Sunday, October 30, 2022

ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు.... సీఎం కేసీఆర్.....!

*ఢిల్లీ బ్రోకర్లు  తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు.... సీఎం కేసీఆర్.....!*

చండూరు: కొందరు దిల్లీ బ్రోకర్‌లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే.. మన ఎమ్మెల్యేలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు.మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలోలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''మునుగోడులో అవసరం లేని ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక ఫలితాన్ని మునుగోడు ప్రజలు ఎప్పుడో తేల్చేశారు. ఎన్నికలు రాగానే లొల్లి మొదలవుతుంది. గాయిగాయి గత్తర్‌ గత్తర్‌ చేస్తారు.. విచిత్ర వేషధారులందరూ ఎన్నికలప్పుడు వస్తారు. ఎవరు ఏమి చెప్పినా నిజానిజాలపై ప్రజలు విస్తృతంగా చర్చించాలి. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇల్లు కాలిపోతుంది. ఆలోచించి ఓటు వేస్తే మన ఊరు, మునుగోడు, మన జిల్లా, మన దేశం బాగుపడుతుంది. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు బాగా ఆలోచించుకోవాలి. గాయిగాయి గత్తర్‌ గత్తర్‌ కావొద్దు. కరిచే పాములను మెడలో వేసుకునేందుకు సిద్ధపడతారా?  *చేనేత కార్మికులు తగిన బుద్ధి చెప్పాలి...*
కొందరు దిల్లీ బ్రోకర్‌లు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు. ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు మేం తెలంగాణ బిడ్డలమని నలుగురు ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ బావుటా ఎగురవేశారు. రోహిత్‌రెడ్డి, బాలరాజు, హర్షవర్థన్‌రెడ్డి, రేగా కాంతారావు లాంటి ఎమ్మెల్యేలే దేశానికి కావాల్సింది. రూ.100 కోట్లు ఇస్తామని ఆశ చూపితే.. గడ్డిపోచలా విసిరేశారు. దిల్లీ నుంచి వచ్చి దుర్మార్గమైన పని చేసిన వారు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోయాలని భాజపా చూస్తోంది. దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చినా... రాష్ట్రాల్లో కుట్రలు ఎందుకు? ప్రజలు మోదీని రెండుసార్లు ప్రధానిని చేసినా ప్రభుత్వాలను ఎందుకు కూల్చాలి? ఎమ్మెల్యేలను కొనేందుకు భాజపాకు రూ. వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? దేశంలో ఏ ప్రధాని చేయని దారుణాలు మోదీ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోదీ. కేంద్రానికి బుద్ధిరావాలంటే చేనేత కుటుంబాలు భాజపాకు ఒక్క ఓటు కూడా వేయొద్దు. చేనేత కార్మికులు తగిన బుద్ధి చెప్పాలి.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment