Sunday, September 12, 2021

చిన్నారిపై ‘హ‌త్యా’చార ఘ‌ట‌న‌పై నిర‌స‌న‌ల వెల్లువ‌

హైదరాబాద్ : 12/09/2021

చిన్నారిపై ‘హ‌త్యా’చార ఘ‌ట‌న‌పై నిర‌స‌న‌ల వెల్లువ‌

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

హైద‌రాబాద్ సైదాబాద్‌లోని సింగ‌రేణి కాల‌నీలో అత్యాచారం, హ‌త్య‌కు గురైన ఆరేళ్ల‌ చిన్నారి చైత్ర ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి మ‌ర‌ణానికి నివాళులు ఆర్పిస్తూ స‌ర్వ‌త్రా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చైత్ర‌పై అమానుషానికి పాల్ప‌డిన నిందితుడిని కూడా దిశ నిందితుల‌లాగే ఎన్‌కౌంట‌ర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కేసు ద‌ర్యాప్తును పోలీసులు సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌ని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

అటు ప్ర‌ధాన‌ మీడియా తీరుపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సినీ న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయితే నిమిషానికోసారి బ్రేకింగ్ న‌డిపిస్తున్న ఛానెళ్లు, పెద్ద పెద్ద క‌థ‌నాలు రాస్తున్న పత్రిక‌లు, చిన్నారికి జ‌రిగిన అన్యాయంపై మాత్రం స్ప‌దించ‌క‌పోవ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డుతున్నారు. సెన్సేష‌న్ క‌థ‌నాలే త‌ప్ప‌, ఇలాంటి ఘోరాల‌ను ప్ర‌సారం చేయ‌రా అని నిల‌దీస్తున్నారు. RIP తెలుగు మీడియా అంటూ పోస్టులు పెడుతున్నారు.

నల్గొండ జిల్లాకు చెందిన రాజు నాయ‌క్ దంపతుల కుమార్తె చైత్రను.. వారి ఇంటికి స‌మీపంలో ఉండే రాజు మాయ‌మాట‌లు చెప్పి, బ‌ల‌వంతంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత ఆమెపై లైంగిక‌దాడి చేసి చంపేశాడు. అనంత‌రం ఆమె శ‌వాన్ని పరుపులో మూట కట్టి ప‌రార‌య్యాడు. తొలుత చిన్నారిని ఎవ‌రైనా కిడ్నాప్ చేసి ఉంటారేమోన‌ని కుటుంబ స‌భ్యులు అనుమానించారు. కానీ నిందితుడు రాజు మ‌ద్యం సేవించి రావ‌డం, అప్ప‌టికే భార్యా పిల్ల‌ల‌ను ఇంట్లో నుంచి వెళ్ల‌గొట్టి ఉండ‌టంతో.. అత‌నిపై అనుమానం వ‌చ్చింది. తాళం ప‌గ‌ల‌గొట్టి చూడ‌గా, చైత్ర ప‌రుపులో విగ‌త‌జీవిగా ప‌డి ఉంది. పోలీసులు ఆమె మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకోబోగా, స్థానికులు అడ్డుకున్నారు. నిందితుడిని ఎన్‌కౌంట‌ర్ చేశాకే పోస్ట్‌మార్టం చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈక్ర‌మంలో పోలీసులు, స్థానికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ కూడా చెలరేగి, ప‌లువురు గాయ‌ప‌డ్డారు.


No comments:

Post a Comment