Wednesday, August 21, 2024

*జవ్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు... హైకోర్టు నిరాకరణ*

*జవ్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు... హైకోర్టు నిరాకరణ*

హైదరాబాద్‌: జన్వాడ ఫాంహౌస్‌ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫాంహౌస్‌ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం..నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధి గురించి చెప్పాలని ఏఏజీ ధర్మాసనం సూచించింది. హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని కట్టడాలు కూల్చివేసింది, ప్రతి కూల్చివేతలోనూ నిబంధనలు పాటించారా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిని నిర్ణయించారా? అని ప్రశ్నించింది.హైదరాబాద్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని, ఆక్రమణలు ఎక్కువయ్యాయని ఏఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులను రక్షించడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకొని హైడ్రా పనిచేస్తుందన్నారు. స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చిన తర్వాతే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నామని తెలిపారు. ఈ పిటిషన్‌కు విచారణర్హత లేదని, కొట్టివేయాలని కోరారు.
2014లో జన్వాడలో ఫాంహౌస్‌ ఏర్పాటు చేశారని, 2019లో ప్రదీప్‌ ఫామ్‌హౌజ్‌ కొనుగోలు చేసినట్టు పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఫాంహౌస్‌ ఎందుకు కూల్చాలనుకుంటున్నారు? ఇన్నేళ్లుగా అధికారులకు ఎఫ్‌టీఎల్‌ గుర్తుకు రాలేదా? అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నోటిఫై చేస్తే ఆ వివరాలు ఇవ్వాలని సూచించింది. ప్రాథమికంగా నోటిఫై చేశామని.. తుది నివేదిక రూపొందించే పనిలో ఉన్నామని ఏఏజీ తెలిపారు. జన్వాడ ఫాంహౌస్‌ ఎఫ్‌టీఎల్‌కు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

Courtesy / Source by : 
*V.S. జీవన్*

No comments:

Post a Comment