Sunday, August 16, 2026

మింట్ కాంపౌండ్‌లో ఘనంగా టీజీఎస్పీడీసీఎల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు_

*మింట్ కాంపౌండ్‌లో ఘనంగా టీజీఎస్పీడీసీఎల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 15

దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో గల టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విద్యుత్ వినియోగదారులకు, టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నాణ్యమైన విద్యుత్ సేవలే సంస్థకు ప్రతిష్టను తీసుకొస్తాయి.
వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు, ఇంజినీర్లు మరియు సిబ్బంది చేస్తున్న కృషిని సీఎండీ అభినందించారు. విద్యుత్ రంగంలో సంస్థకు మరింత గుర్తింపు, మంచి పేరు తీసుకురావడానికి ఇదే స్ఫూర్తి, అంకితభావం మరియు నిబద్ధతతో పనిచేయాలని ఆయన సూచించారు.
వినియోగదారుల సంతృప్తికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, వారికి ఎలాంటి జాప్యం, అసౌకర్యం లేకుండా విద్యుత్ సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని సీఎండీ స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో నాణ్యత, విశ్వసనీయతను మరింత మెరుగుపరచడంతో పాటు, వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గోల్కొండ కోటలో రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అనంతరం టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) డా. ఎన్. నర్సింహులు, డైరెక్టర్ (ఫైనాన్స్)  చక్రపాణి, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. శివాజీ, డైరెక్టర్ (హెచ్‌ఆర్ & ఫైనాన్స్) కృష్ణారెడ్డి, మెద్చల్–మల్కాజిగిరి చీఫ్ ఇంజినీర్, హెచ్‌ఆర్ విభాగం అధిపతి శ్రీ బిక్షపతి, కార్పొరేట్ కార్యాలయ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment