Sunday, July 23, 2023

_మణిపూర్ లో మరో ఘోరం.... స్వాతంత్ర సమరయోధుని భార్య సజీవ దహనం....!

*మణిపూర్ లో మరో ఘోరం.... స్వాతంత్ర సమరయోధుని భార్య సజీవ దహనం....!*

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur)లో మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఓ సాయుధ మూక సజీవ దహనం చేసిన ఘటన చోటు చేసుకొంది.ఈ దారుణం కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామంలో జరిగింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్‌ చురాచాంద్‌ సింగ్‌ భార్య సోరోకైబామ్‌ ఇబెటోంబి(80)ని సజీవ దహనం చేశారు. చురచాంద్‌ సింగ్‌.. గతంలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలామ్‌ నుంచి సత్కారం అందుకొన్నారు. ఈ ఘటన మే 28 తెల్లవారుజామున చోటు చేసుకొన్నట్లు ఆంగ్లపత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఆ రోజు గ్రామంలో భారీగా హింస చోటు చేసుకొంది. కాల్పులు కూడా జరిగాయి. 80ఏళ్ల ఇబెటోంబి ఇంట్లో ఉండగా.. సాయుధ దుండగులు ఆ ఇంటి బయట గడియ పెట్టారు. అనంతరం ఆ ఇంటికి నిప్పుపెట్టారు. ఆమెను రక్షించేందుకు కుటుంబీకులు అక్కడికి చేరుకొనేసరికే.. ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈ విషయాన్ని ఇబెటోంబి మనవడు ప్రేమ్‌కాంత వెల్లడించాడు. ఆ సమయంలో తాను కూడా ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొన్నట్లు వెల్లడించాడు. తమపై కూడా కాల్పులు జరిగాయని.. కొన్ని తూటాలు చెయ్యి, కాలులో దూసుకుపోయాయని చెప్పాడు. ''మాపై కాల్పులు జరగడాన్ని గమనించిన మా మామ్మ ముందు తమను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరింది. అయితే.. ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయింది'' అని అతడు గుర్తుకు తెచ్చుకొన్నాడు.ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం రాష్ట్రంలో హింస ప్రారంభానికి ముందు చాలా సుందరంగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామంలో కాలిన గృహాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. చాలా ఇళ్ల గోడలపై తూటాలు దర్శనమిస్తున్నాయి. కుకీ-మైతేయ్‌ ఘర్షణల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఇబెటోంబి అస్థికలు ఇప్పటికీ అక్కడే పడి ఉన్నట్లు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ గ్రామం నుంచి ప్రజలు ప్రాణాలు దక్కించుకొనేందుకు పారిపోయారు. ప్రస్తుతం ఇది నిర్మానుష్యంగా మారిపోయింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment