Monday, July 26, 2021

పల్లె ముంగిట బీమానమూనా - గ్రామాల అవతరణ

హైదరాబాద్ : 27/07/2021

ప్రధాన వ్యాఖ్యానం

ఈనాడు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
   
పల్లె ముంగిట బీమా

నమూనా గ్రామాల అవతరణ
పల్లె ముంగిట బీమా

దేశ జనాభాలో అధిక శాతం ఇప్పటికీ పల్లెల్లోనే నివసిస్తున్నారు. వివిధ కారణాల వల్ల గ్రామీణులకు బీమా ప్రయోజనాలు పూర్తిగా అందడం లేదు. ఏదైనా అనారోగ్యం, ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతినడం వంటివి సంభవించినప్పుడు- ఆ నష్టాన్ని భరించే ఆర్థిక శక్తి లేక ఎన్నో కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ‘నమూనా బీమా గ్రామాలు ఏర్పాటు చేయాలని దేశీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఇర్డాయ్‌) నిర్ణయించింది. గ్రామీణులకు సమగ్ర బీమా రక్షణ పథకాలను రూపొందించి- తక్కువ, రాయితీ ప్రీమియంతో అంటుబాటులోకి తీసుకురావడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర, కేంద్ర స్థాయుల్లో వివిధ ప్రభుత్వ పురస్కారాలను గెలుచుకున్న; సాంఘిక సంక్షేమం, పర్యావరణ అనుకూల కార్యక్రమాలను అమలు చేసిన; సమాజ ఆధారిత భాగస్వామ్య సంక్షేమ ప్రయత్నాల్లో ప్రవేశం ఉన్న పల్లెలకు నమూనా బీమా గ్రామాల ఎంపికలో ప్రాధాన్యమిస్తారు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ముందు 500 గ్రామాలను ఎంపిక చేస్తారు. రాబోయే రెండేళ్లలో దీన్ని వెయ్యి గ్రామాలకు విస్తరిస్తారు.

రైతుల ఆదాయం పెరిగితేనే...

పల్లె ముంగిట బీమాపల్లెల్లో బీమా సంస్థల యంత్రాంగం బలహీనంగా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ వెనకబడి ఉంది. బీమా సంస్థల మధ్య సమన్వయ లోపంతో సమస్య ముమ్మరిస్తోంది. గ్రామాల్లో బీమా వ్యాప్తిని పెంచడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు యాభై కోట్ల మందికి అయిదు లక్షల రూపాయల మేరకు వార్షిక ఆరోగ్య బీమా రక్షణను అందుబాటులోకి తెచ్చింది. వయోధికుల ఆరోగ్య బీమా పథకం, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలు ఈ     పథకంలో భాగమయ్యాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద   కుటుంబాలకు ఇది ఆసరాగా నిలబడుతుంది. మరోవైపు, భారతీయ వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి ఉంది. వాతావరణంలో మార్పులకు ఎక్కువగా ప్రభావితం అవుతుంటుంది. భూస్థితి,     వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రపంచంలో విపత్తుల ముప్పు   అధికంగా ఉండే దేశాల్లో భారత్‌ ఒకటి. దేశీయంగా 12శాతం భూమి తరచూ వరదల తాకిడికి, కోతలకు గురవుతుంది. సుమారు 5,700 కిలోమీటర్ల తీరప్రాంతం తుపానులతో తల్లడిల్లుతోంది. 68శాతం సాగుభూమి కరవు కాటకాల్లో చిక్కుకొని ఉంది. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి రైతులను కాపాడటానికి అనేక బీమా పథకాలను ప్రవేశపెట్టారు. పంట, ప్రాంతం, వాతావరణం ఆధారితంగా వివిధ పంట బీమా పథకాలను తీసుకొచ్చారు. వీటిలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ముఖ్యమైనది. విపత్తులతో రైతులకు కలిగే నష్టాలను పూడ్చటం దీని లక్ష్యం. అయితే, సరళమైన పాలసీల అందుబాటు ద్వారానే గ్రామాల్లో బీమా వ్యాప్తి ఊపందుకుంటుంది. ప్రజల ఆదాయాలు, ఆస్తులు      పెరిగితే వాటి రక్షణకు బీమా ఉత్పత్తుల అవసరం ఇనుమడిస్తుంది. అనుకోని నష్టాలు సంభవిస్తే వాటిని ఎదుర్కోవడానికి బీమా అక్కరకొస్తుందన్న అవగాహనను పెంచడానికి వీలవుతుంది. తద్వారా గ్రామీణ మార్కెట్లో బీమా వ్యాపార విస్తరణకు అవకాశాలు ఏర్పడతాయి. నమూనా బీమా గ్రామాల ఏర్పాటులోని ప్రధాన ఉద్దేశం ఇదే. ఈ ప్రాజెక్టులో గ్రామ జనాభా మొత్తాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామస్థుల ఆస్తి, పంటలు, వ్యవసాయ యంత్రాలు, వాహనాలు, గ్రామ స్థాయిలో ఉండే వివిధ సేవలు, తయారీ సంస్థలను బీమా పరిధి కిందికి తీసుకువస్తారు. ఆ గ్రామంలోని ఇతర ప్రత్యేక బీమా అవసరాలను తీర్చేలా పాలసీలను రూపొందించడానికి ప్రత్యేక ప్రయత్నాలూ జరుగుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని బీమా సంస్థలు తమ ఉత్పత్తులు, వాటి ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఇర్డాయ్‌ నిర్దేశించింది. దీనితో పాటు గ్రామీణుల కోసం వినూత్నమైన, సరసమైన, సాంకేతిక-ఆధారిత బీమా ఉత్పత్తులను ప్రవేశపెట్టాల్సి ఉంది. గ్రామీణుల ఆర్థిక నష్టాలను సమగ్రంగా భరించే ఉత్పత్తులను బీమా సంస్థలు రూపొందించాలి. ఈ ప్రక్రియలో బీమా సంస్థలు- స్వయం సహాయక సంఘా సభ్యులు, బ్యాంకింగ్‌ ప్రతినిధుల సేవలను ఉపయోగించుకోవచ్చు.

పేదలకు భరోసా

దేశంలో అసంఘటిత రంగంలోని అధిక శాతం కార్మికులకు కనీస వేతనాలు లేవు. వారికి ఎటువంటి సామాజిక భద్రతా లేదు. కొవిడ్‌ కారణంగా అసంఘటిత రంగంలోని 40 కోట్ల శ్రామికులు దుర్భర దారిద్య్రంలోకి జారిపోవచ్చన్నది అంచనా! వీరికి బీమా అవసరం చాలా ఉంది. గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో బీమా ఉత్పత్తుల లభ్యత, వాటి పంపిణీ అంతంత మాత్రమే. ఈ ప్రాంతాల్లోనే బీమా సంస్థలు మెరుగైన పనితీరును ప్రదర్శించాలి. గ్రామీణ ప్రాంతాల్లో బీమా సేవలు అందించడం అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనే వాదన ఉంది. ఉత్పత్తుల్లో కొత్త ఆవిష్కరణలకు, ఆధునికతకు ప్రాధాన్యమిస్తే లాభాలవైపు పయనించడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చు. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రభుత్వం 74 శాతానికి పెంచింది. దీని ద్వారా వచ్చే మూలధనాన్ని బీమా సంస్థలు సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై కేంద్రీకృతం చేయడం ద్వారా గ్రామాల్లో బీమా సేవలను విస్తరించవచ్చు. గడచిన ఏడాది కాలంగా కొవిడ్‌ వల్ల ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. పాలసీల విక్రయాల్లో నమోదైన వృద్ధే దీనికి నిదర్శనం. నమూనా బీమా గ్రామాల ప్రాజెక్టును బీమా సంస్థలు పకడ్బందీగా అమలు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో జీవన, ఆరోగ్య బీమా ఉత్పత్తులతో పాటు, వ్యవసాయ సంబంధ బీమా ఉత్పత్తుల వ్యాప్తి సైతం అధికమవుతుంది. ఉరుము లేని పిడుగులా వచ్చి పడే నష్టాలతో గ్రామీణులు పేదరికంలోకి జారిపోకుండా ఉండటానికి ఇది అక్కరకొస్తుంది.  


అవగాహన కల్పించాలి

బీమా వ్యాప్తి (జీడీపీలో బీమా ప్రీమియం శాతం) అతి తక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. ఇర్డాయ్‌ 2019-20 వార్షిక నివేదిక ప్రకారం దేశీయంగా 3.6 శాతానికి మాత్రమే ఈ వ్యాప్తి పరిమితమైంది. రష్యా మినహా మిగిలిన బ్రిక్స్‌ దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో 86శాతం, పట్టణాల్లో 81శాతం ప్రజలకు ఆరోగ్య బీమా రక్షణ లేదని 75వ జాతీయ నమూనా సర్వే తేల్చింది. భారత్‌లో బీమా ఉత్పత్తుల వ్యాప్తి తక్కువగా ఉండటానికి అనేక కారణాలున్నాయి. బీమా ప్రయోజనాలు, దావా పరిష్కార విధానాలపై ప్రజల్లో సరైన నమ్మకం, అవగాహన లేకపోవడం వీటిలో ముఖ్యమైనది. గ్రామీణులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉండే పాలసీలు అందుబాటులో లేవు. స్నేహపూర్వక, పారదర్శక దావా పరిష్కార విధానాలు కరవయ్యాయి.

No comments:

Post a Comment