Sunday, January 16, 2022

సంక్రాంతి: మూడు రోజుల్లో హైదరాబాద్ ప్రజలు ఎంత చికెన్ తిన్నారంటే..

సంక్రాంతి: మూడు రోజుల్లో హైదరాబాద్ ప్రజలు ఎంత చికెన్ తిన్నారంటే..- ప్రెస్ రివ్యూ

Courtesy by : BBC తెలుగు మీడియా ట్విట్టర్ 
కోడి చికెన్

ఫొటో సోర్స్,GETTY IMAGES

గ్రేటర్‌ హైదరాబాద్ ప్రజలు సంక్రాంతి పండగకు రికార్డు స్థాయిలో చికెన్‌ తిన్నారని, శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుమారు 60 లక్షల కిలోల చికెన్‌ కొనుగోలు చేశారని సాక్షి పత్రిక తెలిపింది.

ప్రధానంగా మటన్‌ కంటే చికెన్‌ వైపే ప్రజలు మొగ్గుచూపారు. ఇందుకు కారణం చికెన్‌ ధర మటన్‌ కంటే తక్కువగా ఉండటమే. మాంసం కిలో రూ.850- రూ.900 ఉండగా.. చికెన్‌ రూ.240 పలికింది. గ్రేటర్‌ పరిధిలో సాధారణంగా రోజుకు 10 లక్షల కిలోల చికెన్‌ వినియోగం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

శుక్ర, శనివారాల్లో దాదాపు 30 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరగగా, ఆదివారం ఒక్కరోజే ఏకంగా 30 లక్షల కిలోల చికెన్‌ అమ్ముడుపోయినట్లు అంచనా.

మామూలు రోజుల్లో మటన్‌ రెండు లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి. ఆదివారం ఐదు లక్షల కిలోల మటన్‌ గ్రేటర్‌ ప్రజలు కొనుగోలు చేశారు. మూడు రోజుల్లో మటన్‌ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారని ఈ వార్తలో రాశారు.


No comments:

Post a Comment