Thursday, August 27, 2026

గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు – అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, IPS_

*గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు – అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, IPS.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 26:

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించారు.సెప్టెంబర్ 14 నుంచి 25వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి గత ఏడాది ఏర్పాట్లు, ఎదురైన సమస్యలు, ఈ ఏడాది చేపట్టాల్సిన భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గత ఏడాది సైబరాబాద్ పరిధిలో సుమారు 25,000 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ఈ ఏడాది కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఈ సమావేశం లో పోలీస్,  సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, హైడ్రా, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, జలమండలి, ఆర్టీసీ, టూరిజం తదితర శాఖల అధికారులు   పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన తేదీ వంటి వివరాలను నిర్వాహకులు ముందుగానే స్థానిక పోలీసులకు తెలియజేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ప్రదేశాల్లో విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేయరాదని తెలిపారు. ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు 24 గంటలు అందుబాటులో ఉండడంతో పాటు, అవసరమైన సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నిమజ్జన కార్యక్రమాలను సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన భద్రతా, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. నిమజ్జన మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, అడ్డంకుల తొలగింపు, బ్యారికేడింగ్, లైటింగ్, పార్కింగ్, తాగునీరు వంటి ఏర్పాట్లతో పాటు అవసరమైన చోట సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు, గణేష్ మండప నిర్వాహకులు పోలీసులకు, ఇతర ప్రభుత్వ శాఖలకు పూర్తి సహకారం అందించి గణేష్ ఉత్సవాలను సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించాలని సీపీ కోరారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మాట్లాడుతూ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు జోన్లకు చెందిన అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది సమావేశంలో పాల్గొని గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం జరిగే మార్గాలను ముందుగానే పరిశీలించి, ఆయా మార్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.
ప్రధానంగా రోడ్లపై గుంతల మరమ్మతులు, లైటింగ్, డ్రైనేజీ సిల్టింగ్, అవసరమైన చోట జనరేటర్ల ఏర్పాటు, ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనులను ప్రాధాన్యతగా చేపడతామని తెలిపారు. అలాగే, నిర్దేశిత ప్రాంతాల్లో తాత్కాలిక పారిశుద్ధ్య బృందాలను ఏర్పాటు చేసి పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని  తెలిపారు. సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ – ట్రాఫిక్ సన్‌ప్రీత్ సింగ్,  మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడతామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడతామని తెలిపారు. సంబంధిత శాఖలు ముందుగానే తమ ఏర్పాట్లను పూర్తి చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవాలను సజావుగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ఇంద్రేశం, ఇస్నాపూర్‌తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో గత ఏడాది గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు.భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ రెడ్డి మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు ఉత్సవాల నిర్వహణ కోసం ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించి, ఈ ఏడాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గతంలో ఎదురైన సమస్యలు, అవసరమైన ఏర్పాట్లను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై శాఖల వారీగా సమన్వయం చేసుకుని, సకాలంలో చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు వారి శాఖ తరపున చేసే ఏర్పాటును వివరించారు, అలాగే ఉత్సవ కమిటీ వారు చెప్పిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో  సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, జాయింట్ సీపీ ట్రాఫిక్ సన్‌ప్రీత్ సింగ్, సీఎంసీ కమిషనర్ సృజన, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి సభ్యులు మహిపాల్ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి అధ్యక్షులు రాఘవ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి సెక్రటరీ శశిధర్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు రామరాజు, రమేష్, భాస్కర్, జీవన్ అదే విధంగా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment