Monday, November 7, 2022

కూతురి మృతదేహంతో బైక్ పై 60 కిలోమీటర్లు....!

కూతురి మృతదేహంతో బైక్ పై 60 కిలోమీటర్లు....!*

*ఆ బిడ్డ ఇక లేదని వైద్యులు చెప్పినప్పుడు ఆ* *నిరుపేద దంపతుల్లో గుండెలు మెలిపెట్టేసేంత బాధ...*
*నిరుపేద ఆదివాసీ దంపతుల దీనగాథ..*

*జ్వరం, ఫిట్స్‌తో ఖమ్మం ఆస్పత్రిలో పాప మృతి*

*అడిగినా అంబులెన్స్‌ సమకూర్చని ఆస్పత్రి సిబ్బంది*

*చేతిలో మిగిలిన రూ.50తో కొంత దూరం బస్సులో*

*తెలిసిన వ్యక్తి బైక్‌ ఇవ్వడంతో సొంతూరుకు..*
*ఖమ్మం, ఏన్కూరు*
ఆ బిడ్డ ఇక లేదని వైద్యులు చెప్పినప్పుడు ఆ నిరుపేద దంపతుల్లో గుండెలు మెలిపెట్టేసేంత బాధ! దాన్నంతా దిగమింగుకొని.. చేతిలో 50 రూపాయలు మాత్రమే మిగిలిన స్థితిలో మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకొని ఆస్పత్రికి నుంచి బయటకొచ్చి 90 కి.మీ దూరంలో ఉన్న ఇంటికి తరలించేందుకు ఆ బడుగు జీవులు పడ్డ కష్టం తెలిస్తే మనసున్న వారెవరికైనా కళ్లు చెమర్చక మానవు! అంబులెన్స్‌లేదని ప్రభుత్వాస్పత్రి సిబ్బంది చెప్పడం.. ప్రైవేటు వాహనానికి రూ3వేలు ఇచ్చుకునే స్థోమత లేకపోవడం.. విషయాన్ని బంధువులకు చేరవేద్దామన్నా ఫోను లేకపోవడంతో దిక్కుతోచనిస్థితిలో బైక్‌పై మృతదేహాన్ని తరలించాలనుకున్నారు. పాప బాబాయి బైక్‌ తోలుతుంటే తల్లిదండ్రులు వెనుక కూర్చుని మధ్యలో మృతదేహాన్ని పెట్టుకున్నారు. అలా 60 కిలోమీటర్లు ప్రయాణించి ఊరు చేరుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వెట్టి మల్లయ్‌-ఆది గిరిజన దంపతులు. ఇరవై ఏళ్ల క్రితం ఛత్తీ్‌సగఢ్‌ నుంచి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లికి వచ్చి కాయకష్టం చేసుకొని బతుకుతున్నారు. వీరికి ముగ్గురు సంతానం. మూడేళ్ల కూతురు సుక్కికి జ్వరం ఆపై ఫిట్స్‌ రావడంతో శనివారం సాయంత్రం ఏన్కూరు సర్కారు దవాఖానాకు తెచ్చారు. పరిస్థితి విషమంగా ఉందని.. ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో దగ్గరున్న రూ.200తో బస్సెక్కారు.

రాత్రి ఏడింటికి ఖమ్మం ఆస్పత్రికి చేరుకున్నారు. పాపను పరిశీలించి అక్కడి వైద్యులూ పెదవి విరిచారు. చిన్నారిని వరంగల్‌ లేదంటే హైదరాబాద్‌కు తరలించాల్సి ఉంటుందని చెబుతూనే వైద్యం ప్రారంభించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే సుక్కి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. కన్నీరుమున్నీరైన ఆ తల్లిదండ్రులు, తమ కూతురి మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు ఆస్పత్రి సిబ్బందిని సంప్రదించగా వారు అంబులెన్స్‌ అందుబాటులో లేదని చెప్పారు. ప్రైవేటు అంబులెన్సు వారిని సంప్రదిస్తే రూ3వేలు అడిగారు. అంత డబ్బు లేకపోవడంతో మల్లాయ్‌ పాప మృతదేహాన్ని భార్య చేతుల్లోంచి తీసుకొని బస్సెక్కి గార్ల ఒడ్డు వరకు చేరుకున్నాడు.

అక్కడ జయరాం అనే బాలవెలుగు ఉపాధ్యాయుడి ద్వారా తమ గ్రామపెద్ద అయిన గంరగాజుకు ఫోన్‌ చేయించి విషయం తెలిపాడు. గంగరాజు వెంటనే మల్లయ్‌ సోదరుడికి ఓ బైక్‌ ఇచ్చి పంపగా అతడు ఖమ్మానికి వెళ్లి వదిన ఆదిని వెంటబెట్టుకొచ్చాడు. గార్ల నుంచి బైక్‌పై ముగ్గురూ మృతదేహాన్ని వెంటబెట్టుకొని 60 కిలోమీటర్లు ప్రయాణించి కొత్తమేడేపల్లి చేరుకున్నారు. గ్రామస్థులే ఇంటికింటికి రూ.100 చొప్పున చందాలు వేసుకొని జరిపించారు. కాగా మృతదేహాలను తరలించేందుకు 'పార్థివ వాహనాల' సౌకర్యం ఉన్నా గిరిజన కుటుంబానికి ఉపయోగపడకపోవడంపై ఖమ్మంజిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావును వివరణ కోరగా ఆయన మరోరకంగా స్పందించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేప్పుడు తమకు చెప్పలేదని, సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే పార్థివ వాహనం ఏర్పాటు చేసేవాళ్లమని పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment