Sunday, February 12, 2023

డాక్టర్ కందాల శోభారాణి గారు కొద్దిసేపటి క్రితం తీవ్ర అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.

కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం  అధ్యాపకురాలు డాక్టర్ కందాల శోభారాణి గారు కొద్దిసేపటి క్రితం తీవ్ర అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. వీరిది పాపయ్యపేట గ్రామం, చెన్నారావుపేట మండలం ,వరంగల్ జిల్లాకు చెందిన వారు. కాకతీయ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో పి.హెచ్.డి. పూర్తి చేసి, అధ్యాపకురాలిగా కొనసాగుతూనే మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆదివాసి, ప్రజల హక్కుల  రక్షణ కోసం తుదికంఠ పోరాడారు. అనేక రచనలు ,కవిత్వాలు రాసి తెలుగు సాహిత్యాభివృద్ధి వికాసానికి కృషి చేశారు. సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారిన కులం, మతం, దోపిడీ, పీడన, వివక్షత, అణచివేత , పితృ స్వామ్య వ్యవస్థ లేని సమ సమాజ స్థాపన కోసం తుది కంఠ పరితపించారు. ఈమె భర్త   టి.రమేష్ గతంలో PDSU ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం సామాజిక ఉద్యమాల్లో కొనసాగుతున్నారు. వీరికి ఒక బాబు కౌశిక్ ఉన్నారు.
డాక్టర్ శోభారాణి మృతి పట్ల కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు, అధ్యాపకులు ,సిబ్బంది, అరసంతో పాటు పలు సంఘాల నాయకులు, పరిశోధక విద్యార్థులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు. ఆమె మరణానంతరం ఆమె భౌతిక కాయాన్ని ఆమె కోరుకున్నట్లు కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని రేపు ఉదయం 11 గంటల వరకు వారి గృహం యందు వుంచుతారు.
అడ్రస్ : కాకతీయ యూనివర్సిటీ రెండవ గేటు,కనకయ్య హోటల్ వెనక, హనుమకొండ.
🌹🌹🌹 ✊✊✊

నేను చెప్పేవి అబ్బద్ధం అవుతే రాజీనామా చేస్తా..... సీఎం కేసీఆర్

*నేను చెప్పేవి అబ్బద్ధం అవుతే రాజీనామా చేస్తా..... సీఎం కేసీఆర్*

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ జులం.. అహంకారం ఎన్నో రోజులు ఉండదని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ శాశ్వతం కాదని, 2024 తర్వాత భాజపా కుప్పకూలడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) అన్నారు.మన్మోహన్‌సింగ్‌ హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ మోదీ ప్రభుత్వం (PM Modi) వెనుకబడి ఉందని, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. తాను చెప్పే మాటలు అవాస్తవమైతే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. అసెంబ్లీలో ద్రవ్యవినియమ బిల్లుపై చర్చ అనంతరం సభను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు.

''గోద్రా అల్లర్లపై బీబీసీపై డ్యాకుమెంటరీ తీస్తే దాన్ని బ్యాన్‌ చేశారు. అశ్వనీ ఉపాధ్యాయ అనే వకీలు బీబీసీని బ్యాన్‌ చేయాలని కేసు వేశారు. అంత అహంకారమా? అంత ఉన్మాదమా? సుప్రీంకోర్టులో కేసు వేస్తే దేశానికి అలంకారమా? మన గురించి ప్రపంచం ఏమనుకుంటుంది. ఇంత అసహన వైఖరి అవసరమా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతి ఇదేనా? మనుషులన్నాక తప్పులు జరుగుతాయి. ఒప్పుకోవాలి. కొన్నిసార్లు నోరుజారి మాట్లాడతారు. సారీ చెబితే తప్పేముంది. మాట్లాడితే జైలులో వేస్తామని బెదిరిస్తారు. జులుం, అహంకారం ఎన్నిరోజులు ఉంటుంది. 2024 తర్వాత కుప్పకూలడం ఖాయం. బంగ్లాదేశ్‌ వార్‌ గెలిచినప్పుడు పార్లమెంట్‌లో వాజ్‌పేయీగారు స్వయంగా 'దుర్గామాత ఆఫ్‌ హిందుస్థాన్‌' అని ఇందిరాగాంధీని పొగిడారు. ఆ తర్వాత అలహాబాద్‌ జడ్జిమెంట్‌ వల్ల మహానాయకురాలైన ఇందిరాగాంధీలాంటి వారినే ఈ దేశం ఓడించింది. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదు. సంయమనం ఉండాలి. దేశంలో అంతులేని ప్రైవేటేజేషన్‌ తెస్తున్నారు. రైళ్లు, రైల్వేస్టేషన్లు, పోర్టులు అన్నీ పోతున్నాయి. చివరకు ఎల్‌ఐసీని కూడా అమ్మేయాలా? సోషలైజేషన్‌ ఆఫ్‌ లాసెస్‌.. ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ ప్రాఫిట్' అనే నీతిని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోంది. అంటే నష్టం వస్తే సమాజంపైన వెయ్‌. లాభం వస్తే, ప్రవేటువాళ్లకు అప్పగించు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.''

''ప్రభుత్వం వ్యాపారాత్మక ధోరణిలో వ్యాపారం చేయకూడదు. అవసరమైన చోట మాత్రమే వ్యాపారం చేయాలి'. రైతుల ధాన్యం కొనాల్సి వచ్చినప్పుడు నష్టం వచ్చినా కొన్నాం. ఒక చోట అధిక లాభాలు రావచ్చు. మరొకచోట పెద్దగా రాకపోవచ్చు. అన్నింటినీ సమ్మిళితం చేయాలి' ప్రభుత్వం వ్యాపారం చేయదు అంటే బాధ్యతల నుంచి తప్పుకోవడమే. ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ అని పెట్టాం. కాడి మోసిన వాడు సిపాయి గానీ, కాడి గుంజిన వాడు సిపాయి కాదు. కాంగ్రెస్‌ పాలనలో వార్షిక వృద్ధిరేటు 6.8శాతం ఉంది. భాజపా హయాంలో 2014-23 వరకూ 5.5శాతానికి వచ్చింది. కాంగ్రెస్‌ వాళ్లది అంతులేని భావదారిద్ర్యం ఆ బాధ్యత మాపై పడింది. యూపీఏ కాలంలో 24శాతం వృద్ధిరేటు ఎక్కువ. మన్మోహన్‌ హయాంలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.73శాతం ఉంటే, మోదీ హయాంలో 7.01శాతానికి పడిపోయింది. ఇవన్నీ కాగ్‌ చెప్పిన గణాంకాలే. జీడీపీలో అప్పుల శాతం 66.7శాతం ఉండగా, మన్మోహన్‌సింగ్‌ పాలన ముగిసే సమయానికి 52శాతానికి తగ్గింది. అప్పుల శాతాన్ని తగ్గించారు. ఇక మోదీ హయాంలో 2014 నుంచి చూస్తే 52.2శాతం నుంచి 56శాతానికి పెరిగింది. అప్పులు చేయడంలో ప్రధాని మోదీని మించిన వారు లేరు. ఎగుమతుల వృద్ధి రేటు పెరిగితే, దేశం అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నట్లు. మన్మోహన్‌సింగ్ హయాంలో ఎగుమతుల వృద్ధి రేటు 19.5శాతం ఉంటే, మోదీ హయాంలో 4.9శాతానికి పడిపోయింది. మేకిన్‌ ఇండియా జోకిన్‌ ఇండియా అయింది. విశ్వగురు ఎటు పోయే.. ఇదేం ప్రచారం. ఇవన్నీ కఠిన వాస్తవాలు. ఇందులో ఒక్కటి అబద్ధమైనా నేను రాజీనామా చేస్తా. అత్యంత అసమర్థ ప్రభుత్వం ప్రధాని మోదీదే'' అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు.

*సుజీవన్ వావిలాల🖋️*

Saturday, February 11, 2023

తొమ్మిదో నిజాం ఎంపికపై వివాదం

*తొమ్మిదో నిజాం ఎంపికపై వివాదం*

*హైదరాబాద్.....!*
ఇటీవల కన్నుమూసిన నిజాం ముకర్రం జా కుమారుడు అజ్మత్‌జాను తొమ్మిదో నిజాంగా ప్రకటించడం సరికాదని అస్‌ఫజాహీ వంశస్థులు, మజ్లి్‌స-ఎ-సాహెబ్‌ జాదాగన్‌ సొసైటీ సభ్యులు, నిజాం కుటుంబీకులు స్పష్టం చేశారు.హైదరాబాద్‌ సంస్కృతి, సంప్రదాయాలపై కనీస అవగాహన లేని అజ్మత్‌కు వారసత్వ బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిజాం ట్రస్టీల్లో ఒక్కరినీ సంప్రదించకుండా, ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. శనివారం ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లండన్‌లో పుట్టిపెరిగిన అజ్మత్‌కు నిజాం కుటుంబీకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. '16 ట్రస్టుల్లోని 4,500 మంది సభ్యులంతా కలిసి..

నవాబ్‌ రౌనఖ్‌యార్‌ఖాన్‌ను తొమ్మిదో నిజాంగా ఎంపిక చేశాం. రౌనఖ్‌ ప్రమాణస్వీకార తేదీని త్వరలో ప్రకటిస్తాం. మా నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిసి, వారికి పరిస్థితులను వివరించాం' అని తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, February 10, 2023

జబర్దస్త్ జోకులు చేస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

 *మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి అసెంబ్లీలో మాట్లాడకుండా జబర్దస్త్ జోకులు చేస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి*-ఎస్ఎఫ్ఐ 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ... మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాల నుంచి విద్యార్థులు,భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా పోరాటాలు చేస్తున్న పట్టించుకోని పాలకులు.. మేడ్చల్ నియోజకవర్గం లో మండలాన్ని ఒక్క జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని నియోజవర్గం ఎమ్మెల్యే ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీల గురించి అసెంబ్లీలో మాట్లాడుతారేమో అని వేయికళ్లతో,కోటి ఆశలతో ఎదురుచూసిన విద్యార్థిని,విద్యార్థులు, నియోజవర్గ ప్రజలు కానీ మంత్రి మల్లారెడ్డి విద్యార్థినీ విద్యార్థుల నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని మర్చిపోయి. తన వ్యక్తిగత కళాశాల మల్లారెడ్డి విద్యాసంస్థల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడడం సిగ్గుచేటు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుతుంటే మంత్రి మల్లారెడ్డి మాత్రం మేడ్చల్ నియోజకవర్గం సమస్య గురించి ఒక మాట కూడా ఎత్తకపోవడం సరైన విధానం కాదు..మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోతే, మేడ్చల్ నియోజవర్గాల్లో  ప్రతి మండలంలో ఒక్క జూనియర్ కళాశాల ఏర్పాటు చేయకపోతే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని అడుగున అడ్డుకుంటామని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాము...

ధన్యవాదములతో

*రాథోడ్ సంతోష్*
*ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు*

తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

◾ *|| తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా ||* ◾

▪️ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో వాయిదా పడిన సచివాలయ ప్రారంభోత్సవం.

▪️రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవంకు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.

▪️17న సచివాలయం ప్రారంభం వాయిదా.

*సుజీవన్ వావిలాల🖋️* 

50 స్థానాల్లో పోటీ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం: అసదుద్దీన్‌

*50 స్థానాల్లో పోటీ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం: అసదుద్దీన్‌*

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంఐఎం పార్టీ 50 స్థానాల్లో పోటీ చేయడంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు. అసెంబ్లీ  ఆవరణలో జరిగిన ఇష్టాగోష్ఠిలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. సీఎం కేసీఆర్ తాజ్ మహల్ లాగే సచివాలయాన్ని చాలా బాగా నిర్మించారని కొనియాడారు. సచివాలయ ప్రారంభం అధికారిక కార్యక్రమం అని.. దానికి తప్పకుండా హాజరవుతానని చెప్పారు. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే భారాస సభతో మాత్రం తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని అసదుద్దీన్‌ అన్నారు. తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారని, దేశమంతా వస్తే మంచిదేనని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఎంఐఎంను భాజపా బీ టీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భాజపాను ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో జేపీసీ కోసం అడిగితే ప్రధాని మోదీ అంగీకరించడం లేదన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

చెడి పోయిన బుల్లెట్ ప్రూఫ్ కారుతో ప్రగతి భవన్ కు.....రాజాసింగ్ అరెస్ట్

*చెడి పోయిన బుల్లెట్ ప్రూఫ్ కారుతో ప్రగతి భవన్ కు.....రాజాసింగ్ అరెస్ట్....*

హైదరాబాద్‌: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే, రాజాసింగ్‌ మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చెడిపోయిన తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని తీసుకొని ఎమ్మెల్యే శుక్రవారం ప్రగతి భవన్‌ వద్దకు వెళ్లారు. తనకు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ మార్చాలని, లేదంటే ఆ వాహనం మీరు తీసుకోవాలంటూ ప్రగతిభవన్ వద్ద వదిలేసి రాజాసింగ్ వెళుతున్నారు.

ఇది గమనించిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మీడియా కంట పడకుండా పూర్తిగా మూసేసిన పోలీస్‌ డీసీఎంలో అసెంబ్లీకి తీసుకొచ్చారు. కాగా గతంలో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయనను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

*సుజీవన్ వావిలాల*🖋️