Sunday, August 16, 2026

గాంధీ భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ_

*గాంధీ భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ*

*రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మహేష్ కుమార్ గౌడ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 15

గాంధీ భవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం దేశంలోనే గొప్ప పండగ అని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే జాతీయ పండగ అని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు.మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ చరిత్రను యువత సమగ్రంగా అధ్యయనం చేయాలని, ముఖ్యంగా నేటి జెన్‌-జీ తరం చరిత్రపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.కుల, మతాల పేరుతో జరుగుతున్న చిచ్చు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం సాకారమవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.పరిపాలన కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే ప్రజాస్వామ్యం పరిఢవిల్లదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తీవ్రవాదులుగా ముద్ర వేయడం సరైన విధానం కాదని విమర్శించారు. బీజేపీ నియంతృత్వ వైఖరిని ప్రతి పౌరుడు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశం కల్పించిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జోడో యాత్ర స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించామని తెలిపారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని, సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల అంశాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. వాస్తవాలకు దూరంగా సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారాన్ని అరికట్టాలని, యువత నిజానిజాలను తెలుసుకుని చైతన్యవంతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రశ్నపత్రాల లీకేజీలకు ఎవరు బాధ్యులనే అంశంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ వంటి నాయకుల పాత్రను గుర్తు చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశం ఆశ్చర్యపోయేలా ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment