Monday, February 14, 2022

రెండు రాష్ట్రాలకు విద్యుత్ నిలిపేయండి..!

రెండు రాష్ట్రాలకు విద్యుత్ నిలిపేయండి..!

కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ

– రెండు రాష్ట్రాల సీఎస్‌ లకు లేఖ రాసిన బోర్డ్

–శ్రీశైలంలో భారీ తగ్గిన నీటిమట్టం

–రానున్న రోజుల్లో తప్పని తిప్పలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశించింది. రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకోవద్దని రెండు రాష్ట్రాల సీఎస్‌ లకు లేఖ రాసింది. ఇప్పటి వరకు రాసిన లేఖలపై ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది బోర్డు.

ఈ సంవ‌త్సరం మే నెల వ‌ర‌కు తెలంగాణ‌కు మూడు టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌ కు ఆరు టీఎంసీలు తాగునీటికి కోసం అవ‌స‌రం ఉంటుంద‌ని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 34.24టీఎంసీలు మేర మాత్రమే నీరు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్టు కేఆర్ఎంబి స్పష్టం చేసింది.
215 టీఎంసీల సామర్థ్యం ఉండాల్సిన శ్రీశైలం జలాశయంలో.. 35 టీఎంసీల డెడ్‌ స్టోరేజీ స్థాయికి నీటి నిల్వలు అడుగంటిపోయాయి. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుత్‌ ఉత్పత్తిచేయడంతో ఈ దుస్థితి వచ్చిందటున్నారు ఇరిగేషన్ నిపుణులు. ఇరు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న జలవిద్యుత్తులో శ్రీశైలం వాటానే చెరో 40 శాతంగా ఉండటంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని అన్నారు. అయితే.. పరిస్థితులను ముందే ఊహించి.. ఐదు నెలల క్రితమే ఇరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ బోర్డు లేఖలు రాసింది.తాగు, సాగు నీటి అవసరాల కంటే ఎక్కువగా నీరు ఉంటేనే జలవిద్యుత్తు ఉత్పత్తి జరగుతోంది. కానీ.. విద్యుదుత్పత్తి కోసమే నీటిని వినియోగించి.. సముద్రంలోకి వృథాగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఇరు రాష్ట్రాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది ఇదే సమయానికి 129.78 టీఎంసీల నీరు ఉండేది. కానీ.. ఇప్పుడు నీటి నిల్వలు ఏకంగా 35.51 టీఎంసీలకు పడిపోయాయి. కేఆర్‌ఎంబీ లేఖ రాసిన తర్వాత ఇరు రాష్ట్రాలు జలవిద్యుదుత్పత్తి కోసం 59 టీఎంసీలను వినియోగించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఈ ఏడాది వెయ్యికి పైగా  టీఎంసీల మేర ఇన్‌ ఫ్లో వచ్చినప్పటికీ.. ప్రస్తుత నిల్వలు డెడ్‌ స్టోరేజీ స్థాయిలో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు మేల్కోకపోతే సమ్మర్‌ లో తాగునీటి సమస్యలు తప్పవని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment