Friday, September 4, 2026

అంబర్పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు_

*అంబర్పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 04:

అంబర్ పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశీలి. ముదిరాజ్ సంఘపు స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకుడు, సీనియర్ జర్నలిస్ట్  సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అంబర్ పేట స్విమ్మింగ్ పూల్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలలో పెద్ద సంఖ్యలో ముదిరాజ్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డిసిపి జోగుల నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కొర్వి  కృష్ణ స్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా అడిషనల్ డిసిపి నర్సయ్య మాట్లాడుతూ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 1893, ఆగష్టు 25 న కృష్ణాష్టమి రోజు జాల్నాలోని ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు అని ఎంతో కష్టపడి చదువుకొని చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్, ఆ తరువాత నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు అని రచయితగా, సాహితీవేత్తగానే కాకుండా పాత్రికేయుడిగా కూడా ఆయన సేవలందించారు అని సామాజిక రుగ్మతలపై అనేక పుస్తకాలు వ్రాశాడు అని గుర్తుచేశారు.ఈ సందర్భంగా  ముదిరాజ్ సంఘం నాయకురాలు మాట్లాడుతూ అంబర్ పేటలో మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అంబర్ పేట శ్రీ రమణ చౌరస్తా, చే నంబర్, ఎమ్మార్వో ఆఫీస్, అలీ కేఫ్ చౌరస్తాలలో ఏదైనీ ప్రాంతంలో కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.

"మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి"_

*ప్రచురణార్థం :*

*"మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి"*

*హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ పరంజ్యోతి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 03:

హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ పరంజ్యోతి గారు ఈరోజు హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిందాబాద్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఈ పరంజ్యోతి మాట్లాడుతూ... రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని, పర్యావరణ పర్యావరణాన్ని కాపాడాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని, హెచ్ఎండిఏ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నదని అన్నారు.
హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF) ప్రధాన కార్యదర్శి  కె.వీరయ్య మాట్లాడుతూ... ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు  చెరువులు కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే  ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో  వైభవంగా  నిర్వహించుకొనే  “వినాయక చవితి” పండుగ  సందర్భంగా  అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను  ప్రతిష్టించాలని అన్నారు.  నగరంలో ఇప్పటికే పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, మరింతగా పెరగకుండా  ఉండటానికి అందరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. గౌరవ హైకోర్టు “ పర్యావరణానికి హాని చెయ్యని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని, విగ్రహాల ఎత్తు ఐదు అడుగులు మించకుండా చూడాలని” సూచించిందని అన్నారు. భక్తుల విశ్వాసాలను, సమాజ భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని గౌరవ హైకోర్టు ఇచ్చిన సూచనలను అందరం పాటిద్దాం అని అన్నారు.వినాయక  విగ్రహాలలో అత్యధికం ప్లాస్టర్ ఆఫ్  పారిస్‌తో అనేక రకాల రసాయనిక రంగులతో తయారవుతున్నాయని, ఈ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లోను, నగరంలోని వివిధ చెరువులలో నిమజ్జనం చెయ్యటం జరుగుచున్నదని చెప్పారు. పర్యావరణ వేత్తల లెక్కల ప్రకారం నిమజ్జనం సమయంలో ఒక్క రోజులోనే హుస్సేన్ సాగర్‌లో  8,000 నుండి 9,000 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ , పాదరసం, సీసం, నిహాల్, టర్పెంటైన్, రెడ్ ఆక్సైడ్, సిలికాన్ వంటి అనేక విష రసాయనాలు ఉంటున్నాయని కె. వీరయ్య అన్నారు. ఈ విష రసాయనాలు  హుస్సేన్‌సాగర్ మరియు చెరువులలో  కలవటం వలన కాలుష్య సాగరాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
*“మానవ సేవే మాధవ సేవ”*, మానవ సమాజ మనుగడకే ముప్ప్పుగా పరిణమిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరముందని అన్నారు. నగరంలోని కొన్ని చెరువుల చుట్టు ప్రక్కల కాలనీలలోని డ్రైనేజి పైప్ లైన్లు ఆయా చెరువులలో కలిపేస్తున్నారని, ఫలితంగా చెరువులన్నీ కాలుష్య భరితమై దుర్గంధంతో దోమల కేంద్రాలుగా తయారయ్యాయని అన్నారు. వీటికి తోడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయరైన విగ్రహాల నిమజ్జనం ఫలితంగా కాలుష్యం మరింత పెరిగి  పరిసర కాలనీల ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తున్నాయాని చెప్పారు. వీటి కారణంగా  క్యాన్సర్, చర్మవ్యాధులకు గురికావలసి వస్తున్నదని అన్నారు.గత 10 సంవత్సరాల నుండి *“హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం”( హైదరాబాద్ జిందాబాద్)*  ఆధ్వర్యంలో  హెచఎండిఏ సహకారంతో  గ్రేటర్‌లోని 45 కాలనీలలో, అపార్ట్‌మెంట్‌లలో  మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నామని,పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను భక్తితో అందరం పూజిద్దాం అని అన్నారు.ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం *రామంతాపూర్ లో "శ్రీనిధి మహిళా ఫౌండేషన్" ఫౌండర్ చైర్మన్ బాపట్ల పుష్పలత మరియు ఫౌండేషన్ సభ్యులు, "ప్రజాసంకల్పం" ఫౌండర్ బాపట్ల కృష్ణమోహన్*  గత 10 సంవత్సరాలనుండి హైదరాబాద్ సిటిజెన్స్ ఫోరం (హైదరాబాద్ జిందాబాద్)  ఆధ్వర్యంలో హెచఎండిఏ సహకారంతో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హెచ్ఎండిఏ సూపరిండెంట్ ఇంజనీర్  అప్పారావు గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు ఎం.శ్రీనివాసరావు, మోహన్ నాయుడు, పి.శ్రీనివాసరావు, గోపాల్, మల్లం రమేష్, బాపట్ల కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.

'గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు_

*‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 03:

తెలంగాణలోని ములుగు జిల్లా, పాలంపేటలో గల ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీచేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్‌ఐ)  జారీ చేసిన 31.08.2026 నాటి ప్రకటన నెం.ఎస్‌.ఒ.4802(ఇ) ‘గెజిట్ ఆఫ్ ఇండియా’(ప్రత్యేక సంచిక) పార్ట్‌- IIలోని సెక్షన్‌ 3 ఉప సెక్షన్‌ (ii) కింద ప్రచురితమైంది. 
“ప్రాచీన కట్టడాలు-పురావస్తు ప్రదేశాలు-అవశేషాల చట్టం- 1958” (1958నాటి 24వ చట్టం)లోని సెక్షన్ 4, ఉప-సెక్షన్ (3) కింద సంక్రమించిన అధికారాల మేరకు ‘ఏఎస్‌ఐ’ ఈ ప్రకటన జారీ చేసింది. ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో ఈ ‘గొల్లల గుడి’ ఉంటుంది. ఇది తూర్పు ముఖంగా గల మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన ‘త్రికూటాలయం’గా కనిపిస్తుంది.గుడి ప్రహరీ శిల్పాలంకృతమై, పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో, ‘సునిశిత రంధ్రాల వల’ పనితనంతో ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అలరారుతోంది.ళఈ ప్రధాన గుడికి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అలంకృతమై ఉంటాయి. వీటికి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తాయి.
ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగాన మండపం గుండా మధ్యలో గల ప్రధాన మందిరానికి మార్గం ఉంటుంది. దీనికి ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశలలో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉంటాయి. ఆలయ కుడ్యాలపై కనిపించే వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది.

అధికారులు అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆచరించి చూపించిన సీఎండీ_

*మల్కరంలో విద్యుత్ సిబ్బంది భద్రతను టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ స్వయంగా తనిఖీ చేశారు*

*అధికారులు అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆచరించి చూపించిన సీఎండీ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 03:

అధికారులు అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆచరించి చూపించడం అని ఈ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ మరియు ఐఏఎస్ అధికారి జితేష్ వి. పాటిల్, "బస్తీ బటా" కార్యక్రమంలో భాగంగా, క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది అనుసరిస్తున్న భద్రతా పద్ధతులను తనిఖీ చేయడానికి చేవెళ్ల సెక్షన్ పరిధిలోని మల్కరం గ్రామంలోని ఒక విద్యుత్ స్తంభాన్ని స్వయంగా ఎక్కారు.తనిఖీని కేవలం కార్యాలయ సమీక్షకు పరిమితం చేయకుండా, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి మరియు విద్యుత్ లైన్లు, స్తంభాలపై పనిచేసేటప్పుడు అనుసరిస్తున్న భద్రతా విధానాలను వ్యక్తిగతంగా అంచనా వేయడానికి జితేష్ వి. పాటిల్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి అడుగుపెట్టారు.ప్రతి క్షేత్రస్థాయి కార్యకలాపంలో భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఉండాలని నొక్కి చెబుతూ, ఆయన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), భద్రతా పరికరాలు, పని పద్ధతులు మరియు ముందుజాగ్రత్త చర్యల వినియోగాన్ని తనిఖీ చేశారు.ఉద్యోగుల భద్రత విషయంలో ఎటువంటి రాజీకి తావులేదని సీఎండీ గట్టిగా స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ నిర్దేశించిన భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని, మినహాయింపు లేకుండా పీపీఈ (PPE)ని ఉపయోగించాలని ఆయన ఆదేశించారు.ఆయన స్వయంగా రంగంలోకి దిగిన తీరు సిబ్బందికి ఒక బలమైన సందేశాన్ని పంపింది. ఉన్నతాధికారులు తమ ఉద్యోగులకు అండగా నిలుస్తారని, వారి సవాళ్లను అర్థం చేసుకుంటారని మరియు వారి ప్రాణాలకు, భద్రతకు అన్నింటికన్నా అధిక ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.క్షేత్రస్థాయి తనిఖీలో వ్యక్తిగతంగా పాల్గొనడం ద్వారా, శ్రీ జితేష్ వి. పాటిల్ లాంటి అధికారులు క్షేత్రస్థాయిలో ఉండటం, ఆదర్శంగా నిలవడం మరియు ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అని నిరూపించారు.