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనాలి:*

1. ఈ అక్రమ సంపదకు మూలం ఏమిటి?
2. లంచాలు ఇచ్చిన వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు ఎవరు?
3. ప్రభుత్వ అనుమతులు, భూ వ్యవహారాలు లేదా ఇతర అధికారిక నిర్ణయాల ద్వారా ఎవరు అక్రమ లాభాలు పొందారు?
4. బినామీ పేర్లలో ఆస్తులు కొనుగోలు చేశారా? అయితే ఆ బినామీలు ఎవరు?

లంచం తీసుకున్న అధికారిపై మాత్రమే చర్యలు తీసుకుంటే అవినీతి వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడదు. లంచం ఇచ్చినవారు, అక్రమ డబ్బు సమకూర్చినవారు, బినామీలు, సహకరించిన వారిని కూడా చట్టం ముందు నిలబెట్టినప్పుడే అవినీతికి అడ్డుకట్ట పడుతుంది.అందువల్ల ప్రతి DA కేసులో "Follow the Money Trail" సూత్రాన్ని అనుసరిస్తూ అక్రమ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి నుంచి వచ్చిందో, ఎవరెవరు లబ్ధి పొందారో సమగ్రంగా దర్యాప్తు చేసి, అందరిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ACBను వినయపూర్వకంగా కోరుతున్నాను.
అవినీతి నిర్మూలన అంటే కేవలం అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కాదు... ఆ అక్రమ సంపద వెనుక ఉన్న మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను బయటపెట్టడం.