Friday, March 4, 2022

కేసీఆర్ కు పీకే ఉంటే కాంగ్రెస్ కు 40 లక్షల ఏ కే 47 లు వున్నాయి...... రేవంత్ రెడ్డి!

*కేసీఆర్ కు పీకే ఉంటే  కాంగ్రెస్ కు 40 లక్షల ఏ కే 47 లు వున్నాయి...... రేవంత్ రెడ్డి!*

హైదరాబాద్‌: 'నలభై లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి టీ.కాంగ్రెస్ దేశంలో నెంబర్ వన్‌గా నిలబడింది. 50 లక్షల వరకు ఈ సభ్యత్వాలను పెంచాలి.
అప్పుడు రాబోయే ఎన్నికల్లో 80 లక్షల ఓట్లు వస్తే కాంగ్రెస్‌ గెలుపు సునాయాసమవుతుంది' అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సభ్యత్వం చేసిన వారికి 2 లక్షల ఇన్సూరెన్స్‌ కల్పిస్తున్నాం. ఈ ఇన్సూరెన్స్‌ పర్యవేక్షణ కోసం పార్టీలో ఒక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. పవన్‌ మల్లాదిని ఇన్సూరెన్స్‌ సెల్‌ కో ఆర్డినేషన్‌ బాధ్యతలు అప్పజెప్పుతున్నాం. కేసీఆర్‌కు పీకే ఉంటే కాంగ్రెస్‌లో 40 లక్షల మంది ఏకే 47 లాంటి వారు ఉన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇదే తార్కాణం.

ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన ఉన్నారు. పార్టీ నాయకులు అందిపుచ్చుకునేందుకు సిద్దంగా ఉండాలి. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ సభ్యత్వాలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించేలా సభ్యత్వ నమోదును ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు వచ్చాయి. సభ్యత్వంలో బలంగా పని చేసిన వారికే టికెట్ అవకాశాలు ఉంటాయి. ఎలాంటి పైరవీ లేకుండా వాళ్లకు టికెట్ ఇచ్చే హామీ నాది. పని చేయని వారికి టికెట్‌తో పాటు ఎలాంటి పదవి రాకుండా నేను అడ్డుకుంటా. దీనిపై సోనియా,రాహుల్ గాంధీలతో నేను మాట్లాడుతా.ప్రతి బూత్ నుంచి వంద సభ్యత్వం ఉంటేనే ఆ నియోజవర్గంలో పీసీసీ మెంబర్ ఉంటుంది. వంద సభ్యత్వం లేకుండా ఎంత పెద్ద నాయకుడు ఉన్నా పీసీసీ సభ్యత్వం ఇవ్వం. టికెట్ల ఎంపికలో ఢిల్లీ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. కాబట్టి టికెట్ ఆశించిన వారు జాగ్రత్తగా పనిచేయాలి. సభ్యత్వం మంచిగా పని చేసిన వారిపై సమగ్ర నివేదిక సోనియా గాంధీకి అందజేస్తాను. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీ సభ్యత్వం ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత. పార్టీ సమావేశానికి రాని వారిని, లైట్ తీసుకున్న వారిని పదవుల ఎంపికలో అవకాశాలు కల్పించము' అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తేల్చిచెప్పారు.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment