Friday, May 14, 2021

అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారు?: హైకోర్టు

అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారు?: హైకోర్టు

అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారు?: హైకోర్టు

హైదరాబాద్ : 14/05/2021
ఈనాడు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)

రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణకు వచ్చే అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అంబులెన్స్‌లు నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని, అంబులెన్స్‌లను అడ్డుకునేందుకు మరో రూపంలో ప్రయత్నించవద్దని తెలిపింది. ఆస్పత్రుల్లో చేరేందుకు కంట్రోల్‌రూమ్‌ అనుమతి అక్కర్లేదని స్పష్టం చేసింది. ప్రజలు కోరుకుంటే కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయవచ్చని, ఫోన్ చేసిన వారికి కంట్రోల్‌రూమ్‌ సహకరించాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 17వ తేదీకి వాయిదా వేసింది. 

హైదరాబాద్‌కు వస్తున్న అంబులెన్స్‌లను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారంటూ విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి వెంకట క్రిష్ణారావు దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అంబులెన్స్‌లు ఆపడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్‌ కోరారు. రాష్ట్రంలోకి అంబులెన్స్‌లను అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. నాలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా బాధితులు వస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రోగుల తాకిడి ఎక్కువైందన్నారు. ఆస్పత్రి ముందస్తు అనుమతి ఉన్నవారికి చికిత్స నిరాకరించడం లేదని కోర్టుకు తెలిపారు.

‘‘పడకలు అందుబాటులో లేక బాధితులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రిలో పడకలు ఉంటేనే ఇతర రాష్ట్రాల రోగులు తెలంగాణకు రావాలని ఇంతకు ముందే చెప్పాం. దిల్లీ లాంటి రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించాయి.’’ అని ఏజీ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం అంబులెన్స్‌లను ఏ రాష్ట్రం ఆపలేదని తెలిపింది. కారణం ఏదైనా అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఇది రాజ్యాంగం, చట్టాలు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కాదా? అని మండిపడింది. రాజ్యాంగం అన్ని రాష్ట్రాల ప్రజలకు జీవించే హక్కు కల్పించిందని గుర్తు చేసింది. జాతీయ రహదారులపై రాకపోకలు నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఎక్కడిదని ప్రశ్నించింది. ఇలా చేస్తే జాతీయ రహదారుల చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది.

తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌ వస్తున్నవారు పడకలు ముందుగా రిజర్వ్‌ చేసుకుంటున్నారా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాజిటివ్‌ ఉన్నవారి వల్ల తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశంతోనే ఆంక్షలు విధించినట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ కోర్టుకు తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రజలను అడ్డుకోవడం రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘనే అవుతుందని ఏపీ ఏజీ శ్రీరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ అన్నారు.

No comments:

Post a Comment