Saturday, July 4, 2026

_ఉస్మానియా డాక్టర్లు తెలంగాణతో పాటు, యావత్ దేశానికే గర్వకారణమైన ఘనతను సాధించారు - ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ_

*“అవయవదానం… మహాదానం”*

*మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని ట్రాన్స్‌ప్లాంట్ బృందం*

*ఉస్మానియా డాక్టర్లు తెలంగాణతో పాటు, యావత్ దేశానికే గర్వకారణమైన ఘనతను సాధించారు - ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 03:

భారత్‌లోనే తొలిసారిగా ప్రభుత్వ హాస్పిటల్‌లో ఒకే రోగికి, ఒకేసారి ఐదు అవయవాల (మల్టీ-విసెరల్) మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి దేశ వైద్య చరిత్రలో అరుదైన ఘనత సాధించిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌ప్లాంట్ బృందానికి శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉస్మానియా డాక్టర్లు తెలంగాణతో పాటు, యావత్ దేశానికే గర్వకారణమైన ఘనతను సాధించారని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో ఒకటిగా భావించే మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా నిర్వహించడం అసాధారణ విజయమన్నారు.
డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని ట్రాన్స్‌ప్లాంట్ బృందం 36 గంటల పాటు శ్రమించి ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం అసాధారణ విజయమని కొనియాడారు. ఈ చారిత్రాత్మక విజయానికి కృషి చేసిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, క్రిటికల్ కేర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లు, ఇతర సిబ్బంది అందరికీ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.అలాగే, అవయవదానం ద్వారా మరో ప్రాణానికి జీవం పోసిన అవయవదాత కుటుంబ సభ్యుల సేవాభావాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందిస్తూ, “అవయవదానం… మహాదానం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ సమాజంలో విస్తృతంగా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌ను కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా, పోటీగా వైద్య సేవలు అందించే విధంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఆరోగ్యశాఖలో సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేశామని, తాజాగా మరో 6238 పోస్టులను మంజూరు చేశామని మంత్రి గుర్తు చేశారు.పాత భవనాలు, అద్దె భవానల్లో కొనసాగుతున్న హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలకు కొత్త భవానలు నిర్మిస్తున్నామని తెలిపారు. రోగ నిర్దారణ కోసం అత్యాధునిక ఎక్విప్‌మెంట్, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే ప్రజలకు అన్నిరకాల మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా  డాక్టర్లు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకొస్తున్నారని మంత్రి ప్రశంసించారు.

No comments:

Post a Comment