Friday, February 25, 2022

అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై...... హైకోర్టు కీలక తీర్పు.......!

*అనధికార లేఅవుట్లలో  ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై...... హైకోర్టు కీలక తీర్పు.......!*

హైదరాబాద్‌: అనధికార లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనుమతి లేని లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ 2020లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో 5వేలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వేల సంఖ్యలో పిటిషన్లు వస్తున్నందున వీటన్నింటిపై విచారణచేపట్టిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అనధికార లే అవుట్లలో ప్లాట్లనూ షరతులతో రిజిస్ట్రేషన్‌ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లశాఖ జారీ చేసిన మెమోతో సంబంధం లేకుండా ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. షరతులు వర్తిస్తాయని కొనుగోలు దారులకు ముందే చెప్పాలని స్పష్టం చేసింది.

2020లో రిజిస్ట్రేషన్ల శాఖ మెమో జారీ చేసిన తర్వాత.. గతేడాది ఒక పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం నిజాంపేట మున్సిపాలిటీ కమిషనర్‌, సబ్‌ రిజిస్ట్రార్‌కు అనధికార లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలని ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ పిటిషన్‌ సుప్రీంకోర్టు విచారణలో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి జరగబోయే రిజిస్ట్రేషన్లు అన్నీ సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని డాక్యుమెంట్‌ రెండో పేజీలో రాయాలని, అదే విషయాన్ని కొనుగోలు దారులకు తెలియజేయాలని సబ్‌రిజిస్ట్రార్లను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్లందరు కూడా .. ప్రభుత్వం జారీ చేసిన మెమోతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొంది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, 30 అడుగుల రోడ్డు ఉందా? లేదా? అనే విషయాన్ని కొనుగోలు దారులు చూసుకోవాలి. ఒక వేళ అవి లేనట్లయితే సంబంధిత చట్టాలను ఉల్లంఘించినట్టవుతుంది కాబట్టి ఆవిషయాలను కూడా ముందే కొనుగోలు దారులకు సబ్‌ రిజిస్ట్రార్లు చెప్పడంతో పాటు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లోని రెండో పేజీ వెనుకభాగంలో ఇవన్నీ కూడా పొందుపర్చాలని ధర్మాసనం తెలిపింది. చట్టాలకు అనుగుణంగా లేని ప్లాట్ల విషయంలో కొనుగోలుదారులదే పూర్తి బాధ్యత అని హెచ్చరించాలని పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లతో పాటు ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌, రిజిస్ట్రేషన్‌ వెబ్‌ సైట్లలో కూడా ఇదే అంశం పొందుపర్చాలని తెలపింది. కొన్ని వేల పిటిషన్లు వస్తున్నందున ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఇవే నిబంధనలు పాటించాలని సబ్‌రిజిస్ట్రార్లలను హైకోర్టు ఆదేశించింది.

*link Media ప్రజల పక్షం🖋️*

No comments:

Post a Comment