Tuesday, November 8, 2022

రైతన్న తరఫున పోరాడేది ఎవరు.?

*_బ్యాంకర్లూ..._*
*_ఎర్ర జెండాలు  ఎందుకు...?_*

_◆ గులాబీ జెండాలే పాతేస్తే సరి..!_
_◆ రైతన్న తరఫున పోరాడేది ఎవరు.?_
_◆ వర్ణస్వభావం మారలేదా ఇంకా..?!_
_◆ బ్యాంక్ అధికారుల ప్రవర్తన ముమ్మాటికీ తప్పే.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం, 944 000 0009)_*

*_'వెలుగు' దినపత్రిక, మొదటి పేజీలో.. పెద్ద ఫోటో.. దానికి రైటప్.. ముందు నమ్మాలనిపించ లేదు.! నమ్మక తప్పని పరిస్థితి. ఎలాంటి 'డౌటునుమానం' లేదు. పట్టుకుంది.. పాతింది ఎర్ర జెండాలే.! అందులోనూ ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు రైతు కంట కన్నీరు వస్తుందనిస్తే.. ఎర్ర జెండాల కళ్ళల్లో 'రక్త కన్నీరు' వరదలా వచ్చేది. మరి ఇప్పుడు అదే రైతుకు కష్టం వస్తే పరిస్థితి ఇలా ఉంది._*

*_అసలేం జరిగిందంటే..?_*
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎద్దు రాజ్ కుమార్ తన 2.39 ఎకరాల భూమిని కుదువ పెట్టి మూడేండ్ల కింద డీసీసీ బ్యాంక్ నుంచి రూ.5 లక్షల లోన్ తీసుకున్నారు. లోన్ కట్టాలని బ్యాంక్ ఆఫీసర్లు పలుసార్లు లీగల్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో సోమవారం బ్యాంక్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతారు. డిసెంబర్ 6వ తేదీ వరకు గడువు ఇస్తున్నామని, లోన్ కట్టకపోతే భూమిని వేలం వేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. ఈ విషయంపై రైతు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మూడేండ్ల నుంచి పంట చేతికి రాక ఆర్థిక ఇబ్బందులతో లోన్ కట్టలేదని, త్వరలోనే చెల్లిస్తానని చెప్పారు.

*_నమ్మాలని అనిపించలేదు..!_*
అసలే మనది రైతు అబ్బుర ప్రభుత్వం. అసలు రైతుకు సమస్య అంటేనే మన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తల్లడిల్లిపోతారు. అలాంటిది ఈ ఫోటో వార్త ఏదో 'తేడా' అనిపించింది. నమ్మాలనిపించ లేదు. మళ్ళీ నమ్మాలి తప్పదు మరి.

*_ఓట్ల లెక్కలేనా..?_*
మన సర్కారుకు అసలు వ్యవసాయం చేయని, పడావు భూములు, రాళ్లుగుట్టల భూముల పెద్ద పెద్ద దొరలు కూడా రైతులే..! పాపం, ప్రాణాల్నే పణంగా పెట్టి వ్యవసాయం చేసి, ఆరిపోతున్న కౌలురైతులు అసలు రైతులే కాదు.! వీలైతే కౌలు రైతులకు 'జరిమానాలు వేసినా తప్పులేదు' అనుకునే అత్యంత ఉదారవైఖరి. అన్నీ డొల్ల పథకాలే కదా..! అన్నీ ఓట్ల లెక్కలే కదా..!

*_ఇలా అనుకుంటున్నారా..?_*
మనుగోడు తనకు జై అంది.. అంటే 'నువ్వు తెలంగాణను మస్తు ఉద్దరించేశావు, ఇక నీ దేశమాత రుణం తీర్చుకో కేసీయార్' అని యావత్ ప్రజానీకం బీఆర్ఎస్‌కు అంగీకారం తెలిపినట్టేనట..! ఆ హస్తినలోని దుష్ట కౌరవుల రాజ్యాన్ని 'ఖతం చేయిపో' అని ఆదేశించినట్టేనట..! బహుశా సర్కారు రైతు సంక్షేమ పథకాలే ఈ ప్రశంసకు, అభినందనకు కారణాలై ఉంటాయి. అసలు టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రైతు సమితి.. ఇకపై భారతీయ రైతు సమితి అనాలనిపించేంత రైతు ప్రేమ... తిక్క లేస్తే రైతుల రుణమాఫీ కూడా చేసేస్తాడు... దేశమంతా 'ఫ్రీ కరెంటు' అన్నవాడికి ఇదెంత పని..?

