Wednesday, June 22, 2022

తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఇంట్లో.... ఎన్ఐఏ సోదాలు

*తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఇంట్లో.... ఎన్ఐఏ సోదాలు*

ఉప్పల్‌: తెలంగాణ హైకోర్టు న్యాయవాది శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఉప్పల్‌ చిలుకానగర్‌లోని ఆమె నివాసంలో ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం సోదాలు చేశారు.విశాఖలో మూడేళ్లుగా కనిపించకుండా పోయిన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని నక్సల్స్‌లో చేర్చారని శిల్పపై అభియోగాలు దాఖలయ్యాయి. విశాఖలో మిస్సింగ్‌ కేసుగా నమోదైన ఈ కేసు దర్యాప్తును తాజాగా ఎన్‌ఐఏకి అప్పగించారు. విశాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు శిల్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిల్పను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. రాధ మిస్సింగ్‌ కేసుకు సంబంధించి అధికారులు శిల్పను ప్రశ్నించనున్నారు.

మూడు సంవత్సరాల క్రితం తమ కూతురుని కిడ్నాప్ చేశారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పీఎస్‌లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని రాధ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని ఫిర్యాదులో తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర రాధను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మెదక్‌ జిల్లా చేగుంటలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడి ఇంట్లో తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment