Wednesday, September 6, 2023

సీఎం కేసీఆర్ కు... రేవంత్ బహిరంగ లేఖ

*సీఎం కేసీఆర్ కు... రేవంత్ బహిరంగ లేఖ*

హైదరాబాద్: కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాలు చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.లేఖలో ఏముందంటే.. ''తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలక భూమిక పోషించారు. తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని చెప్పి మాట తప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా..

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వెతలు తీరలేదు. క్రమబద్ధీకరణ జరగకపోగా జీతాలివ్వండి మహాప్రభో అని అర్ధించాల్సిన పరిస్థితి. మే నెలలో రెగ్యులర్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లకూ ఏప్రిల్ నెల జీతం ఇంకా రాలేదు. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకూ కొన్ని జిల్లాల్లో జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నా.. సకాలంలో నెలలుగా జీతాలు లేక వందలాది మంది అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేవి.

కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏ రోజు జీతం పడుతుందో కూడా తెలియని దుస్థితి. ఐదారు నెలలుగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదేనా ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే? ధనిక రాష్ట్రమని చెప్పుకోవడమే తప్ప కాంట్రాక్ట్ లెక్చరర్స్‌కు వేతనాలు చెల్లించలేని దుస్థితి మీ ప్రభుత్వంలో దాపురించింది. కాంట్రాక్ట్ లెక్చరర్లకు సకాలంలో జీతాలు చెల్లించాలి. లేనిపక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక... వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతాం.'' అని రేవంత్‌ లేఖలో హెచ్చరించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment