Thursday, December 1, 2022

గారాలపట్టి కటికనేల నిద్ర__తండ్రి తట్టుకోగలడా ??

*_అరెస్టులు ఎప్పుడు.?_*
_● గారాలపట్టి కటికనేల నిద్ర_
_● తండ్రి తట్టుకోగలడా.?_
_● గులాబీ దండుకు ఇబ్బందులే.!_
_● ఎదుర్కొనే పనిలో బిగ్ బాస్_
_● హీనమైన ఎత్తుగడ -కల్వకుంట్ల కవిత_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_ఎంత కష్టం వచ్చిపడింది. చూస్తుండగానే 'లిక్కర్ స్కాం' బద్దలయింది. రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు. ఈమధ్య కాలంలో ఆ కుటుంబం ఎదుర్కొంటున్న అతి పెద్ద గంభీరమైన సమస్య ఇదే.! పార్టీ శ్రేణులన్నీ ఒక్కసారిగా మూగనోము పట్టడం. ఎలా ఎదుర్కోవాలనే విషయంలో గందరగోళం. ఇక జరగబోయే న్యాయ ప్రక్రియ అంతా లాంఛనమే.! అదే ఎప్పుడు..? ఏ విధంగా జరగబోతుందనేదే ఆసక్తికరం._* 

*_అసలేం జరిగింది.?_*
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ  కవిత పేరును ఈడీ  అధికారులు ప్రస్తావించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు.  ఆమ్​ ఆద్మీ పార్టీకి కమీషన్ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అత్యధికంగా మార్జిన్ పెట్టారని అందులో ఆరోపించారు. ఆమ్​ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ వందకోట్ల ముడుపులు తీసుకున్నట్లు చెప్పారు.

*_సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు_*
విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు అందాయని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ తెలిపింది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారని..ఆ 10 ఫోన్ల ఈఎంఐఈ నెంబర్లను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ప్రస్తావించారు.

*_ఆధారాలు దొరకకుండా 153 ఫోన్లు ధ్వంసం:_*
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 36 మంది నిందితులు/అనుమానితులు ఉన్నారని అమిత్​ అరోరా రిమాండ్​ రిపోర్టులో ఈడీ పేర్కొంది. వారందరూ దాదాపు 170 ఫోన్లను వినియోగించారని.. అయితే వాటిలో కేవలం 17 ఫోన్లే తమకు దొరికాయని ఈడీ తెలిపింది.  అమిత్​ అరోరా వాడిన 11 ఫోన్లను, ఎమ్మెల్సీ కవిత వాడిన 10 ఫోన్లను ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ కేసులో ధ్వంసమైన  153 ఫోన్ల విలువ దాదాపు రూ.1.38 కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేసింది. 

*_ఎవరీ అమిత్​ అరోరా ?_*
గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుల్లో అమిత్ ఒకరు.ఇవాళ ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసింది. సిసోడియాకు అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా అత్యంత సన్నిహితులు కాగా.. వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.   

*_సీబీఐ  ఛార్జ్షీట్ లో ఏముంది ?_*
మరోవైపు ఈ కేసులో సీబీఐ తొలి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. సుమారు 10 వేల పేజీల ఛార్జ్షీట్ ను రౌస్‌ అవెన్యూ కోర్టులో అధికారులు దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో ఎ1 గా కుల్దీప్ సింగ్, ఎ2 గా నరేంద్ర సింగ్, ఎ3గా విజయ్ నాయర్, ఎ4 గా అభిషేక్ బోయిన పల్లి ఉన్నారు. ఈ కేసులో మొదట సీబీఐ విచారణ జరపగా.. తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. విజయ్ నాయర్, అభిషేక్ రావుకు ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  దానిపై  స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

*_అరెస్టులు ఎప్పుడు.?_*
కొన్ని కేసులలో రిమాండ్ రిపోర్టు ఆధారంగా అరెస్టులు జరుగుతాయి. ఇక్కడ మాత్రం లావాదేవీలు కీలకంగా మారనున్నాయి. వందకోట్ల ముడుపుల పంచాయతీలో ఎవరికి.? ఎంత.? ఏవిధంగా..? అన్నదే ముఖ్యం. మొత్తం 36మంది చుట్టూ తిరుగుతున్న ఈ లిక్కర్ స్కాంలో మరికొద్ది రోజుల్లో మరికొన్ని అరెస్టులు ఉండవచ్చు. అందులో కవిత ఉంటుందా.? లేదా.? అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది.

బాక్స్:

*ప్లాష్.. ప్లాష్.. ప్లాష్..*

*_హీనమైన ఎత్తుగడ -కల్వకుంట్ల కవిత_*
తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐలు కేసులు పెట్టడం భాజపా హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దిల్లీ మద్యం కేసు రిమాండ్‌ రిపోర్టులో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొంత మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని నివాసం వద్ద గురువారం ఉదయం మీడియాతో ఆమె మాట్లాడారు. 

‘‘దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతోంది. 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో భాజపా అధికారంలోకి వచ్చిన విషయాన్ని గమనిస్తున్నాం. మోదీ కంటే ముందు ఈడీ ఆయా రాష్ట్రాలకు వెళ్లడాన్ని చూస్తున్నాం. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఉన్నందున మోదీ కంటే ముందు ఈడీ ఇక్కడికి వచ్చింది. అది నార్మల్‌. నాపై కావొచ్చు.. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు హీనమైన ఎత్తుగడ. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి విచారణకైనా మేం సిద్ధం. 

ఆయా ఏజెన్సీలు వచ్చి అడిగితే తప్పకుండా జవాబు ఇస్తాం. అంతేకానీ మీడియాలో లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతారనే విషయాన్ని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పంథాని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనమేం చేస్తామో చెప్పుకొని గెలవాలి తప్ప.. ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదు. అత్యంత చైతన్యవంతమైన ప్రజలు ఉన్న తెలంగాణలో మీకు అది సాధ్యపడదు. కాదు కూడదు అని జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. ఏమౌతుంది.. భయపడేదేముంది. ప్రజలు మా వెంట ఉన్నంతకాలం.. ప్రజల కోసం తెరాస చిత్తశుద్ధితో పనిచేస్తున్నంతకాలం ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ రాదు’’ అని కవిత వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment