Saturday, November 12, 2022

చదువులో టాపర్లు....మత్తుకు బానిసలు....!

*చదువులో టాపర్లు....మత్తుకు బానిసలు....!*

*పోలీసుల కౌన్సిలింగ్‌లో కన్నపేగు ఆవేదన*

హైదరాబాద్‌: ''మా అబ్బాయి.. చదువులో టాపర్‌.చాలా బుద్ధిగా ఉంటాడు. కొద్దిరోజుల్లో ఎంబీబీఎస్‌ కోర్సులో చేరాలి. ఇప్పుడు మా వాడు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతుంటే నమ్మలేకపోతున్నాం. పోలీసు కేసుల్లేకుండా నా బిడ్డతో అలవాటు మాన్పించండి' ఓ కన్నతల్లి ఇటీవల హైదరాబాద్‌ నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పోలీసులకు చేసిన వేడుకోలు ఇది. ఇంటా.. బయటా బుద్ధిగా ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా మత్తు ఉచ్చులో చిక్కుకున్న బిడ్డల భవిష్యత్తుపై కన్నపేగు కలవరపడుతోంది. ప్రస్తుతం కౌన్సిలింగ్‌ పొందుతున్న బాధితుల్లో సుమారు 20-30 మంది విద్యార్థులున్నారు. వీరంతా క్యాంపస్‌ ఉద్యోగాలు పొందినవారు, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైనవారే కావడం గమనార్హం.

*1200 మందికి నోటీసులు....!*
10 నెలల వ్యవధిలో నగర పోలీసులు మాదకద్రవ్యాల సరఫరాపై సుమారు 40-50కు పైగా కేసులు నమోదు చేశారు. నగరానికి డ్రగ్స్‌ చేరవేస్తున్న 10 మంది కీలక సూత్రధారులను అరెస్ట్‌ చేశారు. వీరి జాబితాలో ఏపీ, తెలంగాణలో 2000 మంది వరకూ మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. 1200 మందికి నోటీసులు జారీచేశారు. వీరిలో మొదటి దఫా 287, రెండో సారి 172 మంది మత్తు బాధితులను సైకాలజిస్టుల వద్దకు కౌన్సిలింగ్‌కు పంపారు. తాజాగా 58 మంది డ్రగ్స్‌ వాడకం దారుల నుంచి నమూనాలు(శాంపిల్స్‌) సేకరించి వైద్యపరీక్షలకు పంపారు.

*అమ్మో... ఆడపిల్లలు..*
గంజాయి గుప్పిట చిక్కుతున్న జాబితాలో 50 శాతం మంది ఆడపిల్లలున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సున్నితమైన అంశం కావడంతో తల్లిదండ్రులతో మాట్లాడి వారికి మనస్తత్వ నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నట్లు వివరించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment