Saturday, May 20, 2023

ఆ కాలేజీల ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దు

ఆ కాలేజీల ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దు.... హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు....!*

హైదరాబాద్: రాష్ట్రంలోని సుమారు 50 కాలేజీల్లో దోస్త్‌ (DOST)తో సంబంధం లేకుండా డిగ్రీ ప్రవేశాలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.పిటిషన్లు వేసిన కళాశాలల ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సులకు 2016-17 నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపడుతోంది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. అభిప్రాయాలు తెలుసుకోకుండా తమ కాలేజీల్లో ప్రవేశాలు, ఫీజులను నియంత్రించడం తగదని.. ప్రభుత్వం, యూనివర్సిటీలు చట్టపరిధి దాటి వ్యవహరిస్తున్నాయని వాదించాయి. వాదనలు విన్న హైకోర్టు గతంలో మాదిరిగానే నేరుగా కాలేజీలు ప్రవేశాలు జరపొచ్చునంటూ 2017లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ పిటిషన్‌ ఇప్పటికీ హైకోర్టులో పెండింగులోనే ఉంది. ఆ తర్వాత ఏటా ఉన్నత విద్యా మండలి దోస్త్ నోటిఫికేషన్ ఇస్తూనే ఉంది. సుమారు యాభైకి పైగా కాలేజీలు ప్రతి ఏడాది హైకోర్టును ఆశ్రయిస్తూ మధ్యంతర ఉత్తర్వులతో ప్రవేశాలు జరుపుతున్నాయి.

ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఇటీవలే దోస్త్ నోటిఫికేషన్ విడుదల కావడంతో సుమారు 50 ప్రైవేట్ కాలేజీలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించాయి. తమ అభ్యంతరాలు అలాగే ఉన్నాయని.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని కాలేజీల యాజమాన్యాలు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. ఏటా పిటిషన్లు వేసి మధ్యంతర ఉత్తర్వులతో ప్రవేశాలు చేస్తున్నామని.. కేసులు పెండింగులోనే ఉన్నాయని కాలేజీ యాజమాన్యాల తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషన్లు వేసిన కాలేజీల్లో గతంలో మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా ప్రవేశాలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై పెండింగులో ఉన్న పిటిషన్లన్నీ తమ ముందుంచాలని ఉన్నత విద్యా మండలిని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఉన్నత విద్యా మండలిని, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను ఆదేశిస్తూ విచారణను జూన్ 15కి వాయిదా వేసింది

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment