Saturday, September 2, 2023

బంగాళాఖాతంలో మరో ఆవర్తన ద్రోణి

*బంగాళాఖాతంలో మరో ఆవర్తన ద్రోణి*

*౼ హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన*

*౼ రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం*

హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 3 నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సెప్టెంబరు 2 ఈ రోజు నుండి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా 2, 3, 4 (నేడు, రేపు) తేదీల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి కూడా ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి. కానీ.. శని, ఆది, సోమవారాల్లో కూడా.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వివరించారు. దీంతో వాతావరణశాఖ ఆయా జిల్లాల్లో పసుపు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో రానున్న 48 గంటల పాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది.

No comments:

Post a Comment