Tuesday, August 18, 2026

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణి లో పౌరసమాజం నుంచి 43 వినతిపత్రాలు_

*సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ప్రజావాణి లో పౌరసమాజం నుంచి 43 వినతిపత్రాలు*

*టౌన్ ప్లానింగ్ విభాగంలో అత్యధికంగా 28 వినతిపత్రాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 17:

పౌరసమాజం తమ సమస్యలను నేరుగా కార్పొరేషన్‌కు తెలియజేసేందుకు వీలుగా సోమవారం సైబరాబాద్ మున్సిపల్ అధికారులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఇందులో మొత్తం 43 వినతిపత్రాలు పౌరసమాజం నుంచి అందాయి అని అన్నారు.
*(1)*: ఇంజనీరింగ్ – 10
*(2)*:ఎంటమాలజీ (కీటక శాస్త్రం) – 1
*(3)*: పారిశుధ్యం – 1
*(4)*: టౌన్ ప్లానింగ్ (పట్టణ ప్రణాళిక) – 28
*(5)*:అర్బన్ బయోడైవర్సిటీ (పట్టణ జీవవైవిధ్యం) – 3
ప్రతి సమస్యను ఒక ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఐడి మరియు ట్రాకింగ్ లింక్‌తో నమోదు చేయడం జరుగుతుంది అని అధికారులు అన్నారు.దీనివల్ల పౌరులు తమ వినతిపత్రం యొక్క స్థితిని తెలుసుకోగలుగుతారు.సంబంధిత శాఖలను ఈ సమస్యలను పరిశీలించి, సకాలంలో పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, అరుదైన రాయి పేరిట మోసం — ఆరుగురిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్_

*నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, అరుదైన రాయి పేరిట మోసం — ఆరుగురిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 17:

నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, మహిమలు ఉన్నాయంటూ ప్రచారం చేసిన ఒక రాయిని అధిక ధరలకు విక్రయించి అమాయకులను మోసం చేసేందుకు యత్నిస్తున్న ఆరుగురి ముఠాను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ మరియు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఉమ్మడిగా దాడి చేసి పట్టుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. శనివారం (15-08-2026) రోజున కాటేదాన్‌లోని లక్ష్మిగూడ ప్రాంతంలో కొనుగోలుదారుల కోసం వేచి చూస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి నిర్వహించారు.
**కేసు పూర్వాపరాలు:**
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం — మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన పి. నరసింహ, వడత్య కుమార్, ప్రవీణ్ సింగ్, మంగళి బసవ నరేష్ మరియు వేములవాడకు చెందిన సిద్ధాంతి చల్లా రవి ఒక ముఠాగా ఏర్పడ్డారు.2024లో పి. నరసింహ అనే వ్యక్తి వేములవాడకు చెందిన చల్లా రవి, కొండపల్లి భిక్షపతి వద్ద నుంచి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని రూ. 10,00,000లకు కొనుగోలు చేసి మోసపోయాడు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని వడత్య కుమార్‌కు అందజేశాడు. దాంతో తామంతా ఒక గుంపుగా ఏర్పడి, ఆ నకిలీ విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మబలికి అమాయకులకు భారీ ధరలకు విక్రయించాలని ప్లాన్ చేశారు.
ఇదే సమయంలో కేతావత్ రాజు తన వద్ద ఒక అరుదైన గులాబీ రంగు రాయి ఉందని, దాన్ని కూడా అధిక ధరకు విక్రయించవచ్చని భావించి ముఠాలో చేరాడు. శనివారం కాటేదాన్, లక్ష్మిగూడ సమీపంలో ఈ నకిలీ విగ్రహం మరియు రాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
**అరెస్ట్ అయిన నిందితులు:**
*(1)*: కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప (38): కార్ డ్రైవర్, చౌదూర్ (గ్రామం), నవాబ్‌పేట, మహబూబ్‌నగర్ జిల్లా.
*(2)*: వడత్య కుమార్ (34): కార్ డ్రైవర్, లక్ష్మిగూడ, కాటేదాన్, హైదరాబాద్.
*(3)*: ప్రవీణ్ సింగ్ (34): డ్రైవర్, మధుబన్ కాలనీ, కాటేదాన్, హైదరాబాద్.
*(4)*: మంగళి బసవ నరేష్ (38): కార్మికుడు, లక్ష్మిగూడ, కాటేదాన్, హైదరాబాద్.
*(5)*: పి. నరసింహ (45): కార్ డ్రైవర్, లక్ష్మిగూడ, కాటేదాన్ (స్వస్థలం: లోయపల్లి, మంచాల్, రంగారెడ్డి జిల్లా).
*(6)*: చల్లా రవి (38): జోతిష్యుడు, చీర్లవంచ, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా.
**స్వాధీనం చేసుకున్న సొత్తు:**

*(1)*: ఒక నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం
*(2)*: ఒక గులాబీ రంగు రాయి (Pink Colour Stone)
*(3)*: ఎర్టిగా (Ertiga) వాహనం (TS 04 B 0549)
*(4)*: ఐదు మొబైల్ ఫోన్లు
*(5)*: మూడు రసాయన ద్రావణాల బాటిళ్లు (Unknown Liquid Bottles)
*(6)*: రెండు ఎరుపు రంగు తువాళ్లు.
జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఛెత్రి యాదేందర్, సబ్-ఇన్‌స్పెక్టర్ జి. సందీప్ రెడ్డి బృందం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులతో కలిసి ఈ అపరేషన్ నిర్వహించారు. నిందితులను స్వాధీనం చేసుకున్న సొత్తుతో సహా తదుపరి విచారణ నిమిత్తం మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO)కు అప్పగించారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ప్రతి పౌరుడికి ఎంతో గర్వకారణం_

*జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం — సమానత్వం, భాగస్వామ్యానికి ప్రతీక*

*సీతారాం ధూళిపాళ అధ్యక్షులు - పంచవటి కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మణికొండ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 16:

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ప్రతి పౌరుడికి ఎంతో గర్వకారణం. అది దేశం పట్ల గౌరవం, బాధ్యత, దేశభక్తి, సమాజంలో తన భాగస్వామ్యాన్ని చాటుకునే ఒక ప్రత్యేకమైన అనుభూతి.
సాధారణంగా మన దేశంలో ఇప్పటికీ వలస పాలనా కాలం నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, సంస్థ అధిపతి లేదా ప్రముఖ వ్యక్తి, VIP చేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే పద్ధతి ఉంది. ప్రముఖులను గౌరవించడంలో తప్పులేదు. అయితే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం సమానత్వం, భాగస్వామ్యం, ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడం.పంచవటి కాలనీ RWA దీనికి భిన్నమైన, ప్రజాస్వామ్య స్ఫూర్తితో కూడిన సంప్రదాయాన్ని గత 6–7 సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. కాలనీలోని సీనియర్ సిటిజన్లకు వరుసగా ఒక్కొక్కరికి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పిస్తున్నాం.ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు. అధిపత్యాన్ని చూపించడం కాకుండా సమానత్వాన్ని గౌరవించే, ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఒక గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయం.సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్న RWAలు మరియు పౌర సమాజ సంస్థలు (Civil Society Organisations) ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే ముఖ్యమైన అట్టడుగు స్థాయి సంస్థలు. ఇవి భారత రాజ్యాంగంలోని 74వ సవరణ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజల భాగస్వామ్యాన్ని, స్థానిక స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించగలవు.సమాజ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలంటే, కేవలం పదవిలో ఉన్నవారికి లేదా VIPలకు మాత్రమే కాకుండా ప్రతి పౌరుడికి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే, బాధ్యత తీసుకునే, గౌరవం పొందే అవకాశం కల్పించాలి.ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రాతినిధ్యం కాదు — ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం కూడా.ప్రతి సీనియర్ సిటిజన్, ప్రతి నివాసి, ప్రతి సభ్యుడికి సమాజ సేవలో పాల్గొనే అవకాశం కల్పిద్దాం. తద్వారా మన సమాజంలో సమానత్వం, గౌరవం, బాధ్యత మరియు భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం.
సమాన భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది.
భాగస్వామ్యం బాధ్యతను పెంచుతుంది.
బాధ్యతాయుతమైన ప్రజలు బలమైన సమాజాన్ని నిర్మిస్తారు.
పంచవటి కాలనీ RWA కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం — అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య విలువలను ఆచరణలో చూపిస్తున్న ఒక చిన్న కానీ గొప్ప ఉదాహరణ.

తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం - సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు_

*హైదరాబాదు నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం* 

*తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం - సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 16:

హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్రభారతి మెయిన్ హాల్లో కల్చరల్ ఫెస్టివల్ 2026 వైభవంగా జరిగింది. 16 రకాల కళా రూపాలను సుమారు 170 మంది కళాకారులు ప్రదర్శించారు.ఈ కల్చరల్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరైన సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ప్రజలలో చైతన్యాన్ని కల్పించేలా కళారూపాలను ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అందులో హైదరాబాద్ జిందాబాద్ లాంటి సంస్థలను కూడా భాగస్వాములను చేస్తామని అన్నారు. హైదరాబాద్ జిందాబాద్ లాంటి పౌర సంస్థలు మెడికల్ ఉచిత మెడికల్ క్యాంపులు, పర్యావరణ పరిరక్షణ మొదలగు అంశాలపై కృషి చేస్తూ ప్రజలకు తమ వంతు సహకారాన్ని, సేవలను అందిస్తున్నందుకు అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కళాభివృద్ధికి చేస్తున్న కృషిని సోదాహరణంగా వివరించారు.
ఈ కల్చరల్ ఫెస్టివల్ లో "ది ట్రైల్ ఆఫ్ భగత్ సింగ్" డ్రామా మరియు ప్రగతి నగర్ విద్యార్థులు ప్రదర్శించిన "సే నోటు డ్రగ్స్" "ఆర్గాన్ డొనేషన్ లపై స్కిట్" లు సందేశాత్మకంగా, ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఓం డాన్స్ అకాడమీ, అంబేద్కర్ కాలేజీ కళాబృందాలు వేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకర్షించాయి. కురుగంటి కళాక్షేత్రం సాంప్రదాయ భరతనాట్యం ప్రఖ్యాత కళాకారులు గురు స్వామి పేరడీ, రవుఫుద్దీన్ స్టాండప్ కామెడీ, శివ ప్రసాద్ మిమిక్రీ, రామడుగు వసంత్ మైమ్ షో, మౌనిక పపెట్ షో ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తానల్ మలయాళీ సేవాసమితి కేరళ సాంప్రదాయ తిరువతిర నృత్యం ప్రేక్షకులను ఆకర్షించింది.ఈ సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో సుమారు 100 హైస్కూల్స్ లలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్, పాటల పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజినల్ ఉపాధ్యక్షులు మురళీకృష్ణ , పర్యావరణవేత్త  డాక్టర్ జయ సూర్య,  హ్యాపీ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజశేఖర్,  ప్రముఖ టీవీ నటులు మలక్పేట శైలజ గారు హాజరై బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్ష కార్యదర్శులు ఎం. శ్రీనివాసరావు, కె.వీరయ్య ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, పి.నాగేశ్వరరావు,  మోహన్ నాయుడు , సంగీత, శ్రీవల్లి, మాధవి సుకుమార్, రాజమౌళి, నాగేష్, శంకర్ లు కార్యక్రమ నిర్వహణకు నాయకత్వం వహించారు.

Sunday, August 16, 2026

గోదావరి పుష్కరాల పై కేబినేట్ సబ్ కమిటి ఏర్పాటు_

*గోదావరి పుష్కరాలను ఘనంగా  నిర్వహించాలి*

*గోదావరి పుష్కరాల పై కేబినేట్ సబ్ కమిటి ఏర్పాటు*

*క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌, మంత్రి  డి. శ్రీధర్‌బాబు అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 14:

26 జూన్ 2027 నుంచి 7 జూలై 2027 వరకు గోదావరి నది తీరం పుష్కర శోభతో విరాజిల్లేలా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని గోదావరి పుష్కరాల పై ఏర్పాటు చేసిన కేబినేట్ సబ్ కమిటి సంకల్పించింది.పుష్కరాల సందర్భంగా గోదావరి తీరం వెంబడి ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేసి, దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.ఈ దిశగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌, మంత్రి  డి. శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.26 జూన్ 2027 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో కేబినేట్ సబ్ కమిటి ఛైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని మంత్రుల బృందం కూలంకషంగా చర్చించింది.  దేవాదాయ శాఖ, ఆర్ అండ్ బి, నీటిపారుదల, పోలీస్, టూరిజం, టిజిఎన్పిడిసిఎల్, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్టమెంట్, గ్రామీణ నీటిపారుదల తదితర శాఖలు చేపడుతున్న పనుల వివరాలను మంత్రుల బృందం ఆరా తీసింది. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, శాఖల వారీగా కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులు మంత్రులకు వివరించారు. 
పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, రవాణా, విద్యుత్‌, వైద్య, భద్రత తదితర సదుపాయాల కల్పనపై మంత్రులు ప్రత్యేకంగా శాఖల వారీగా చర్చించారు. పుష్కరాల ప్రారంభానికి ముందే అన్ని పనులను నాణ్యతతో, సమన్వయంతో పూర్తి చేసి భక్తులకు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి నదీ తీరాన వున్న నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పుష్కర ఘాట్లుగా తీర్చిదిద్దనున్న మొత్తం 67 కేంద్రాలను 3 అంచెల్లో అభివృద్ధి చేయనున్నట్లు కమిటి కన్వీనర్, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ మంత్రుల బృందానికి వివరించారు. గోదావరి పుష్కరాల సమగ్ర ఏర్పాట్ల కోసం రూ. 1000 కోట్లతో వివిధ శాఖల పరిధిలో  పనులు జరుగుతున్నట్లు  వివరించారు.ఈ సందర్భంగా కేబినేట్ సబ్ కమిటి ఛైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల పనుల పురోగతిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. వీలుకాని పక్షంలో వర్చువల్ మీటింగ్ ల ద్వారా పనులను సమీక్షించాలని సూచించారు. గోదావరి పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డిగారు ప్రతిష్టాత్మక కార్యక్రమంగా భావిస్తున్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.  
పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పనుల పురోగతిని ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు డ్యాష్‌బోర్డు ద్వారా సమీక్షించేందుకు వీలుగా, శాఖల వారీగా చేపడుతున్న పనులు, పురోగతి తదితర వివరాలు అందుబాటులో ఉండేలా డ్యాష్‌బోర్డును రూపొందించాలని అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు. గోదావరి పుష్కరాల నిమిత్తం స్పెషల్ ఫండ్స్ కావాలని పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వినతుల వస్తున్నందున ఈ విషయమై ముఖ్యమంత్రిగారితో చర్చిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి తీర ప్రాంతం సుదీర్ఘంగా వున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గోదావరి పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించాలని సూచించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు ఎంచుకున్న ప్రాంతాల్లో ఆయా క్షేత్రాల మహాత్మ్యాన్ని, చారిత్రక–ఆధ్యాత్మిక విశిష్టతను తెలియజేసేలా స్వాగత ద్వారాలు, ప్రత్యేక అలంకరణలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆయా క్షేత్రాల విశిష్టతను పరిచయం చేసేలా సమాచార బోర్డులు, దృశ్యరూప ప్రదర్శనలు ఏర్పాటు చేసి, గోదావరి పుష్కరాల వైభవం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు పనులు పునరావృతం కాకుండా సమన్వయంతో చేయాలని సూచించారు.భక్తులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స అందించడానికి వైద్యారోగ్య శాఖతో పాటు ముందుకు వచ్చే ప్రైవేట్ హాస్పిటళ్ళ సహకారం తీసుకోవాలని మంత్రి వైద్యారోగ్య శాఖకు సూచించారు. అనంతరం భక్తులు పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు నిర్వహించడంతో పాటు కొబ్బరికాయలు కొట్టడం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులు గోదావరి జలాల్లో కలవకుండా భక్తులకు అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని, జలాల్లో కలిసిన ప్లాస్టిక్ వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ సూచించారు.గోదావరి పుష్కరాలకు లక్షలాదిగా యాత్రికులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. విఐపి, వివిఐపిలకు ప్రత్యేకంగా బారికేడ్స్ , స్నానఘట్టాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన తోపులాట అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ శాఖ అధికారులు మంత్రులకు వివరించారు. ఐ అండ్ పిఆర్ తరఫున ప్రచార కార్యక్రమాలను గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందు నుంచే ప్రారంభించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డికి సూచించారు.గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే గోదావరి నదీ తీరంలోని భద్రాచలం, ధర్మపురి వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పుష్కర ఏర్పాట్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్  రావు అధికారులను ఆదేశించారు. పుష్కరాల సమయంలో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక బస్ షెల్టర్లు, ప్రయాణికుల వెయింటింగ్ ఏర్పాట్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలను  తీర్చిదిద్దాలని, శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్లు లేని ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టేషన్లు, ప్రయాణికుల హోల్డింగ్ ఏరియాలు, పార్కింగ్ సదుపాయాలు  తదితర ఏర్పాట్లను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టిసి అధికారులకు నిర్దేశించారు. గోదావరి పుష్కరాలను ప్రతిబింబించేలా బస్ స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను ముందుగానే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఘాట్లు, గ్రామాల పరిసరాల్లో పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, పుష్కరాల కాలం పూర్తయ్యే వరకు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు అవసరమైన సిబ్బంది, వనరులను అందుబాటులో ఉంచాలని అన్నారు. పుష్కరాల ఏర్పాట్లలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర కేబినేట్ తీర్మానాలు _

*తెలంగాణ రాష్ట్ర కేబినేట్ తీర్మానాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 14:

రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుంటే.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. కొత్తగా కుటుంబీకుల పేర్లను కూడా నమోదు చేసింది. 62 లక్షల మందికి కొత్తగా లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో ఈరోజుకు మొత్తం 3 కోట్ల 42 లక్షల మంది రేషన్ లబ్ధిదారులున్నారు. వీరికి స్మార్ట్ కార్డుల జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.గత ఏడాది నిర్వహించినట్లే.. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించాలని ప్రాధమికంగా తేదీలను నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి,  వివేక్ వెంకటస్వామి అధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు  ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ఆవిష్కరించినట్లే.. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తో సదస్సు నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఆవిష్కరించనుంది. ప్రధానంగా మన రాష్ట్రంలో డిఫెన్స్, ఏరో స్పేస్, ఫార్మా రంగాల్లో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈసారి సదస్సు జరుగుతుంది. వివిధ రంగాల్లో ఇప్పటికే తెలంగాణ స్టార్టప్ లు, పరిశ్రమలు సాధించిన విజయాలు.. వివిధ రంగాల కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఎగ్జిబిషన్, స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
వానాకాలం పంట‌కు సంబంధించి ఏడు ర‌కాల స‌న్న ధాన్యం సాగును ప్రోత్సహించి, ఆ ఏడు ర‌కాల సాగును పెంచడానికి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని కేబినేట్ నిర్ణయించింది.  రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదిక‌ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ ఏడు ర‌కాల స‌న్నాల‌కే రూ.500 బోన‌స్‌ చెల్లించాల‌ని కేబినేట్ తీర్మానించింది.యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్ధతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబ‌ట్టుకున్న నేప‌థ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.2389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి.. ఈ వేలం (e-Auction) ద్వారా ధాన్యం అమ్మాలని కేబినేట్ నిర్ణయించింది.రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి తీసుకురావ‌డానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు సాంకేతిక విద్యా శాఖ ప‌రిధిలో ఉన్నాయి. వీటిని తెలంగాణ ఎడ్యుకేష‌న్ యాక్ట్ నుంచి తొల‌గించి  యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న వీటన్నింటినీ ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేసేందుకు క్యాబినెట్ తీర్మానించింది.ఆదిలాబాద్‌, నిర్మల్, ముధోల్‌, బోథ్‌, సిర్పూర్‌, గజ్వేల్, దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో తొలివిడ‌త‌గా 113 నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూల్ కాంప్లెక్స్లో నిర్మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు కొత్తగా ఆమోదించిన 7 స్కూళ్లతో కలిపి ఇప్పటివరకు 86 యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ కాంప్లెక్స్ లకు అనుమతులు మంజూరయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ వీలైనంత తొందరగా స్థల సేకరణ చేసి, నిర్మాణాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన చోట వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి.. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలున్నాయి. వీటిని ఈవీ (విద్యుత్తు వాహనాలుగా) మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం (తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్) అమలుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద  అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1 లక్ష 50 వేలు సబ్సిడీ అందిస్తారు.  ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నారు.హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన HILT పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు కేబినెట్ నిర్ణయం. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోత‌ల ఫేజ్‌-II పనుల కోసం రూ. 2,100 కోట్ల అంచనా వ్యయానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.  దీంతో దాదాపు ల‌క్ష ఎక‌రాల‌కు సాగు నీరు, ఆ ప్రాంతంలో తాగు నీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు ఈ ఎత్తిపోత‌ల నుంచి అందుతుంది. 
గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామ‌ర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీల‌కు పెంచటంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