*_ఇది దేనికి సంకేతం..:_*
నిజానికి పొలంలో ఎర్ర జెండాలు పాతడం దేనికి సంకేతం..? అప్పట్లో నక్సలైట్ల జోరు ఉన్న కాలంలో దొరలు, భూస్వాముల పొలాల్లో ఎర్ర జెండాలు పాతేసి, ఆక్రమించేసి, ఎవరో పేద రైతుకు ఇచ్చేసేవాళ్లు..! ఇప్పుడు అప్పుల పాలై, అవి తీర్చలేక లబోదిబోమంటున్న చిన్న రైతుల పొలాలే ఎర్ర జెండాలకు టార్గెట్.. బహుశా మొన్నమొన్నటివరకూ ఏ బ్యాంకర్‌కూ 'దమ్ము' లేకపోయేది ఇలా చేయడానికి..!

*_ఇదేం ఖర్మ..!_*
కానీ ఇప్పుడు కేసీయార్ ఎడమ చంకలో సీపీఎం, కుడి చంకలో సీపీఐ ఉన్నాయి కదా..! నక్సలైట్లు లేరు కదా..! ఇంకేం..! ఎర్ర జెండాలకు ఎదురేముంది..? వాటిని ఎక్కడైనా పాతుతారు అధికారులు కూడా... పాలకుడి స్నేహితులు ఎవరో వాళ్లకు తెలియదా ఏం..? అవునూ, అప్పులు తీర్చని పేద రైతు పొలంలో ఎర్ర జెండాలు పాతడం అంటే ఏమిటి అర్థం... ఈ పొలాన్ని 'స్వాధీనం చేసుకుంటున్నాం' అనే బహిరంగ ప్రకటనా..? ఆ పంట కోసేసి అమ్మేసి, ఖాతాలో జమ చేసుకుంటారా..? ఎర్ర జెండాలు తీసేస్తే 'మెడలు విరిగిపోతాయ్' అనే నక్సలైట్ల మార్క్ హెచ్చరికల్ని కూడా రాబోయే రోజుల్లో వినాల్సి వస్తుందా..?

*_గర్వంగా...:_*
ఫోటోలో బ్యాంకర్లను చూడండి.. విజేతలుగా తలెత్తుకుని గర్వంగా కనిపిస్తున్నారు... అందులో ఆడ లేడీస్ కూడా ఉన్నారు. అమ్మా, తల్లీ, నీ నెలజీతం ఎంతమ్మా..? ఈ పని కోసమేనా నిన్ను బ్యాంకు వాడు కొలువులోకి తీసుకుంది…?

*_మీడియాకు ఏమైందిరా భయ్యా..!:_*
అసలే కొత్త దోస్తానా.. కేసీయార్‌ను ఏమైనా అంటే, సారుకు గుస్సా వస్తే, 'ఎహె ఫోరా.. సూదులూ దబ్బనాలూ' అని తరిమేసే ప్రమాదం ఉంది. అధికార పార్టీ వాళ్లయితే బ్యాంకు అధికార్లకు మద్దతుగా నిలబడతారేమో..! వాళ్లకు జనం అక్కర్లేదు కదా..! అవసరమొచ్చినప్పుడు ఓటుకు 5 వేలు ఇస్తే సరి.. మీడియా సంగతా..? అసలు ఆ రైతు చేసిన కుట్ర ఏమిటో రెండు పేజీలు నింపేది నమస్తే తెలంగాణ.. నమస్తే సాక్షి, వెన్నువంగిన ఈనాడు గురించి వదిలేస్తే... మరి ఆంధ్రజ్యోతికి ఏమైంది..?

*_వేల కోట్లు 'వెధవ'లను వదిలి..:_*
కానీ ఏమాటకామాట... బ్యాంకర్లు చేసింది తప్పు... తప్పున్నర.. ఎర్ర జెండాలకు బదులు గులాబీ జెండాలే పాతాల్సింది... గతంలో ఎరుపు అంటే డేంజర్.. రంగుల స్వభావాల్ని మార్చితే తప్పేముంది...? కాలం మారుతోంది.. బ్యాంకర్లు మాత్రం మారరు.. ఛిఛీ... సరే, అదుగో చూడండి.. వేల కోట్లు ఎగవేసే అక్రమ వ్యాపారులకు కాస్త తోడుగా ఉండండి.. దేశం విడిచిపోతారేమో, ఓకే... రుణాల రద్దు అంటారేమో, ఓకే...!

*_చివరిగా..:_*
అన్నింటికన్నా ముందు ఈ బక్క రైతుల్ని లోపలేసి తోమేందుకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకురండి.. మోడీ కాదనడు, వద్దనడు... కలర్ వేరు గానీ, తనూ ఈ తానులో ముక్కే కదా..!!

No comments:

Post a Comment