Sunday, February 12, 2023

నేను చెప్పేవి అబ్బద్ధం అవుతే రాజీనామా చేస్తా..... సీఎం కేసీఆర్

*నేను చెప్పేవి అబ్బద్ధం అవుతే రాజీనామా చేస్తా..... సీఎం కేసీఆర్*

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ జులం.. అహంకారం ఎన్నో రోజులు ఉండదని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ శాశ్వతం కాదని, 2024 తర్వాత భాజపా కుప్పకూలడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) అన్నారు.మన్మోహన్‌సింగ్‌ హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ మోదీ ప్రభుత్వం (PM Modi) వెనుకబడి ఉందని, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. తాను చెప్పే మాటలు అవాస్తవమైతే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. అసెంబ్లీలో ద్రవ్యవినియమ బిల్లుపై చర్చ అనంతరం సభను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు.

''గోద్రా అల్లర్లపై బీబీసీపై డ్యాకుమెంటరీ తీస్తే దాన్ని బ్యాన్‌ చేశారు. అశ్వనీ ఉపాధ్యాయ అనే వకీలు బీబీసీని బ్యాన్‌ చేయాలని కేసు వేశారు. అంత అహంకారమా? అంత ఉన్మాదమా? సుప్రీంకోర్టులో కేసు వేస్తే దేశానికి అలంకారమా? మన గురించి ప్రపంచం ఏమనుకుంటుంది. ఇంత అసహన వైఖరి అవసరమా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతి ఇదేనా? మనుషులన్నాక తప్పులు జరుగుతాయి. ఒప్పుకోవాలి. కొన్నిసార్లు నోరుజారి మాట్లాడతారు. సారీ చెబితే తప్పేముంది. మాట్లాడితే జైలులో వేస్తామని బెదిరిస్తారు. జులుం, అహంకారం ఎన్నిరోజులు ఉంటుంది. 2024 తర్వాత కుప్పకూలడం ఖాయం. బంగ్లాదేశ్‌ వార్‌ గెలిచినప్పుడు పార్లమెంట్‌లో వాజ్‌పేయీగారు స్వయంగా 'దుర్గామాత ఆఫ్‌ హిందుస్థాన్‌' అని ఇందిరాగాంధీని పొగిడారు. ఆ తర్వాత అలహాబాద్‌ జడ్జిమెంట్‌ వల్ల మహానాయకురాలైన ఇందిరాగాంధీలాంటి వారినే ఈ దేశం ఓడించింది. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదు. సంయమనం ఉండాలి. దేశంలో అంతులేని ప్రైవేటేజేషన్‌ తెస్తున్నారు. రైళ్లు, రైల్వేస్టేషన్లు, పోర్టులు అన్నీ పోతున్నాయి. చివరకు ఎల్‌ఐసీని కూడా అమ్మేయాలా? సోషలైజేషన్‌ ఆఫ్‌ లాసెస్‌.. ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ ప్రాఫిట్' అనే నీతిని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోంది. అంటే నష్టం వస్తే సమాజంపైన వెయ్‌. లాభం వస్తే, ప్రవేటువాళ్లకు అప్పగించు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.''

''ప్రభుత్వం వ్యాపారాత్మక ధోరణిలో వ్యాపారం చేయకూడదు. అవసరమైన చోట మాత్రమే వ్యాపారం చేయాలి'. రైతుల ధాన్యం కొనాల్సి వచ్చినప్పుడు నష్టం వచ్చినా కొన్నాం. ఒక చోట అధిక లాభాలు రావచ్చు. మరొకచోట పెద్దగా రాకపోవచ్చు. అన్నింటినీ సమ్మిళితం చేయాలి' ప్రభుత్వం వ్యాపారం చేయదు అంటే బాధ్యతల నుంచి తప్పుకోవడమే. ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ అని పెట్టాం. కాడి మోసిన వాడు సిపాయి గానీ, కాడి గుంజిన వాడు సిపాయి కాదు. కాంగ్రెస్‌ పాలనలో వార్షిక వృద్ధిరేటు 6.8శాతం ఉంది. భాజపా హయాంలో 2014-23 వరకూ 5.5శాతానికి వచ్చింది. కాంగ్రెస్‌ వాళ్లది అంతులేని భావదారిద్ర్యం ఆ బాధ్యత మాపై పడింది. యూపీఏ కాలంలో 24శాతం వృద్ధిరేటు ఎక్కువ. మన్మోహన్‌ హయాంలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.73శాతం ఉంటే, మోదీ హయాంలో 7.01శాతానికి పడిపోయింది. ఇవన్నీ కాగ్‌ చెప్పిన గణాంకాలే. జీడీపీలో అప్పుల శాతం 66.7శాతం ఉండగా, మన్మోహన్‌సింగ్‌ పాలన ముగిసే సమయానికి 52శాతానికి తగ్గింది. అప్పుల శాతాన్ని తగ్గించారు. ఇక మోదీ హయాంలో 2014 నుంచి చూస్తే 52.2శాతం నుంచి 56శాతానికి పెరిగింది. అప్పులు చేయడంలో ప్రధాని మోదీని మించిన వారు లేరు. ఎగుమతుల వృద్ధి రేటు పెరిగితే, దేశం అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నట్లు. మన్మోహన్‌సింగ్ హయాంలో ఎగుమతుల వృద్ధి రేటు 19.5శాతం ఉంటే, మోదీ హయాంలో 4.9శాతానికి పడిపోయింది. మేకిన్‌ ఇండియా జోకిన్‌ ఇండియా అయింది. విశ్వగురు ఎటు పోయే.. ఇదేం ప్రచారం. ఇవన్నీ కఠిన వాస్తవాలు. ఇందులో ఒక్కటి అబద్ధమైనా నేను రాజీనామా చేస్తా. అత్యంత అసమర్థ ప్రభుత్వం ప్రధాని మోదీదే'' అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు.

*సుజీవన్ వావిలాల🖋️*

No comments:

Post a Comment