Wednesday, June 22, 2022

ఆశామాషి కాలుష్య ధ్రువపత్రాలు..... చెల్లవ్....!ట్రాఫిక్‌ పోలీసుల కొత్త నిర్ణయం

ఆశామాషి కాలుష్య ధ్రువపత్రాలు..... చెల్లవ్....!*

*ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని షరతు*

*ట్రాఫిక్‌ పోలీసుల కొత్త నిర్ణయం*

*హైదరాబాద్‌...*

*కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం జారీ చేసే సంచార వాహనం*
రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం పరిమితులకు లోబడే ఉందంటూ రోడ్ల పక్కన ఉండే వ్యాన్లు ఇచ్చే ధ్రువపత్రాలు ఇకపై చెల్లవని చెబుతున్నారు. కాలుష్య ధ్రువపత్రం పొందిన వాహనం రిజిస్ట్రేషన్‌ నంబరు ఆన్‌లైన్‌ ద్వారా రవాణా శాఖ సర్వర్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌కు ఏకకాలంలో చేరితేనే ధ్రువపత్రానికి విలువ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వాహన కాలుష్య పరిమితి ధ్రువపత్రాలను ప్రస్తుతం రవాణాశాఖ అనుమతి పొందిన ఏజెన్సీలు, సంచార వాహనాలు ఇస్తున్నాయి. ఈ విధానంలో అక్రమాలకు తావులేకుండా అన్ని సంచారవాహనాలు ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించాలని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. దిల్లీ, బెంగుళూరులో ఏడేళ్లుగా ఈ విధానం అమలవుతోంది.

ఇదీ నిదర్శనం: ఓ పోలీస్‌ అధికారి గత నెల తన వాహనానికి కాలుష్య ధ్రువీకరణ పరీక్ష చేయించారు. జారీ చేసిన పత్రంపై గడువు నవంబరు 2022 వరకు ఉండాల్సి ఉండగా, నవంబరు 2023 వరకూ చెల్లుబాటయ్యేలా ఇచ్చారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

నామ్‌కే వాస్తే ధ్రువపత్రం: రవాణా శాఖ ద్వారా అనుమతి పొందిన ఏజెన్సీలు వాహనం కాలుష్యం పరిమితిలోపే ఉందంటూ పీయూసీ (పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌) పేరుతో వాహనాలకు ధ్రువపత్రాలు ఇస్తున్నాయి. ఆటోవాలాలు 70 శాతం మంది, ద్విచక్ర వాహనదారుల్లో 40 శాతం మంది వాహనాలను తనిఖీ చేయించుకోకుండానే ధ్రువపత్రాలను తీసుకుంటున్నారు. దీనివల్ల పదేళ్లకు పైబడిన వాహనాల నుంచి కూడళ్లలో వాహనాల నుంచి భారీగా పొగ వెలువడుతోంది.

ఆన్‌లైన్‌ వల్ల ఇదీ ప్రయోజనం

కాలుష్య ధ్రువపత్రం జారీచేసే ప్రతి సంచార వాహనంలో అంతర్జాల ఆధారిత కంప్యూటర్‌ ఉంటుంది. ధ్రువపత్రం పొందిన ప్రతి వాహనం వివరాలు, ఫలితం అందులో నమోదు కాగానే.. రవాణా శాఖ సర్వర్‌కు, అక్కడినుంచి ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంకు చేరుతుంది. దాన్నుంచి రోడ్లపై ట్రాఫిక్‌ విధుల్లో ఉండే పోలీసుల పీడీఏ(వ్యక్తిగత డిజిటల్‌ సహాయకారి) యంత్రాలకు వెళ్తుంది. తనిఖీలప్పుడు వాహన నంబరు నమోదుచేయగానే కాలుష్య పరిమితి ధ్రువపత్రం ఉందా? లేదా? తెలిసిపోతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానం లేకపోవడంతో కొందరు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా కాలుష్య ధ్రువీకరణ పత్రాలిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చేవారి అనుమతుల రద్దుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment