Friday, May 22, 2026

తెలంగాణలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉందా ?

*కడపర్తి గ్రామ మహిళ ఆవేదన – నకిరేకల్ సి.ఐ పై కక్షపూరిత చర్యల ఆరోపణలు*

*తెలంగాణలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉందా ?*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 22:

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన బెల్లి బద్రమ్మ,భర్త సాయమల్లు కుటుంబ సభ్యులు తమపై నకిరేకల్ సి.ఐ హరిబాబు గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర డి.జి.పి, నల్గొండ ఎస్.పీ, డి.ఎస్.పీ అధికారులకు ఫిర్యాదు చేశారు.బద్రమ్మ తెలిపిన వివరాల ప్రకారం,తమ పట్టా భూమిలో ఇప్పటికే మూడు పీట్ల దారి ఇచ్చినప్పటికీ,మరింత దారి ఇవ్వాలని బెల్లి వెంకన్న మరియు వారి కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చి వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ వివాదంలో ప్రత్యర్థులతో కుమ్మక్కైన నకిరేకల్ సి.ఐ హరిబాబు తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు నెంబర్ 121/2026 నమోదు చేయించారని ఆరోపించారు. అలాగే తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోగా, ఫిర్యాదు రసీదు కూడా ఇవ్వలేదని తెలిపారు.ఈ విషయమై 15-04-2026న రిజిస్టర్ పోస్టు ద్వారా నల్గొండ జిల్లా ఎస్.పీ గారికి ఫిర్యాదు చేసినందుకు కక్ష పెట్టుకొని,తనను ఒక మహిళనని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకా తన భర్త సాయమల్లును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, “మీపై ఫిర్యాదు వచ్చింది” అంటూ ఒక రోజు మొత్తం స్టేషన్‌లో కూర్చోబెట్టి, ఫోన్ స్వాధీనం చేసుకొని మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే తొలగించి, తాము ఇచ్చిన ఫిర్యాదుపై చట్టపరమైన కేసు నమోదు చేయాలని,విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన నకిరేకల్ సి.ఐ హరిబాబు మీద శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని బెల్లి బద్రమ్మ ప్రభుత్వాన్ని కోరారు.

నిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపిన - సీఎం రేవంత్ రెడ్డి

*నిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపిన - సీఎం రేవంత్ రెడ్డి*

*2 వేల కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసిన నిమ్స్ వైద్య బృందం* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 22:

కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (#NIMS) యూరాలజీ విభాగం, 2 వేల కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. కిడ్నీ మార్పిడులలో దక్షిణ భారత దేశంలో నిమ్స్​ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లలో గుజరాత్‌లోని ఐకేడీఆర్‌సీ మొదటి స్థానంలో, లూధియానా క్రిస్టియన్ మెడికల్ కాలేజీ రెండో స్థానంలో ఉండగా, నిమ్స్ మూడో స్థానంలో ఉంది.ఈ అరుదైన మైలురాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.ఈ 2 వేల మందిలో 1,900 మంది అంటే 95 శాతం మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవడం విశేషం.2023 జనవరి నుంచి గడిచిన మూడు సంవత్సరాల నాలుగు నెలల్లోనే 500 కిడ్నీ మార్పిడులు చేసి రికార్డు సృష్టించింది.

Saturday, May 9, 2026

హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం & ఆధునీకరణ,నగరీకరణ చేయడం - సీఎం రేవంత్ రెడ్డి

*“హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం & ఆధునీకరణ,నగరీకరణ చేయడం - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 09:

ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి గారు సమావేశంలో సవివరంగా ఆవిష్కరించారు.ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఇతర సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు గారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెబుతూ, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు."హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కీలకమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్‌ల వంటి మూడు విధానాల్లో ట్రాఫిక్‌కు సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నాం.ట్రాఫిక్ నియంత్రణ కోసం కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే చేపడితే సరిపోదు. బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం” అని వివరించారు.
“తెలంగాణ రాష్ట్రాన్ని CURE, PURE, RARE విభాగాలుగా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా గుర్తించాం. ఓఆర్ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమి (PURE) ప్రాంతాన్ని ప్రధానంగా మాన్యూఫ్యాక్చర్ సెక్టార్‌గా గుర్తించాం.ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE) గా వ్యవసాయం, దానిక అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేశాం” అని చెప్పారు."రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికే ఆవిష్కరించుకున్నాం. లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నాం.
నగరంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. హైదరాబాద్‌లో ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నాం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.హైదరాబాద్ నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వం స్టాండింగ్‌ కమిటీకి విజ్ఞప్తి చేసింది.మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్‌తో పాటు ఇతర సభ్యులు అభివర్ణించారు. హైదరాబాద్ నగర జీవన స్థితిగతులను మెరుగుపరిచే మూసీ పునరుజ్జీవ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ నగర ప్రజలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును చేపట్టడంపై ఈ సందర్భంగా కమిటీ ముఖ్యమంత్రి గారిని అభినందించింది. దీంతో పాటు రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కమిటీ ప్రశంసించింది. అంతకుముందు సమావేశం ప్రారంభంలో స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులను ముఖ్యమంత్రి గారు సత్కరించారు.తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి అనుగుణంగా సమగ్ర ప్రణాళికలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్‌ను స్టాండింగ్ కమిటీ సభ్యులకు  అందజేశారు.

Thursday, May 7, 2026

ఆమె సీపీ సుమతి కాబట్టి ఎవరేం అనడంలేదు.అదే వేరే మహిళ అయ్యుంటే..?

*వస్తావా?  రేట్ ఎంత?*

*ఆమె సీపీ సుమతి కాబట్టి ఎవరేం అనడంలేదు.అదే వేరే మహిళ అయ్యుంటే..?*

*రాత్రిపూట మహిళ బయట ఉంటే, ఆమెను ఏమైనా అడిగే హక్కు తమకు ఉందనే భ్రమలో వీరు బతుకుతున్నారు...సైకాలజిస్ట్ విశేష్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 07:

మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, అంతరిక్షంలోకి వెళ్తున్నాం,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచాన్ని శాసిస్తున్నాం.కానీ, మల్కాజ్‌గిరి పోలీస్ కమీషనర్ బి.సుమతి నిర్వహించిన ఒక్క 'స్టింగ్ ఆపరేషన్' మన నాగరికత అట్టడుగున ఇంకా ఎంతటి కుళ్ళిన మనస్తత్వం దాగి ఉందో బట్టబయలు చేసింది.ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారిణి సాధారణ మహిళగా రోడ్డు మీద నిలబడితే,40 మంది మగవారు ఆమెను చుట్టుముట్టి వేధించారంటే... అది కేవలం ఒక క్రైమ్ రిపోర్ట్ కాదు; అది మన సమాజం సామూహిక మానసిక వైఫల్యం.ఈ 40 మందిలో ప్రతి ఒక్కరూ ఒక వేటగాడిలా (Predator) ప్రవర్తించడం వెనుక ఉన్న వికృత సైకాలజీని మనం లోతుగా తవ్వాల్సి ఉంది.ఒక సైకాలజిస్ట్ గా ఈ 40 మంది ప్రదర్శించిన ఆ Predatory Filth పై నా విశ్లేషణ ఇక్కడ ఇస్తున్నాను.
*1️⃣ Serial Predatory Behavior*
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే — ఆ 40 మంది ఒకే గుంపుగా లేరు.విడివిడిగా వెళ్తున్న బ్యాచ్‌లు కూడా ఆమెను చూడగానే ఒకేలా స్పందించాయి.అంటే, రాత్రిపూట తిరుగుతున్న యువతలో ఎంతమంది ఈ Objectification (స్త్రీని వస్తువుగా చూడటం) అనే మానసిక రోగంతో ఉన్నారో అర్థమవుతోంది.వీరి దృష్టిలో రాత్రిపూట ఒంటరిగా కనిపించే మహిళ ఒక మనిషి కాదు,కేవలం తమ శారీరక వాంఛలను తీర్చుకునే ఒక 'వ్యాపార వస్తువు'."రేట్ ఎంత?" అని అడిగే ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే — అది మన పితృస్వామ్య వ్యవస్థ వారికి ఇచ్చిన Unconscious License. 
ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి, గౌరవించాల్సిన పనిలేదు, ఆమెకు ఒక ధర కట్టి కొనొచ్చు అనే అహంకారం వీరి రక్తంలో ఇంకిపోయింది.
*2️⃣ The Psychology of Male Entitlement*
ఈ 40 మందిలో అత్యధికులు చదువుకున్న విద్యార్థులే కావడం అత్యంత విషాదకరం. వీరి మెదడులో ఒక ప్రమాదకరమైన Cognitive Distortion ఉంది. తాము 'మగవారం' కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే Entitlement Mindsetతో బతుకుతున్నారు.రాత్రిపూట మహిళ బయట ఉంటే, ఆమెను ఏమైనా అడిగే హక్కు తమకు ఉందనే భ్రమలో వీరు బతుకుతున్నారు.ఒక మహిళను మాటలతో లొంగదీసుకోవాలని చూడటం, ఆమెను భయపెట్టడం ద్వారా తాము 'శక్తివంతులం' అని నిరూపించుకోవాలని చూస్తారు. దీనినే సైకాలజీలో Toxic Masculinity అంటారు. అంటే తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి స్త్రీపై అధికారాన్ని ప్రదర్శించడం.
*3️⃣ ఇద్దరు ముగ్గురు కలిస్తే చాలు.. మృగం నిద్రలేస్తుంది!*
ఆ 40 మంది విడివిడిగా ఇద్దరు ముగ్గురు చొప్పున వేధించారు.దీన్ని Small Group Deindividuation' అంటారు. ఒక్కడున్నప్పుడు భయపడేవాడు కూడా, పక్కన ఇంకో స్నేహితుడు తోడవ్వగానే తన నైతికతను చంపేసుకుంటాడు.ఒకడు నీచంగా వాగితే, పక్కన ఉన్నవాడు నవ్వి ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహం వారిని మరిన్ని అసభ్య పదజాలం వాడేలా చేస్తుంది.రాత్రి చీకటి తమను గుర్తుపట్టనివ్వదు అనే ధీమా వారిని 'కవర్డ్స్' (పిరికిపందలు) నుండి 'ప్రిడేటర్స్' (వేటాడే మృగాలు) గా మారుస్తుంది.
*4️⃣ Dark Triad*
మనస్తత్వ శాస్త్రం ప్రకారం, ఇలాంటి నేరస్తులలో మూడు ప్రధాన వికృత లక్షణాలు ఉంటాయి.
*🔹 Narcissism:* తమ కోరికలే ముఖ్యం,ఎదుటివారి గౌరవం తృణప్రాయం అనే అహంభావం.
*🔹Psychopathy:* ఒక మహిళకు అంతటి నీచమైన ప్రశ్న వేస్తున్నప్పుడు కనీసం మనస్సాక్షి (Conscience) అడ్డుపడకపోవడం. ఎదుటివారి వేదన వీరికి వినోదం.
*🔹Machiavellianism:* పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని, బాధితురాలిని మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించడం.
సీపీ సుమతి గారు ఆ 40 మందికి ఇచ్చిన ట్రీట్‌మెంట్ సామాన్యమైనది కాదు. దీనిని సైకాలజీలో Cognitive Shock అంటారు."తాము ఒక 'వస్తువు' అనుకుని రేటు కట్టాలని చూసిన వ్యక్తి, తమ మెడకు బేడీలు వేసే 'అత్యున్నత శక్తి' అని తెలిసినప్పుడు వారి అహంకారం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది." "నువ్వు ఏ అమ్మాయిని చూసినా, ఆమె వెనుక ఒక సిపీ సుమతి ఉండొచ్చు అనే భయం నీ మెదడులో నిరంతరం ఉండాలి" అని ఈ ఘటన ద్వారా ఆమె సమాజానికి స్పష్టమైన ఇచ్చిన సందేశం ఇచ్చారు.ఈ భయం మాత్రమే ఇలాంటి మృగాలను అదుపులో ఉంచుతుంది. గౌరవం లేని చోట భయమైనా ఉండాలి.ఆమె సీపీ సుమతి కాబట్టి ఎవరేం అనడంలేదు. అదే వేరే మహిళ అయ్యుంటే.. "అంత అర్ధరాత్రి ఆమె అక్కడ ఎందుకు ఉంది?" అని అడిగే వెధవలు కూడా మన చుట్టూనే ఉన్నారు.మనం ఇంకా Victim Blaming దశలోనే ఉంటే, ఈ 40 మంది మృగాల కంటే మనం భయంకరమైన వాళ్ళం.హీరోయిన్ వెంటపడటమే హీరో లక్షణం అని నమ్మే పిచ్చితనం నుండి యువత బయటకు రావాలి.తోటి మనిషి బాధను పంచుకునే 'సహానుభూతి' లేని సమాజం శవాల కుప్పతో సమానం.డిగ్రీలు వస్తున్నాయి కానీ క్యారెక్టర్ రావడం లేదు. ఈ 40 మంది విద్యార్థులకు ఇప్పుడు కావాల్సింది జైలు శిక్షతో పాటు Behavioral Therapy. 
"నైట్ కు వస్తావా?" అని అడిగిన ఆ 40 మంది యువకులు మన సమాజపు 'నైతిక పతనానికి' సజీవ సాక్ష్యాలు. 
సిపీ సుమతి గారు కేవలం ఆ 40 మందిని పట్టుకోలేదు,మన కళ్లముందు ఉన్న ముసుగును తొలగించారు.ఆ బస్టాండ్‌లో ఉన్నది కేవలం ఒక అధికారిణి కాదు,ఆమె మన సమాజపు ఆత్మగౌరవం.శిక్ష పడటం వల్ల నేరస్థుడు భయపడతాడు, కానీ సరైన సంస్కారం ఉన్నప్పుడు అసలు నేరస్తుడే పుట్టడు. ఈ 40 మంది పోకిరీల ఉదంతం ప్రతి తల్లికి, తండ్రికి ఒక మేలుకొలుపు — మీ అబ్బాయిలను మనుషులుగా పెంచుతున్నారా లేక మృగాలుగా మారుస్తున్నారా?
*పునరాలోచించుకోండి!*
*సైకాలజిస్ట్ విశేష్*
Founder, Genius Matrix Hub

జూబ్లీ హిల్స్‌లోని కేబీఆర్ జాతీయ పార్కులో 'చెట్ల నరికివేత అనుమతుల'ను నిలిపివేయాలి-డాక్టర్ లుబ్నా సర్వత్

*జూబ్లీ హిల్స్‌లోని కేబీఆర్ జాతీయ పార్కులో 'చెట్ల నరికివేత అనుమతుల'ను నిలిపివేయాలి-డాక్టర్ లుబ్నా సర్వత్*

*'వృక్ష సంరక్షణ కమిటీ' అనేది ఒక బూటకపు కమిటీ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 07:
                      
జూబ్లీ హిల్స్‌లోని కేబీఆర్ జాతీయ పార్కులో 'చెట్ల నరికివేత అనుమతుల'పై హైదరాబాద్ జిల్లా కలెక్టర్,హైదరాబాద్ జిల్లా వాల్టా అథారిటీ ఛైర్‌పర్సన్,ఐఏఎస్ శ్రీమతి ప్రియాంక ఆలాతో లక్డికాపుల్, హైదరాబాద్‌లో సమావేశం అయిన అడ్వకేట్ డాక్టర్ లుబ్నా సర్వత్ నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం, ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు మాజీ సభ్యులు, 'ఎన్విరాన్‌మెంటల్ జస్టిస్' ఎడిటర్ డాక్టర్ నారాయణ రావు, పర్యావరణ కార్యకర్త ఇంజనీర్ విజయ్‌లతో కలిసి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కమ్ మేజిస్ట్రేట్ శ్రీమతి ప్రియాంక ఆలా, ఐఏఎస్‌ను ఆమె కార్యాలయంలో కలిసి, చెట్ల నరికివేతకు సంబంధించిన 'చెట్ల పరిరక్షణ కమిటీ ఆమోదాల' కాపీలతో పాటు వినతిపత్రాలను సమర్పించారు.వాల్టా చట్టం మరియు నిబంధనలను చూపిస్తూ కలెక్టర్ గారికి వివరంగా తెలియజేయడం జరిగింది. 'వృక్ష సంరక్షణ కమిటీ' అనేది ఒక బూటకపు కమిటీ అని, వారు నిరంతరం వాల్టా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అయితే, చెట్లను నరికివేయడానికి అధికారాన్ని ఇచ్చే 'వృక్ష సంరక్షణ కమిటీ' అనే నిబంధన వాల్టా చట్టంలో ఏదీ లేదని తెలియజేయడం జరిగింది.చెట్లను నరికివేయడానికి అనుమతులు ఇచ్చే అధికారం కేవలం వాల్టా అథారిటీకి మాత్రమే ఉందని, అయితే 2014 నుండి వాల్టా అథారిటీ సమావేశం ఏదీ జరగలేదని కూడా కలెక్టర్ గారికి చట్టాన్ని చూపించడం జరిగింది.ఆమె హైదరాబాద్ జిల్లా వాల్టా అథారిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నందున,కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆధారంగా మారిన చెట్ల నరికివేత కోసం ఇచ్చే నకిలీ అనుమతుల సమస్యను ఆమె తప్పక పరిష్కరించాలని కోరడం జరిగింది.జల, రెవెన్యూ, నీటిపారుదల, భూగర్భ జల శాఖ మొదలైన విభాగాల నుండి ఇతర పదవీరీత్యా సభ్యులతో పాటు, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ మరియు హెచ్‌ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ కూడా హైదరాబాద్ జిల్లా వాల్టా అథారిటీలో పదవీరీత్యా సభ్యులుగా ఉన్నారనే విషయంపై కూడా కలెక్టర్ దృష్టికి తీసుకరావడం జరిగింది. అధికారులు జీవో 539ని ఉదహరిస్తున్నారు. 11.12.2008 నుండి, శ్రీ వేద కుమార్ (ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్), శ్రీ చెలికాని (యుఫెర్వాస్) మరియు వరల్డ్ వైడ్ ఫండ్ వంటి అదే వ్యక్తుల పేర్లను 18 సంవత్సరాలుగా ఉపయోగించడం పూర్తిగా అధికార పరిధికి మించినది. ఇది ప్రజలను, న్యాయస్థానాలను, సహ-అధికారులను కూడా అక్షరాలా మోసం చేయడమే. పైన పేర్కొన్న ముగ్గురు పౌర సమాజ సభ్యులు చెట్లు నరికే అనుమతి పత్రాలపై సంతకం చేశారో లేదో తెలియదు, ఎందుకంటే ఆ అనుమతి పత్రాలు రహస్యంగా ఉంచబడ్డాయి.అభ్యర్థనలకు, ఆర్టీఐకి గానీ, లేదా బహిరంగంగా గానీ అవి అందుబాటులో లేవు అని కలెక్టర్ కు తెలియచేశారు.తాను ఈ పదవికి కొత్త అని, ఈ విషయాన్ని పరిశీలిస్తానని ఆమె బదులిచ్చారు.ప్రజలమైన మేము, పారదర్శకత, జవాబుదారీతనం మరియు స్పందన ద్వారా ప్రతి పౌరుడికి అత్యంత గౌరవం కావాలని కోరుకుంటున్నాము, ఎందుకంటే ఇక్కడ ప్రమాదంలో ఉన్నది ప్రజల డబ్బు మరియు జీవితాలు.ఇది మన ప్రజల ప్రభుత్వం మరియు పరిపాలనలోని ప్రతి స్థాయిలో, ఎక్కడైనా ప్రజల గొంతుక, చట్టబద్ధమైన పాలన మరియు సహజ న్యాయ సూత్రాలు నిలబెట్టబడాలని మేము కోరుకుంటున్నాము అని డాక్టర్ లుబ్నా సర్వత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అన్నారు.

Wednesday, May 6, 2026

కొత్త డీజీపీకి బొకే అందిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకులు

*కొత్త డీజీపీకి బొకే అందిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకులు*

*నూతన డీజీపీని కలిసిన ఓయూ విద్యార్ధి నాయకుడు: జి యుగంధర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,మే 06:

తెలంగాణ రాష్ట్ర పోలీస్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ను ఓయూ స్టూడెంట్ లీడర్ జి యుగంధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖను సామర్ధ్యవంతంగా ముందుకు నడిపించాలని కోరారు. ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణలో మరింత మెరుగైన సేవలు అం దించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సమస్యల  పరిష్కారంలో పోలీసుల సహకారం అవసరమని క్యాంపస్ లలో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు.నూతన డిజిపి సీవీ ఆనంద్ నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ స్టూడెంట్ నాయకులు  రమేష్, వెంకట్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం విద్యుత్ శాఖ నిర్లక్ష్యం – రైతు నూక గణేష్‌కు భారీ నష్టం

*నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం విద్యుత్ శాఖ నిర్లక్ష్యం – రైతు నూక గణేష్‌కు భారీ నష్టం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 06:

నల్గొండ జిల్లా,శాలిగౌరారం మండలం, పెర్కకొండారం గ్రామానికి చెందిన కోళ్ళ ఫాం రైతు నూక గణేష్ గారు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. గత ఆదివారం వచ్చిన ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కానీ అడ్లూర్ పరిధిలో ఉన్న లైన్మెన్ నిర్లక్ష్యం, సంబంధిత విద్యుత్ అధికారుల స్పందన లోపం కారణంగా గంటలు కాదు... రోజులు గడిచినా కరెంటు పునరుద్ధరణ జరగలేదు.దీంతో కోళ్ల ఫామ్‌లో తాగునీరు అందక, సుమారు 320 కోళ్లు మృతి చెందడం అత్యంత దురదృష్టకరం మాత్రమే కాదు — ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. రైతు కష్టాన్ని అర్థం చేసుకోని వ్యవస్థ వైఫల్యం ఇది.
శాలిగౌరారం మండలం వ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉంది. లైన్మెన్లు తమ విధులు నిర్వర్తించకుండా, ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని పనులు చేయించడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది. గ్రామాల్లో కరెంటు సమస్యలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి.ఈ విషయంపై శాలిగౌరారం ఏఈ గారిని, నల్లగొండ డీఈ గారిని సంప్రదించినప్పటికీ సరైన స్పందన లేకపోవడం అత్యంత విచారకరం. బాధ్యతల నుండి తప్పించుకోవడం కాదు — ప్రజల సమస్యలపై స్పందించడం అధికారుల ప్రథమ కర్తవ్యం.
•ప్రజల డిమాండ్లు:
-కోళ్ళ మృతి చెందిన ఘటనపై తక్షణ విచారణ చేపట్టాలి.
-రైతు నూక గణేష్ గారికి పూర్తి నష్టపరిహారం వెంటనే అందించాలి.
-నిర్లక్ష్యం చేసిన ఏఈ, లైన్మెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-మండలంలో విద్యుత్ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించి, అత్యవసర సేవలను బలోపేతం చేయాలి.
ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం తప్పదని హెచ్చరిస్తున్నాము.
“రైతు నష్టం – ప్రభుత్వ నిర్లక్ష్యం… ఇక సహించేది లేదు!”