Friday, September 8, 2023

గణేష్ నిమజ్జనం...గతేడాది ఉత్తర్వులే కొనసాగుతాయి...హైకోర్ట్

*గణేష్ నిమజ్జనం.... గతేడాది ఉత్తర్వులే కొనసాగుతాయి.... హైకోర్ట్....*

హైదరాబాద్‌: ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతేడాది తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లోనూ అవే ఉత్తర్వులు కొనసాగుతాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పీఓపీ విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.

పీఓపీతో తయారు చేసిన విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలు కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. మరోవైపు గతేడాది కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్‌లో పీఓపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తివేయాలన్న పిటిషన్‌పై విచారణ సెప్టెంబరు 25కి వాయిదా వేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment