Friday, May 12, 2023

ఆ ఐదుగుర్నీ కస్టడీకి ఇవ్వండి

*ఆ ఐదుగుర్నీ కస్టడీకి ఇవ్వండి.. కోర్టులో ఈడీ పిటిషన్‌*

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

*_టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు._*

*_జైలులోనే ప్రశ్నిస్తాం.._*
రేణుక, డాక్యానాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, షమీమ్‌ల నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతించాలని కోరారు. చంచల్‌గూడ జైలులోనే నిందితులను ప్రశ్నించడానికి అనుమతించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు జైలు పర్యవేక్షకుడిని ఆదేశించాలని కోరడంతో నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 

*_కౌంటర్ పిటిషన్ అనంతరం.._*
నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశాక వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈడీ అధికారులు ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్ గూడ జైల్లో విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అదేవిధంగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రాంచంద్రన్, అధికారులు సత్యనారాయణ, శంకరలక్ష్మిలను కార్యాలయానికి పిలిచి వాళ్ల వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. 
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు రేణుక, రమేష్, ప్రశాంత్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, నీలేష్ నాయక్‌లతో పాటు ఇతర నిందితులు కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సిట్ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత నిందితుల బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 27మందిని అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment