Thursday, September 21, 2023

ముస్తాబవుతున్న ఉప్పల్ స్టేడియం

*ముస్తాబవుతున్న ఉప్పల్ స్టేడియం*

*క్రికెట్‌ ప్రపంచకప్‌ మరో 13 రోజుల్లో*
హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ముస్తాబవుతోంది.
ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ స్టేడియంలో రెండు వార్మప్‌, మూడు అసలైన మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) స్టేడియంలో పైకప్పు, కొత్త కుర్చీలు తదితర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దక్షిణం వైపు గతంలో భారీ వర్షాలకు ఎగిరిపోయిన పైకప్పు స్థానంలో ఇప్పుడు కొత్తదాన్ని బిగించారు. తూర్పు దిశగా పైకప్పు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 29న ఉప్పల్‌లో జరగాల్సిన న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ వార్మప్‌ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించే సూచనలు కనిపించడం లేదు. గణేశ్‌ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకల నేపథ్యలో ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించడం సాధ్యం కాదని హెచ్‌సీఏకు రాచకొండ పోలీసులు సమాచారమిచ్చారు. ''39 వేల సామర్థ్యం ఉన్న ఉప్పల్‌ స్టేడియంలో ప్రపంచకప్‌ వరకు 10 నుంచి 12 వేల వరకు కొత్త కుర్చీలు ఏర్పాటు చేస్తాం. ఈ టోర్నీ తర్వాత మొత్తం మార్చేస్తాం. దక్షిణం వైపు పైకప్పు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తూర్పు వైపు పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పశ్చిమ వైపు పైకప్పు ఇప్పుడు పెట్టలేకపోతున్నాం. ప్రపంచకప్‌పూర్తయ్యాక దీన్ని కూడా ఏర్పాటు చేస్తాం. మొదటి వార్మప్‌ మ్యాచ్‌కు భద్రత గురించి ఇంకా చర్చ జరుగుతోంది. బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది'' అని హెచ్‌సీఏ సీఈవో సునీల్‌ పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment