హైదరాబాద్ : 19/07/2021
ఏదో కట్టాం కదా అన్నట్లుంటే...: పోలవరంపై సమీక్షలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
asianet news తెలుగు ట్విట్టర్ సౌజన్యంతోసోమవారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సందర్భంగా నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీలపై అధికారులకు కీలక సూచనలిచ్చారు.
పోలవరం ఆర్ అండ్ ఆర్ పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఏదో కట్టాం కదా? అన్నట్టు పునరావాస కాలనీలు కట్టకూడదని... కచ్చితంగా నాణ్యత పాటించాలని సీఎం సూచించారు. మొత్తం 90 ఆవాసాల్లో ఈ ఆగస్టు నాటికి 48 ఆవాసాల నుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు వివరించారు అధికారులు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. తాడేపల్లి నుంచి నేరుగా పోలవరంకు హెలికాప్టర్లో చేరుకున్న సీఎం హెలిపాడ్ వద్దనున్న వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. అక్కడ నుంచి ఇటీవలే పూర్తైన స్పిల్వే మీదకు చేరుకున్న సీఎం పనుల్ని పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల్ని సీఎంకు వివరించారు అధికారులు.

ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పిల్వే పనులు దాదాపుగా పూర్తిచేశామని... 48 గేట్లలో 42 గేట్లు అమరిక, మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని తెలిపిన అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే జర్మనీ నుంచి సిలిండర్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఎగువ కాఫర్డ్యాంలో అదివరకు ఉన్న ఖాళీలను పూర్తిచేశామన్నారు. అలాగే దిగువ కాఫర్డ్యాం పనుల పరిస్థితిని కూడా సీఎంకు వివరించారు అధికారులు.

పోలవరం ఆర్ అండ్ ఆర్ పైనా సీఎం సమీక్షించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆర్ అండ్ ఆర్ పనులపై పూర్తి దృష్టిపెట్టామన్నారు. ఇంతపెద్ద ఎత్తున పునరావాస కాలనీలు కడుతున్నప్పుడు సహజంగానే ఎక్కడోచోట అలసత్వం కనిపించే అవకాశాలు ఉంటాయని... అలాంటి అసత్వానికి తావు ఉండకూడదు, నాణ్యత కచ్చితంగా ఉండాలన్న సీఎం ఆదేశించారు.

ఆర్ అండ్ ఆర్ పనుల్లో నాణ్యత కచ్చితంగా పాటించేలా ఒక అధికారిని నియమించాలన్న ముఖ్యమంత్రి సూచించారు. ఆ అధికారి ఇచ్చే ఫీడ్ బ్యాక్ను తప్పకుండా అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్నారు సీఎం. తప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు కచ్చితంగా వాటిని సరిదిద్దుకోవాలన్న సీఎం సూచించారు.

వేగంగా నిర్మించాలని, లక్ష్యాలను త్వరగా చేరుకోవాలన్న ప్రయత్నంలో అక్కడక్కడా తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి... అలాంటి సందర్భాల్లో వాటిని సరిదిద్దే ప్రయత్నాలు తప్పకుండా జరగాలని సీఎం పేర్కొన్నారు. కొంత డబ్బు ఎక్కువ ఖర్చుపెట్టినా సరే నాణ్యత మాత్రం తప్పకుండా పాటించాలన్న అధికారులకు సీఎం ఆదేశించారు.

పునరావాస కాలనీల్లో నిర్వాసితులు జీవితాంతం ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు సీఎం జగన్. కాలనీల నిర్మాణంతో పాటు సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలన్నారు. రోడ్లు, ఇతర సామాజిక అభివృద్ధి పనులను స్థిరంగా చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.

ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్, రవాణాశాఖమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పోలవరం నిర్మాణసంస్ధ ప్రతినిధులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment