Thursday, December 29, 2022

సరైన సమయంలో సమాధానం.....బిఎల్ సంతోష్


*ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలపై బీఎల్‌ సంతోష్‌*
*ఇక్కడి డబ్బు ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకు వెళ్తోంది*
*అవసరం* *వచ్చినప్పుడు బహిర్గతం చేస్తామని వెల్లడి*
*తెలంగాణ తల్లికి రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ధ్వజం*
*భాజపా 'మిషన్‌ 90' సమావేశానికి హాజరు*

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ పార్టీ నేతలతో అన్నారు. రాష్ట్రంలో 90 అసెంబ్లీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో 'మిషన్‌ 90' పేరుతో శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో గురువారం జరిగిన భాజపా అసెంబ్లీ విస్తారక్‌లు, ప్రభారీలు, పాలక్‌లు, కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడే జరిగిన లోక్‌సభ నియోజకవర్గ విస్తారక్‌ల రెండోరోజు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మిషన్‌ 90 సమావేశంలో ఎమ్మెల్యేలకు ఎర కేసుపై, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆరు గంటలకుపైగా సాగిన ఈ సమావేశంలో సంతోష్‌ ముగింపు ప్రసంగం చేశారు. 'సాధారణ ప్రజలకు అంతగా తెలియని నా పేరును ఇక్కడి ప్రభుత్వం ప్రతి ఓటరుకూ తెలిసేలా చేసింది. నాపై చేసిన ఆరోపణలకు సరైన సమయంలో సమాధానం చెబుతా' అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గతంలో తాను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి ఒకరిద్దరు పార్టీ కార్యకర్తలు మాత్రమే వచ్చేవారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని కారణంగా ఈరోజు వందలాది మంది వచ్చారని అన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ''రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తోంది. ఇక్కడి డబ్బును ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకు తీసుకెళ్తున్నారు. ఏ రాష్ట్రంలో, ఏ పార్టీకి ఎంతెంత ఇచ్చింది మాకు తెలుసు. ఇక్కణ్నుంచి ఇతర పార్టీలకు డబ్బులు పంపిన వారి విషయాన్ని అవసరం వచ్చినప్పుడు బహిర్గతం చేస్తాం.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment