Indian Army Day 2022 : జనవరి 15... భారతదేశ చరిత్రలో ఈరోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్‌లో బ్రిటీష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కోదండెర ఎం. కరియప్ప 1949లో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటీష్ వలస పాలన నుంచి బయటపడ్డ రెండేళ్ల తర్వాత కానీ సైన్యంపై అధికారాలు భారత్ ఆధీనంలోకి రాలేదు. అప్పటినుంచి భారత్ జనవరి 15ని 'ఆర్మీ డే'గా జరుపుకుంటోంది. సైనికుల త్యాగాలు, దేశ రక్షణలో సైనికుల పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతీ ఏటా 'ఆర్మీ డే' వేడుకలను నిర్వహిస్తున్నారు.

చరిత్రలో 'ఆర్మీ డే' :

బ్రిటీష్ వలస పాలనలో ఏప్రిల్ 1, 1895న బ్రిటీష్ ఇండియన్ ఆర్మీని స్థాపించారు. భారత్‌కు ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ... ఆ తర్వాత రెండేళ్ల తర్వాత కానీ సైన్యంపై అధికారాలు భారత్‌కు బదిలీ కాలేదు. ఎట్టకేలకు జనవరి 15, 1949న అప్పటి భారత లెఫ్టినెంట్ జనరల్ కరియప్ప బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ చీఫ్ నుంచి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.


ఇండియన్ ఆర్మీ డే వేడుకలు :


ఆర్మీ డే వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర జవాన్ల స్మారకార్థం ఏర్పాటు చేసిన 'అమర జవాన్ జ్యోతి' వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కరియప్ప పరేడ్ మైదానంలో జవాన్ల పరేడ్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ యుద్ధ ట్యాంకులు, ఆర్మీలో ఉపయోగించే మోడర్న్ టెక్నాలజీని ప్రదర్శనకు ఉంచుతారు. ఇదే వేడుకల్లో సైనికుల గౌరవార్థం సేన పతకాలు, డివిజన్ క్రెడెన్షియల్స్ అందిస్తారు.


సైనికులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు :

భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 'ఆర్మీ డే' శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆర్మీ డే సందర్భంగా మన ధీర సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్య సాహసాలకు, ప్రొఫెషనలిజానికి భారత సైన్యం పెట్టింది పేరు. దేశ భద్రత కోసం భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలను వర్ణించేందుకు మాటలు సరిపోవు.' అంటూ నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.