Tuesday, November 29, 2022

లక్ష మెదళ్ళను కదిలించిన లేఖ!!

కామ్రేడ్ అమ్మ వస్తోంది..!*
*_కన్నీళ్లు తుడవరా.!_*
_◆ ఎదురుచూపులే జీవితం_
◆_ కాళ్ళు మొక్కిన కలెక్టరమ్మ_
_◆ పోరుబాటలో కొడుకులు_
_◆ పూరి గుడెసెలో జీవనం_
_◆ అన్నీ 'చావు' దెబ్బలే.!_
_◆ లక్ష మెదళ్ళను కదిలించిన లేఖ_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

*_తెలంగాణలో తల్లుల దర్పణ ముఖచిత్రం అదృశ్యమైయింది. ఓ తెలంగాణ తల్లి కానరాని లోకాలకు తరలిపోయింది. భర్త పోరాటానికి సన్మానం. కొడుకుల పోరాటానికి 'ఎన్ కౌంటర్స్' బహుమానం. ఎవరీ పెద్దపల్లి పెద్దవ్వ.. మల్లోజుల మధురవ్వ.. వాళ్లింటి పేరు పోరాటం..!_*

*_ఎవరీమె.._*
మధురమ్మ చనిపోయిందట.. ఎవరామె..? ఎందుకింతగా చెప్పుకుంటున్నారు..? పెద్దపల్లి పెద్దవ్వగా ఆ ప్రాంతం వాళ్లందరికీ పరిచయమే.! అసలు ఆమె కథే ఓ సంక్లిష్ట ముఖచిత్రం. నక్సలైట్ల ఉద్యమంలో 'తెగిన పేగులు బోలెడు.. పుస్తె పోగులు బోలెడు..' కన్నీళ్లు, అడవుల బాట పట్టిన కొడుకో, పెనిమిటో ఒక్కసారి 'వచ్చిపోతే' బాగుండననే ఎదురుచూపులు..! ఇవన్నీ ఎంత చెప్పుకున్నా ఒడవవు, తెగవు.! ఎందుకంటే తెలంగాణలో ప్రతి అమ్మది కనిపించని పోరాటమే.! కానీ మధురమ్మది కాస్త భిన్నమైన విచిత్ర అనుభవం.!

*_ఎదురుచూపులే జీవితం_*
నూరేళ్ల జీవితమంతా ఆమెకు కూడా ఎదురుచూపులే..! ఎప్పుడో పేగు కదిలినట్టు అనిపిస్తే 'ఏడుపులు..' ఇక 'ఎవరూ రారు' అని మళ్లీ మనసు నిమ్మలం చేసుకుని ముసుగు తన్ని పడుకోవడం.! ఈమె ఎవరంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతిల తల్లి. ఆమె మంగళవారం కన్నుమూసింది. ఇదీ వార్త. ఆమె గురించి తెలిసినవాళ్లకు ఓ విషాదం.!

*_భర్త వెంకటయ్య పోరాటం_*
అప్పట్లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం. భర్త వెంకటయ్య రజాకార్లతో పోరాడుతున్న సందర్భంలో భర్త కోసం రజాకార్లు వచ్చి వేధించేవాళ్లు. ఓరకమైన నిర్బంధం, ఆమె మీద నిఘా.! రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన రెండురకాల పోరాటాల్లో ఆమె వేదన ఉంది. ఆవేదన ఉంది. భిన్నమైన అనుభవముంది. ఆమె పడిన కష్టముంది… అవమానాలున్నయ్.!

*_కాళ్ళు మొక్కిన కలెక్టరమ్మ_*
ఆనాడు అవస్థలపాలైనా స్వాతంత్య్ర సమరయోధుడి భార్యగా ప్రభుత్వం నుంచి సన్మానం అందుకుంది.! ప్రతి గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాన గౌరవాన్ని పొందుతూనే ఉంది. ఆమధ్య నాలుగేళ్ల క్రితం కావచ్చు పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన మధురమ్మకు 'పాదాభివందనం' కూడా చేసింది. ఇంతా చేస్తే ఆమె భర్త రాజ్యానికి, అనగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినవాడే.

*_పోరుబాటలో కొడుకులు_*
కట్ చేస్తే... తొలి ముగ్గురు తనకు దక్కకుండా కన్నుమూశారు. ఆ తరువాత పుట్టిన కొడుకులు అడవి బాట పట్టారు. నక్సలైట్లయ్యారు.! ఉద్యమానికి నేతలయ్యారు.! కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగారు. వాళ్లు కూడా రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవాళ్లే.! తండ్రి నెత్తురే.! వాళ్ల ఆచూకీ కోసం మధురమ్మను పోలీసులు అనేకసార్లు వేధించారు.! సేమ్, అప్పట్లో రజాకార్లు వేధించినట్టుగానే.! ఆమె జీవితంలో వ్యక్తులు మారారు..కాని సమస్యలు మాత్రం మారలేదనేది నడుస్తున్న చరిత్రకు నిదర్శనం.

*_పూరి గుడిసెలో.._*
ఆ ఇద్దరి ఆచూకీ కోసం తల్లి, తండ్రి, సోదరుడైనా ఆంజనేయ శర్మకు వేధింపులు తప్పలేదు. వాళ్ల సోదరుడు అక్కడే పౌరోహిత్యం చేసుకుంటాడు. 1987లో డీఎస్పీ బుచ్చిరెడ్డి హత్య జరిగింది. ప్రతీకారంగా పోలీసులు వందల ఇళ్లను కూల్చేశారు. అందులో మధురమ్మ ఇల్లు కూడా కూలిపోయింది. దాంతో నాలుగైదేళ్లు ఓ పూరి గుడిసే దిక్కయింది ఆమెకు.!

*_అన్నీ 'చావు' దెబ్బలే.!_*
అగ్రస్థానాల్లో ఉన్న నక్సలైట్లు ఎవరినైనా చూడటానికి రావాలంటే ఎంత కష్టమో ఆమెకు తెలుసు. ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటే చాలు అనుకుంది. కానీ పెద్ద కొడుకు కోటేశ్వరరావు 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆమె కుంగిపోయింది. చిన్న కొడుకైనా బాగుంటే చాలు అనుకుంది. సహజం కదా..! అదే తెలంగాణ తల్లుల అనుభవం కదా.!

*_లక్ష మెదళ్ళను కదిలించిన లేఖ_*
ఆ సోదరులు ఓసారి అమ్మకు బహిరంగ లేఖ రాశారు. *_''అమ్మా, మమ్ముల కన్నందుకు నీకు విప్లవ వందనాలు.. కోట్లాది మంది తల్లుల కన్నీళ్లు తుడవడానికి మేం ఈ విప్లవబాట ఎంచుకున్నాం, తిరుగుబాటు నాన్న రక్తం నుంచే వచ్చింది..''_ ఇలా సాగిపోయింది ఆ లేఖ..! అప్పట్లో ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ లేఖ లక్షలమందిని చదివించింది.! కదిలించింది. దాదాపు నూరేళ్లు బతికిన ఆమె ఇక జీవనాన్ని చాలించింది. మంగళవారం కన్నుమూసింది.

*_చివరిగా..._*
కిషన్‌జీ, స్వర్గానికి అమ్మ వస్తోంది, ఇప్పుడైనా కళ్లారా చూసి, ఆమె కన్నీటిని తుడువు కామ్రేడ్..!

No comments:

Post a Comment