Wednesday, October 19, 2022

ఆమె కోసం.... ఎలక్ట్రిక్ మొబైల్ టాయిలెట్లు

ఆమె కోసం.... ఎలక్ట్రిక్ మొబైల్ టాయిలెట్లు*

హైదరాబాద్‌: గ్రేటర్‌ నగరంలో మహిళల సదుపాయార్థం ఇప్పటికే షీ టాయ్‌లెట్లు, మొబైల్‌ టాయ్‌లెట్లు వంటివి అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం తాజాగా ఎలక్ట్రిక్‌ వాహనాల మొబైల్‌ టాయ్‌లెట్లను అందుబాటులోకి తెచ్చిందికేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ మెట్రో నగరాల్లో సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌ కింద మహిళల రక్షణ, భద్రతలకు సంబంధించిన సదుపాయాలు, ఏర్పాట్ల కోసం 'నిర్భయ' ఫండ్స్‌ నుంచి నిధులు అందజేస్తోంది.

అలా అందిన నిధులతో మహిళల మొబైల్‌ టాయ్‌లెట్ల కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు సమకూర్చుకున్న పోలీసు శాఖ.. వాటి నిర్వహణను జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. గ్రేటర్‌ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ఆరు జీహెచ్‌ఎంసీ జోన్లలో వీటిని ఉంచారు. సికింద్రాబాద్‌ జోన్‌లో 3 వాహనాలు, ఎబీనగర్‌లో జోన్‌లో 3, ఖైరతాబాద్‌జోన్‌లో 2, చారి్మనార్‌ జోన్‌లో 2, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో ఒక్కొక్కటి చొప్పున ఈ ఎలక్ట్రిక్‌ మొబైల్‌ బస్సులను ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్, ధర్నాచౌక్, చార్మినార్, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, ప్రగతిభవన్, అసెంబ్లీ, గచ్చిబౌలి జంక్షన్, రాజేంద్రనగర్, బాలానగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో మహిళల రద్దీని బట్టి అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని వాహనాల్లో చంటిపిల్లలకు పాలిచ్చేందుకు గదితోపాటు శానిటరీ నాప్‌కిన్స్‌ వంటివి ఉంటాయని పేర్కొన్నారు.

*షీ గెస్ట్‌హౌస్‌....!*
సేఫ్‌సిటీ ద్వారా అందే నిధులతో నగరంలో మహిళా యాత్రికుల సౌకర్యార్థం గెస్ట్‌హౌస్‌ను కూడా నిర్మించనున్నారు. నాంపల్లి సరాయి వద్ద 1900 చదరపుగజాల విస్తీర్ణంలో పార్కింగ్‌ సదుపాయంతోపాటు అయిదంతస్తులతో నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఇదివరకే ఆమోదం తెలిపింది. మొత్తం 187 బెడ్స్‌ కలిగి ఉండే గెస్ట్‌హౌస్‌లో సింగిల్‌ బెడ్స్, షేరింగ్‌ బెడ్స్‌ ఉంటాయి. గెస్ట్‌హౌస్‌లో ఏసీతోపాటు వైఫై, లాకర్లు, లిఫ్టులు, ఇంటర్నెట్‌ కియోస్క్‌లు, ఎమర్జెన్సీ క్లినిక్‌ తదితర సదుపాయాలుంటాయి. అంచనా వ్యయం రూ.11 కోట్లు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment