Friday, December 10, 2021

తెలంగాణలోని 705 ప్రైవేటు కాలేజీలు మూతబడ్డాయి.

Courtesy by ABN ఆంధ్రజ్యోతి ట్విట్టర్ 

  • ఏడేళ్లుగా మూతపడుతున్న ప్రైవేటు కాలేజీలు.. 
  • ఉన్నత విద్య అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం!
  • విద్యార్థుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో సకాలంలో విడుదల కాని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు
  • విద్య కోసం తెలంగాణ కేటాయింపులూ తక్కువే.. 
  • అనేక రాష్ట్రాల కంటే వెనకబడి ఉందన్న న్యాక్‌
హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి ఉన్నత విద్య పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించిన కాలేజీల సంఖ్య ఏటా తగ్గిపోతుండడమే ఇందుకు నిదర్శనం. గడిచిన ఏడేళ్లలో తెలంగాణలోని 705 ప్రైవేటు కాలేజీలు మూతబడ్డాయి. వీటిలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ కాలేజీలున్నాయి. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల కాకపోవడం, విద్యార్థుల నుంచి డిమాండ్‌ లేకపోవడం వంటివి ఈ కాలేజీలు మూతబడటానికి కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్నత విద్య అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నేషనల్‌ అసె్‌సమెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) సూచించిన నేపథ్యంలో.. అ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఉన్నత విద్యలో అడ్మిషన్ల విషయంలో దేశంలో అనేక రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని న్యాక్‌ ప్రకటించింది. పరిశోధనలు పెంచి, ఉన్నత విద్య అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించింది. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడచిన ఏడేళ్లలో ఏకంగా 700కు పైగా ఉన్నత విద్య కళాశాలలు మూత పడడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. 2014-15లో రాష్ట్రంలో 1703 ప్రైవేటు ఉన్నత విద్య కాలేజీలున్నాయి. వీటిలో ఇంజనీరింగ్‌ బీ-ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, ఎంటెక్‌, ఎంఫార్మసీ, బీఈడీ వంటి కాలేజీలున్నాయి. కానీ, ప్రస్తుతం ఈ కాలేజీల సంఖ్య 998కి పడిపోయింది. ఒక్క లా కాలేజీలు మినహా మిగిలిన అన్ని కోర్సుల కాలేజీల సంఖ్య పడిపోతోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్‌, బీ-ఫార్మసీ, ఎంబీఏ వంటి కాలేజీల భారీగా తగ్గిపోతున్నాయి.

జూనియర్‌, డిగ్రీ కాలేజీలు కూడా..

ఉన్నత విద్యలోనే కాకుండా రాష్ట్రంలో జూనియర్‌, డిగ్రీ కాలేజీల సంఖ్య కూడా తగ్గిపోతోంది. గతంలో రాష్ట్రంలో ప్రెవేటు రంగంలో 1680 డిగ్రీ కాలేజీలుండగా నేడు 886కు పడిపోయాయి. 2,600కు పైగా ఉన్న జూనియర్‌ కాలేజీలు 1785కు తగ్గిపోయాయి. ఇలా.. జూనియర్‌, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి కాలేజీలన్నీ కలిపి 2,300కు పైగా మూతపడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల పరిస్థితి దారుణంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో మరింత మెరుగైన ప్రమాణాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని న్యాక్‌ అభిప్రాయపడింది. రాష్ట్రంలో కేవలం 11 శాతం కాలేజీల్లోనే మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు నెలకొన్నాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం కేటాయిస్తున్న నిధులు కూడా తక్కువగానే ఉన్నాయని  అభిప్రాయపడింది. దేశ వ్యాప్తంగా విద్యకు అన్ని రాష్ట్రాల సగటు కేటాయింపులు బడ్జెట్‌లో 15.9 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం 10 శాతం లోపే ఉన్నట్లు తెలిపింది. కొటారి కమిటీ ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌లో సుమారు 30 శాతం విద్య కోసం కేటాయించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. 

న్యాక్‌ చేసిన సూచనలు..

ఉన్నత విద్య కోసం తగిన నిధులు విడుదల చేయాలి

రీసెర్చ్‌ విభాగాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి.

వర్సిటీలు, కాలేజీల్లో సదుపాయాలు కల్పించాలి.

అన్ని విద్యా సంస్థలు న్యాక్‌ గుర్తింపు కోసం ప్రయత్నించేలా చర్యలు తీసుకోవాలి.

న్యాక్‌ గుర్తింపు కచ్చితమనే విధానాన్ని అమలు చేయాలి. అప్పుడే యూజీసీ, రుసాల నుంచి గ్రాంట్స్‌ రూపంలో నిధులు వస్తాయి.

విద్యా సంస్థల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. అవసరమైన నిధులను అందుబాటులో ఉంచాలి.

ఉద్యోగాలు వచ్చే కోర్సులను అభివృద్ధి చేసి, ఇండస్ట్రీ-అకాడమిక్‌ సహకార విధానాన్ని అమలు చేయాలి.

అన్ని ప్రవేశ పరీక్షలకు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సెట్‌)లను నిర్వహించాలి.

వచ్చే పదేళ్లలో ఉన్నత విద్యలో లక్ష్యంపై ప్రభుత్వం ఒక విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రకటించాలి.

No comments:

Post a Comment