సేవా పతక గ్రహీతలు డీసీపీ జే.నర్సయ్య మరియు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతిలను సన్మానించిన సీపీ సజ్జనర్‌

*హైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు సేవా పతకాలు*

*సేవా పతక గ్రహీతలు డీసీపీ జే.నర్సయ్య మరియు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతిలను సన్మానించిన సీపీ సజ్జనర్‌*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 14:

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక సేవా పతకాలకు ఎంపికైన అధికారులను హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ ఘనంగా సత్కరించారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సికింద్రాబాద్‌ జోన్‌ అదనపు డీసీపీ జే.నర్సయ్య, విశిష్ట సేవా పతకం వరించిన సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతిలను శుక్రవారం సీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్‌ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావం, అత్యుత్తమ నిబద్ధత ప్రదర్శించినందుకే అధికారులకు ఈ అత్యున్నత పురస్కారాలు దక్కాయని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో అదనపు డీసీపీ నర్సయ్య, సైబర్‌ నేరాల నియంత్రణ, సాంకేతిక దర్యాప్తులో ఏసీపీ శివమారుతి కనబరిచిన ప్రతిభ ప్రశంసనీయమన్నారు.జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పతకాలు సాధించడం ద్వారా హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచారని, వీరి సేవలు ఇతర పోలీసు అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే అంకితభావంతో ప్రజాసేవలో కొనసాగుతూ మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
అధికారుల విశేష సేవల నేపథ్యం
*(1)* : అదనపు డీసీపీ జే.నర్సయ్య:1991లో ఎస్సైగా చేరి 35 ఏళ్లుగా సుదీర్ఘ సేవలందిస్తున్నారు. పలు కీలక కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఈయన ‘ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌’ (ఐపీఎం) సహా పలు పతకాలు అందుకున్నారు.
*(2)*:  సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతి:1995లో ఎస్సైగా చేరి 31 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. రూ.127 కోట్ల పాన్‌-ఇండియా సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌ను ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ద్వారా ఛేదించి గుర్తింపు పొందారు. దర్యాప్తులో ప్రతిభకు గాను 2022లో ‘కేంద్ర హోంమంత్రి పతకం’ సాధించారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీ యం.శ్రీనివాస్‌, ఐపిఎస్, జాయింట్‌ సీపీ (ఎస్‌బీ), నార్త్‌ రేంజ్‌ శాంతిభద్రతల జాయింట్‌ సీపీ ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌, ఐపీఎస్, డీసీపీలు కిరణ్ ఖారే ఐపిఎస్ (చార్మినార్ జోన్), ఎస్. శ్రీనివాస ఐపిఎస్ (రాజేంద్రనగర్ జోన్), ఎమ్. చైతన్య కుమార్ ఐపిఎస్ (డీడీ), శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్ (వుమెన్ సేఫ్టీ వింగ్), డి. రాజేష్ (శంషాబాద్ జోన్), జె. రాఘవేందర్ రెడ్డి (గోల్కొండ జోన్), ఎ. రమణా రెడ్డి (జూబ్లీహిల్స్)  తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పతక గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.