Friday, December 31, 2021

అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు పేర్లు పెట్టుకున్న చైనా – ఖండించిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు పేర్లు పెట్టుకున్న చైనా – ఖండించిన భారత్

చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల పేర్లు మార్చేసింది. 15 ప్రదేశాలకు చైనా అక్షరాలు, టిబెటన్ , రోమన్ వర్ణమాలతో కూడిన పేర్లు ప్రకటించింది. ఈ విషయాన్ని క్లెయిమ్ చేస్తూ… చైనా అధికారిక వార్తా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ కథనాన్ని ప్రచురించింది. చైనా కేబినెట్ స్టేట్ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలనూ పత్రిక ప్రస్తావించింది. అయితే చైనా చర్యల్ని భారత్ ఖండించింది. దుష్ట చైనా చర్యలు దేశంలో అంతర్భాగంగా ఉన్న ప్రాంత స్థితిని మార్చలేవని ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త సరిహద్దు భద్రతా చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో చైనా ఈ ఘనకార్యం చేసింది. అయితే అరుణాచల్లో చైనా పేర్లు మార్చడం ఇదేం మొదటిసారి కాదు. ఏప్రిల్ 2017లోను కూడా ఇలాగే చేసింది.

అరుణాచల్ ప్రాంతాన్ని చైనాలోని జిజాంగ్ ప్రాంతంలోని దక్షిణభాగం అయిన జాంగ్నాన్ గా పేర్కొంటూ వాటికి చైనా పేర్లు ప్రకటించింది. చైనా పేరు మార్చిన 15 ప్రదేశాలలో ఎనిమిది నివాస ప్రాంతాలున్నాయి. వాటికి సెంగ్కెజాంగ్, దాగ్లుంగ్ జాంగ్, మనిగాంగ్, డుడింగ్, మిగ్ పెయిన్, గోలింగ్, డంబా, మెజాక్ అని పేర్లు పెట్టింది. నాలుగు పర్వతాలకేమో వామో రి, డు రి, లన్ జుబ్ రి, కున్ మింగ్ జింగ్ ఫెంగ్ అనీ, రెండు నదులకు జెన్ యాగ్మో, దులైన్ అని …పర్వత మార్గానికి సె లా అని పేర్లు పెట్టింది దుష్ట చైనా.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏరియాలకు తన భాషలో పేరు మార్చిన చైనా చర్యను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఖండించారు. అబద్ధాలను నిజాలుగా ఎప్పటికీ నమ్మించలేరు… అరుణాచల్ ఎప్పుడూ భారత్ అంతర్భాగం…పేర్లు మార్చడం వల్ల అది చైనా అతర్భాగం కాబోదని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో 90,000 చ.కి.మీ తమవేనంటూ చైనా క్లెయిమ్ చేస్తూ వస్తోంది.

2017లోనూ అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలకు చైనా తన సొంత పేర్లను జారీ చేసింది. జనవరి 1 నుండి కొత్త సరిహద్దు భద్రతా చట్టం అమలులోకి రాబోతున్నందున తాజా పేర్ల జాబితాను విడుదల చేసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) , రాష్ట్ర ఏజెన్సీలకు మరిన్ని అధికారాలను ఇస్తుంది తాజాచట్టం. సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులకు రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, సరిహద్దు పట్టణాల నిర్మాణం మొదలగు అధికారాలుంటాయి.


No comments:

Post a Comment