కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30 వ తేదీ వరకు లాక్డౌన్ను పొడగించినందున మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. లాక్డౌన్ అమలుపై జోనల్ ఐజిలు, డిఐజిలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పిలతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్ డిజిపి జితేందర్, ఇంటలిజెంట్స్ విభాగం ఐజి ప్రభాకర్ రావులు పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు తీరును ప్రతిరోజు జిల్లాల వారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు అని తెలిపారు. మే 30 వ తేదీ తరవాత తిరిగి లాక్డౌన్ను పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల దగ్గర పెద్దఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తుందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుంచే తమ అవసరాలకై వెళ్లేవిధంగా ప్రజలను చైతన్యపర్చాలని డీజీపీ సూచించారు.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల దగ్గర పెద్దఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తుందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుంచే తమ అవసరాలకై వెళ్లేవిధంగా ప్రజలను చైతన్యపర్చాలని డీజీపీ సూచించారు.
కరోనా ఎఫెక్ట్: దేశంలో రెండింతలైన గ్రామీణ నిరుద్యోగం
నమస్తే తెలంగాణ మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ప్రతి రోజు వేల మందిని పొట్టన పెట్టుకుంటుండగా, చాలా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్నది. దీంతో దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉపాధి కోల్పోతున్నవారి సంఖ్య అధికమవుతున్నది. లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ సంఖ్యలో ప్రజలు నిరుద్యోగులుగా మారుతున్నారు. లాక్డౌన్కుతోడు వ్యవసాయ పనులు మందగించడంతో గ్రామాల్లో చేసేందుకు పనులులేక ఖాళీగా ఉంటున్నవారు క్రమంగా పెరిగిపోతున్నారు.
దీంతో గ్రామీణ భారతంలో మే 16తో ముగిసిన వారంలో నిరుద్యోగల సంఖ్య రెండితలయ్యిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే 9తో ముగిసిన వారంలో గ్రామీణ నిరుద్యోగుల సంఖ్య 7.29గా ఉండగా.. ఈ 16 నాటికి అది 14.34 శాతానికి పెరిగిందని సీఎంఐఈ పేర్కొంది. గ్రామీణ భారతంలో నిరుద్యోగిత ఇంత భారీగా పెరగడం గత 50 వారాల్లో ఇదే మొదటి సారని తెలిపింది. గతంలో 2020, జూన్ 7న నిరుద్యోగుల సంఖ్య అత్యధికానికి చేరింది.
కాగా, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయిన వారు కూడా పెరిగిపోయారని నివేదిక వెల్లడించింది. అర్బన్ ఏరియాలో గత వారం 14.7 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇది మే 9తో ముగిసిన వారంలో దీనికి 3 శాతం తక్కువగా ఉందని వెల్లడించింది. అదేవిధంగా గతవారంలో సరాసరి నిరుద్యోగిత 8.76 శాతం నుంచి 14.45 శాతానికి చేరిందని పేర్కొంది. లాక్డౌన్లతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడమే దీనికి కారణమని అభిప్రాయపడింది. దీంతో ఏప్రిల్లో శ్రామిక శక్తి 11 లక్షలు తగ్గిపోగా, మొత్తం ఉద్యోగ శ్రమశక్తి 70.35 లక్షలకు పడిపోయిందని తెలిపింది.
గాజా సిటీలో మరణ మృదంగం, 215 మంది మృతి, ఆ కుటుంబమంతా మృత్యుముఖంలోకి, 5 నెలల చిన్నారి క్షేమం
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుధ్ధ వాతావరణం ఏ మాత్రం సడలలేదు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 215 మంది మరణించారు. వీరిలో 100 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.
Tv9తెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుధ్ధ వాతావరణం ఏ మాత్రం సడలలేదు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 215 మంది మరణించారు. వీరిలో 100 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ దాడుల్లో ఓ కుటుంబంలోని కుటుంబ పెద్ద, 5 నెలల బాలుడు క్షేమంగా బతికి బయట పడ్డారు. ఈ ఘటనలో తన నలుగురు పిల్లలతో బాటు ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్త, ఈ చిన్నారి గాయపడకుండా తప్పించుకున్నారు. మరణించిన తల్లి చేతుల్లో ఉన్న చిన్నారిని శిథిలాల నుంచి బయటకు తీశారు. ఈ శిశువు కాళ్లపై చిన్న గాయాలున్నాయి.నా భార్యా పిల్లలు ప్రాణాలు కోల్పోయారని, ఈ బాలుడి కోసమైనా నేను బతకాలని 37 ఏళ్ళ ఆ తండ్రి విలపిస్తూ చెప్పాడు. ఈ మధ్య రంజాన్ పండుగను కొంత ఉత్సాహంగా జరుపుకున్న ఆ కుటుంబంలో ఇప్పుడు విషాదం తాండవిస్తోంది.గాజా సిటీ నుంచి హమాస్ ప్రయోగించిన రాకెట్ దాడుల్లో 10 మంది ఇజ్రాయెలీలు మృతి చెందారు. కాల్పుల విరమణను పాటించాలని అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ రెండు సార్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కోరినప్పటికీ ఆయన నుంచి స్పందన లేదు. దీనిపై నెతన్యాహు ఎలాంటి హామీని ఇవ్వలేదు సరికదా.. పాలస్తీనాపై తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్ఛరించారు.హమాస్ టెర్రరిస్టులు వెనక్కి తగ్గేంతవరకు తాము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు.
మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ కూడా ఇజ్రాయెల్ పై తమ ఉగ్రవాదులు రాకెట్లను ప్రయోగిస్తునే ఉంటారని, ఇజ్రాయెల్ కండకావరాన్ని తాము సహించబోమని హెచ్చరించారు. ఉభయపక్షాలూ శాంతి చర్చలకు రావాలని ఐక్యరాజ్య సమితి కోరినప్పటికీ ప్రయోజనం లేకపోతోంది.
గుడ్ న్యూస్- హైదరాబాద్ కేంద్రంగా అందుబాటులోకి మరో వ్యాక్సిన్
తొలివెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
కరోనాపై పోరులో మరో కీలక అడుగు పడనుంది. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ స్పీడప్ ఒక్కటే పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్న సమయంలో ఇండియాలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన వ్యాక్సిన్ ను హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి ప్రారంభించనున్నారు. బయోలాజికల్ ఈ కంపెనీ సంవత్సరానికి 60కోట్ల డోసులను ఉత్పత్తి చేయనుంది.
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వ్యాక్సిన్ కు ఇప్పటికే అమెరికా సహా పలు దేశాల్లో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కు అనుమతించాయి. త్వరలో ఇండియాలో కూడా అనుమతి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో… హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఎప్పటి నుండి ఉత్పత్తి ప్రారంభిస్తారు, ఎప్పటి నుండి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులో ఉంటుందనేది మాత్రం వెల్లడించలేదు.
ఇప్పటికే రష్యా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డా.రెడ్డీస్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు రష్యా నుండి దిగుమతి చేసుకొని వ్యాక్సినేషన్ ను కూడా స్పీడప్ చేసింది. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తో పాటు బయోలాజికల్ ఈ కంపెనీ స్వయంగా మరో కరోనా వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తుంది. త్వరలో ఆ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ఇక ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉండగా, ముక్కులో వేసే నాసల్ వ్యాక్సిన్ ను కూడా ఈ సంస్థ తయారు చేస్తుంది
కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఖారారు చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈమేరకు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవోకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.
కొవిడ్ కట్టడిలో తెలంగాణ మార్గదర్శి : డీహెచ్ శ్రీనివాసరావు
నమస్తే తెలంగాణ మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
కొవిడ్ నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. కొవిడ్ కట్టడికి తెలంగాణ మార్గదర్శిగా మారిందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. మీడియాతో డీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 వారాలుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు కూడా తగ్గిందన్నారు. ఇంటింటి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించి మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో కొవిడ్ నియంత్రణలోనే ఉందన్నారు.
99 శాతానికి పైగా రికవరీ రేటు..
రెండో దశలో రాష్ట్రంలో 2.37 లక్షల కరోనా కేసులు నమోదు కాగా వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 48,110గా ఉందన్నారు. కరోనా నుండి 1.92 లక్షల మంది బాధితులు కోలుకున్నట్లు చెప్పారు. మే 1 నాటికి కరోనా నుంచి 81 శాతం మంది కోలుకున్నారన్నారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 99 శాతంగా, మరణాల రేటు 0.56 శాతంగా ఉందన్నారు.
33 శాతం ఆక్సిజన్ పడకలు ఖాళీ..
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సరిపడా పడకలు ఉన్నట్లు తెలిపారు. 40 శాతానికి పైగా పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో నిండాయన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ పడకలు 33 శాతం ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 1,265 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందజేస్తున్నట్లు వివరించారు. కొవిడ్ చికిత్స కోసం 53,756 పడకలు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 493 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు. 18 రోజుల్లో పాజిటివిటీ రేటు 50 శాతం తగ్గిందన్నారు.
అన్ని రకాల మందులు అందుబాటులో..
ప్రణాళికాబద్ధంగా అవసరమైన వారందరికీ చికిత్స అందిస్తున్నట్లు డీహెచ్ తెలిపారు. సర్కారు దవాఖానాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. రెమ్డెసివిర్, బ్లాక్ ఫంగస్కు సంబంధించిన మందులు ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. బ్లాక్ ఫంగస్ కొత్త జబ్బు కాదని, ఎప్పటినుంచో ఉందని, బ్లాక్ ఫంగస్కి భయపడాల్సిందేమి లేదన్నారు. కరోనా కొన్ని వారాల్లో పూర్తిగా అదుపులోకి వస్తుందన్నారు. గ్రామాల్లో కొవిడ్ పూర్తిగా అదుపులోనే ఉందన్నారు.
కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సినేషన్..
వ్యాక్సినేషన్ఫై కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి 57.30 లక్షల వ్యాక్సిన్ డోసులు వచ్చాయన్నారు. కొవాగ్జిన్ సెకండ్ డోస్ తీసుకోవాల్సినవారు ఇంకా 3 లక్షల మంది ఉన్నారన్నారు. ప్రస్తుతం 50 వేల కోవాగ్జిన్ డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్లోబల్ టెండరింగ్ ద్వారా వ్యాక్సిన్ను సమకూర్చుకోనున్నట్లు చెప్పారు.
కరోనాకు పెద్దలే కాదు.. పిల్లలూ గజగజ వణికిపోతున్నారు. వయసుతో తారతమ్యం లేకుండా అందర్నీ చుట్టేస్తున్నది. మహమ్మారి విజృంభణ వేళ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పెద్దలతో పోల్చితే పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువని, వైరస్ త్వరగా సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగం లేదా వ్యాపారం, ఇతర పనుల మీద బయటకెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని కోరుతున్నారు. ఇంట్లో కరోనా బారిన పడిన వారు పిల్లలను దూరంగా ఉంచాలని, వారు మహమ్మారి బారిన పడకుండా కఠిన నియమాలు పాటించడంతోపాటు ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. చిన్నారులకు ప్రధానంగా రోగ నిరోధకశక్తి(ఇమ్యూనిటీ) పెంచే ఆహారమందించాలని, పాలిచ్చే తల్లులు కొవిడ్ బారిన పడినా తగిన జాగ్రత్తలు పాటిస్తూ పాలివ్వడం ఎంతో మేలని సూచిస్తున్నారు.
కరోనా వయసుతో తారతమ్యాలు లేకుండా ముచ్చెమటలు పట్టిస్తున్నది. ముఖ్యంగా చిన్నారులను కూడా వదలకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలల సంరక్షణపై మరింత శ్రద్ధ అవసరమని, వారు కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు కఠిన నియమాలు పాటించడంతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పిల్లలపై కరోనా పంజా విసరకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి కుటుంబ సభ్యులదే. శిశువు నుంచి 12 ఏండ్ల లోపు పిల్లలను ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు పంపకూడదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ద్వారానే ఎక్కువగా చిన్నారులకు వైరస్ సోకుతున్నది. కొవిడ్ నిబంధనలను సరిగా పాటించకపోవడం, రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో పిల్లలు బాధితులవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ మిగతా వారితో పోల్చితే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. అదనంగా పలు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా చిన్నారులు వైరస్ బారిన పడకుండా ఉండేలా చూసుకోవచ్చు.
పాటించాల్సిన జాగ్రత్తలు..
చిన్నపిల్లలు ఉంటే కుటుంబసభ్యులంతా కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. బయటకు వెళ్లిన ప్రతి సందర్భంలో మాస్కు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి.
ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం స్నానం చేయనిదే లోపలికి రాకూడదు. పిల్లలను తాకరాదు.
సాధ్యమైనంత వరకు పిల్లలను ముద్దుపెట్టుకోవడం, పూర్తిగా దగ్గరికి తీసుకోవడం చేయరాదు. కొంత భౌతిక దూరం పాటిస్తే మంచిది.
మూడేండ్ల లోపు పిల్లలకు తినిపించేటప్పుడు ముందుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆపై వయసు వారికి స్వతహాగా తినడం నేర్పించాలి.
తినే ప్లేటు నుంచి టవల్, బాత్సోప్ వంటివి పిల్లలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
సన్నిహితులు ఎవరైనా ఇంటికి వస్తే.. పిల్లలను దూరంగా ఉంచాలి.
పండ్లు, పాలు తదితర వాటిని వేడినీటితో శుద్ధి చేసిన తర్వాతే ఇవ్వాలి.
ఇంటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి. తద్వారా కొవిడ్ వైరస్సే కాదు. ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా చిన్నారులను కాపాడుకోవచ్చు.
వేడుకలు, శుభకార్యాలు, ప్రయాణాలకు దూరంగా ఉంచాలి. ఒకవేళ తప్పనిసరి అయితే వ్యక్తిగత వాహనాలనే ఉపయోగించుకోవాలి. మాస్కులను తప్పనిసరిగా ధరించేలా చూడాలి.
అనారోగ్యానికి గురైతే వైద్యశాలలకు పరుగులు తీయకూడదు. ముందుగా ఆన్లైన్ మెడికల్ కన్సల్టెన్సీ ద్వారా వైద్యులను సంప్రదించాలి. వారు సూచిస్తేనే వైద్యశాలకు తీసుకెళ్లాలి.
ఐదేండ్లు పైబడిన పిల్లలకు మాస్కు ధరించడం, శానిటైజ్ చేసుకోవడంపై అవగాహన కల్పించాలి.
ఇమ్యూనిటీ పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
సాధారణ వ్యక్తులతో పోల్చినప్పుడు చిన్నారులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు కనీసం ఐదేండ్లు వచ్చేంత వరకు తరచుగా అంటు వ్యాధులకు, వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. అందుకే పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
తల్లిపాల ద్వారానే ఎక్కువగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొవిడ్ బారిన పడినా.. తగిన జాగ్రత్తలను పాటిస్తూ పిల్లలకు తల్లిపాలను అందిస్తూనే ఉండాలి.
ఐదేండ్ల్లు వచ్చేంత వరకు పోలియో, న్యూమోనియా తదితర వ్యాక్సిన్లను వేస్తుంటారు. వీటి ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంటుంది. నిర్ణీత సమయంలో టీకాల ప్రక్రియ పూర్తి చేయాలి.
ప్రొటీన్లు అధికంగా ఉండే పప్పులు, చేపలు, పాలు, గుడ్డు, ఆకుకూరలు ఇలా సమతుల ఆహారాన్ని ఎక్కువగా అందించాలి. ఇది ఇమ్యూనిటీ పెరుగుదలకు దోహదపడుతుంది.
పిల్లలకు తేనే, బెల్లం, వివిధ రకాల పండ్ల జ్యూస్లను అందించాలి. తద్వారా పోషకాలు ఎక్కువగా అందుతాయి. వేసవిలో డీ హైడ్రేషన్కు గురికాకుండా ఉంటారు. చిరుతిళ్లు, జంక్ ఫుడ్లకు దూరంగా ఉంచాలి.
ఏసీఈ-2 తక్కువ ఉండటం వల్లే..
తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లలపై వైరస్ ప్రభావం తక్కువే. వారిపై వైరస్ అంతగా ఎఫెక్ట్ చూపకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి వారికి ఇచ్చే టీకాలు. దీనివల్ల సహజంగానే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక రెండోది ‘ఆంజియోటెన్సీన్-2’(ఏసీఈ) అనే ఎంజైమ్ తక్కువగా ఉండటం. ప్రతి మనిషిలో వివిధ రకాల ఎంజైమ్స్ ఉంటాయి. వాటిలో ఆంజియోటెన్సీన్-2 అనేది ప్రధానం. కరోనా సోకడానికి ఈ ఎంజైమే ప్రధాన ప్లాట్ఫామ్. ఇది పిల్లల్లో చాలా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల కరోనా ప్రభావం వారిపై స్వల్పంగానే ఉంటున్నది. అయితే ఈ రెండు అంశాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.- డాక్టర్ రమేశ్ దాంపురి, కరోనా నోడల్ అధికారి, నిలోఫర్ దవాఖాన
ఆ నియమాలు కచ్చితంగా పాటించాలి..
థర్డ్వేవ్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే అది పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది కచ్చితంగా చెప్పలేం. ఇప్పటి వరకైతే ఫస్ట్, సెకండ్ వేవ్లో మాత్రం చిన్నారులపై ప్రభావం తక్కువగానే ఉంది. రికవరీ రేటు కూడా అధికమే. వారిలో ఏసీఈ-2 తక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి కొంచెం రిస్క్ ఎక్కువ. ఫస్ట్వేవ్లో లాక్డౌన్ కారణంగా పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇండ్ల నుంచి బయటకు వెళ్లలేదు. దీంతో పిల్లలు వైరస్కు ఎక్కువగా ప్రభావితం కాలేదు. రెండోదశ వచ్చేసరికి పాఠశాలలకు వెళ్లడం, పెద్దలు నియమాలు పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి వేగం పుంజుకున్నది. ఈ క్రమంలో పిల్లలు సైతం బాధితులయ్యారు. అయినా విషమ పరిస్థితి రాలేదు. రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ ఇలా మూడు నియమాలు కచ్చితంగా పాటిస్తే థర్డ్వేవ్ను మనం జయించి.. పిల్లలను కాపాడుకోవచ్చు. – డాక్టర్ దినేశ్కుమార్ చీర్ల, ఇంటెన్సివ్కేర్ డైరెక్టర్, రెయిన్బో హాస్పిటల్
సకాలంలో లక్షణాలు గుర్తించాలి…
థర్డ్వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందనేది ఒక అంచనా మాత్రమే. దాని తీవ్రత వచ్చే వైరస్ మ్యుటేషన్స్పై ఆధారపడి ఉంటుంది. చాలా మంది పిల్లలు కరోనా తర్వాత మల్టీ సిస్టం ఇన్ఫ్లామెటరీ సిండ్రోమ్(ఎంఐఎస్-సీ)కు గురవుతున్నారు. దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. కరోనా సోకిన నెలరోజుల తరువాత జ్వరం, గొంతుకింద వాపురావడం, కళ్లు ఎర్రబడడం, వాంతులు, విరేచనాలు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే 98 శాతం రికవరీ ఉంటుంది. ఐదురోజుల్లోపు జ్వరం, వాంతులు, విరేచనాలు వంటివి తగ్గుముఖం పట్టకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పరిస్థితి విషమిస్తే ప్రమాదకరం. థర్డ్వేవ్ నుంచి పిల్లలను రక్షించుకోవాలంటే ముందుగా పెద్దవారు కరోనా నియమాలు కచ్చితంగా పాటించాలి. -డాక్టర్ సురేశ్కుమార్, చిన్నపిల్లల వైద్యనిపుణులు అపోలో క్రెడల్ హాస్పిటల్
తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి
థర్డ్వేవ్ వచ్చే అవకాశముందంటున్నారు. అది ఎలా ఉంటుందనేది కచ్చితంగా చెప్పలేం. కరోనా ఏ దశ అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే. పిల్లలు సురక్షితంగా ఉండాలంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. బయట తిరిగేసి పిల్లల దగ్గరకు వస్తే వారికి వైరస్ సోకే అవకాశముంటుంది. ఇప్పుడొస్తున్న కేసులన్నీ కుటుంబసభ్యుల ద్వారా వచ్చినవే. పిల్లల్లో వైరస్ సోకినా పెద్దగా తెలియదు. చిన్నారులకు కరోనా టీకాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. -డాక్టర్ ఉషారాణి, చిన్నపిల్లల విభాగాధిపతి, నిలోఫర్ దవాఖాన
జాగ్రత్తగాఉంటున్నాం
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాం. ఇంటి పక్కనున్న ఫ్రెండ్స్తోనూ ఆడుకోవడం లేదు. ఇంట్లో ఉంటున్నా శానిటైజ్ చేసుకుంటున్నాం. ఏడాది నుంచి స్కూల్కెళ్లకుండా ఆన్లైన్ క్లాసులు వింటున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండాలి. – చింతల సుదీక్ష
చాలా జాగ్రత్తగా ఉంటున్నాం
కరోనా నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉంటున్నాం. బయటకు వెళ్లివస్తే చాలు.. స్నానం చేయనిదే ఇంట్లోకి అడుగుపెట్టడం లేదు. ఇక వేడుకలు, శుభకార్యాలకు, షాపింగ్లకు పిల్లలను దూరంగా ఉంచుతున్నాం. పౌష్టికాహారాన్ని ఇంట్లోనే తయారు చేసి పెడుతున్నాం. – సూర్యవేని మహేందర్రావు, హైదరాబాద్
బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నాం..
ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నాం. బయట నుంచి వస్తే.. పిల్లలను సాధ్యమైనంత మేరకు దూరంగానే ఉంచుతున్నాం. అన్నిరకాలుగా వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఎక్కడికి పంపడం లేదు. బంధువులు, స్నేహితులను కూడా రానివ్వడం లేదు.- వెంకీ, హైదరాబాద్
ఇంట్లోనే ఆడుకుంటున్నాం
అపార్ట్మెంట్ దాటి బయటకు వెళ్లడం లేదు. ఇంట్లోనే క్యారమ్స్, చెస్ ఆడుకుంటున్నాం. అమ్మానాన్న చెప్పినట్లు శానిటైజ్ చేసుకుంటున్నాం. డాడీ.. షాపింగ్కు కూడా తీసుకెళ్లడం లేదు. – రోషిణి