Tuesday, May 10, 2022

దేశద్రోహం కేసుల విషయంలో కేంద్రంపై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం

సెక్షన్ 124ఏ కింద కేసులు నమోదు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఎందుకు ఆదేశాలు జారీ చేయడం లేదంటూ ప్రశ్నించింది.

దేశద్రోహ చట్టానికి గల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఇటీవల పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం సోమవారం తెలిపింది. ఈ క్రమంలో అప్పటివరకు కేసుల నిలిపివేత సాధ్యాసాధ్యాలపై సర్వోన్నత న్యాయ స్థానం ఆరా తీసింది. కేంద్రం తుది నిర్ణయం తీసుకునేలోపు పౌరుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. దేశద్రోహం చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని ఆదేశించింది

ఈ పునఃపరిశీలన ప్రక్రియను 3 లేదా 4 నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులపై ఏ విధంగా ముందుకెళ్లాలని కేంద్రం అనుకుటుందోననే విషయాన్ని తమకు తెలపాలని కోరింది. దీంతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత తమ స్పందనను బుధవారం తెలియజేయనున్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు.కేంద్రం తరపున విచారణకు హాజరైన ఆయన.. కేసుల నమోదును తాత్కాలికంగా నిలిపివేయడంపై చర్చిస్తామని కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది.

రాజద్రోహం చట్టంపై పునరాలోచన చేస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం సోమవారం తెలియజేసింది. అంతకు ముందు సమర్పించిన అఫిడవిట్​లో ఈ చట్టాన్ని కేంద్రం సమర్థించింది. తాజాగా అనూహ్యంగా ఈ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. ఈ కేసులపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతున్న నేపథ్యంలో కేంద్రం తన స్పందనను తెలియజేసింది. పునఃపరిశీలన ప్రక్రియ ముగిసేవరకు వ్యాజ్యాలపై ఎలాంటి విచారణలు చేపట్టవద్దని అఫిడవిట్​లో పేర్కొంది.

No comments:

Post a Comment