Monday, May 2, 2022

ఓయూ గులాబీ పార్టీ గడినా..? విశ్వవిద్యాలయమా ?


ఓయూ గులాబీ పార్టీ గడినా..? విశ్వవిద్యాలయమా ?


”విద్యార్ధి నిరుద్యోగుల సమస్యల పై చర్చించాలానే గొప్ప ఉద్దేశంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రావాలనుకుంటే, ఉస్మానియా యూనివర్శిటీకీ చెందిన అధికారులు టీఆర్ఎస్ గులాములు మాదిరి పని చేస్తూ మీటింగ్ కు అనుమతిని నిరాకరించడం ఒక సిగ్గుమాలిన చర్య” అని తీవ్రంగా విమర్శించారు ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్., ఈ మేరకు గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

”రాహుల్ గాంధీ మే 6 రైతు సంఘర్షణ సభలో పాల్గోవడానికి వరంగల్ వస్తున్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలతో పాటు అత్యంత కీలకమైన సమస్య విద్యార్ధి నిరుద్యోగ సమస్య. కాబట్టి 7వ తేదిన విద్యార్ధి నిరుద్యోగుల గుండె గోడును తెలుసుకోవడం కోసం చైతన్యానికి నెలవైన ఉద్యమాలకు పునాదైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్ధులతో కలసి వారి సమస్యలని పరిష్కరించడం కోసం ఏ విధంగా పనిచేయాలనే గొప్ప ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకోవాలనే భావిస్తే .. ఉస్మానియా యూనివర్శిటీకీ చెందిన అధికారులు టీఆర్ఎస్ గులాములు మాదిరి పని చేస్తూ మీటింగ్ కు అనుమతిని నిరాకరించడం జరిగింది. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి వుండదు. యూనివర్శిటీలు ప్రజాస్వామ్య చర్చ చేసే కేంద్రాలు, ప్రశ్నకు పునాదులు ,చైతన్యానికి వేదికలు .. అలాంటి చోటికి ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే రానీయకుండా దుర్మార్గమైన చర్యకు పాల్పడుతున్నారు” మండిపడ్డారు దాసోజు.

”అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించిన విద్యార్ధులు, కాంగ్రెస్ పార్టీ కి చెందిన కార్యకర్తలని అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. గులాబి పార్టీ గడినా విశ్వవిద్యాలయమా ? అని ప్రశ్నించిన విద్యార్ధులని ఉస్మానియా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి పెట్టి నిర్బంధ పరిస్థితి కల్పిస్తున్నారు. అరెస్టయిన వారిని పరామర్శించడానికి వెళ్ళిన జగ్గారెడ్డి లాంటి నాయకులని అరెస్ట్ చేశారు. ఈ చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు సూటి ప్రశ్న. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ? ఎమ్మెల్యేలందరినీ ముట్టడి చేస్తే ఎంతమందినని అరెస్ట్ చేస్తారు ? తెలంగాణలో వున్న జైళ్ళు, పోలీస్ స్టేషన్ సరిపోవు” అని పేర్కొన్నారు దాసోజు.,

”ఓయూకి రాహుల్ గాంధీ వస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది ? ఉస్మానియా నిషేధిత ప్రాంతం కాదు కదా ? రాహుల్ గాంధీ నిషేధిత సంస్థకు చెందిన నాయకుడు కాదు కదా ? మరెందుకు ఇలా అరెస్టులు చేస్తున్నారు ? రాహుల్ గాంధీ వస్తే కేసీఆర్ డొల్లతనం భయటపడుతుంది. తెలంగాణ విద్యార్ధి, నిరుద్యోగ సమస్యలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేసీఆర్ అసలు రంగు బయటపడుతుందనే భయంతో కేసీఆర్ , రాహుల్ గాంధీని రానిస్తాలేదు. కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి.
నిజం నిప్పులాంటిది

రాహుల గాంధీని మీటింగ్ కు రానివ్వనంత మాత్రాన ఆ సమస్యలు ప్రజలకు తెలియవు అని అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు భ్రమపడాల్సిందే.” అని పేర్కొన్నారు.

”తెలంగాణ ద్రోహులని టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఓయు కి పోవచ్చు . కానీ కడుపు కోసుకొని జన్మనిచ్చినట్లు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ బిడ్డ, కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్రం ఇవ్వడంలో  కీలక పాత్ర పోషించిన నాటి పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ఓయు కీ వెళ్తానంటే .. అడ్డుకుంటున్నారు. కడుపుకి అన్నం తింటున్నారా ? గడ్డితింటున్నారా ? అని ప్రశ్నించారు దాసోజు.

విద్యార్ధి నిరుద్యోగ సమస్యని పరిష్కరించరు. చివరికి సమస్యలు వింటానని వచ్చిన రాహుల్ గాంధీ కి సమస్యలు కూడా చెప్పుకోనివ్వరా ? ఇది కల్వకుంట్ల ఎస్టేటా ? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా ? కేసీఆర్ రాజ్యంగం నడుస్తుందా ? ప్రజాస్వామ్యయుత మీటింగ్ పెట్టుకుంటామంటే దాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారు ? కేసీఆర్ ని జంతర్ మంతర్ కు రానియ్యనని బిజేపీ,. కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నట్లయితే ఢిల్లీ లో కేసీఆర్ డ్రామా చేసుండేవారా ? మీకో న్యాయం ? కాంగ్రెస్ పార్టీకి ఓ న్యాయమా ? అని ప్రశ్నించారు దాసోజు

”టీఆర్ఎస్ ప్రభుత్వానికి నైతికత, నిజాయితీ వుంటే , విద్యార్ధి నిరుద్యోగ సమస్యలు లేవని మీరు చెబుతుంటే కేటీఆర్ , హరీష్ రావు ఆర్ట్స్ కాలేజీ ముందు కూర్చుందాం రండి.. చర్చిద్దాం. సమస్యలు లేవని మీరు నిరూపించినట్లయితే చొక్కాలు విప్పేసి బయటికి వచ్చేస్తాం.. ఇప్పటికైనా రాజ్యాంగాన్ని గౌరవించి రాహుల్ గాంధీ మీటింగ్ కి అనుమతి ఇవ్వాలి. విద్యార్ధి నిరుద్యుగుల సమస్యలపై చర్చ జరిగే వెసులుబాటు కల్పించాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

ఈ మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ సినియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి పాల్గొన్నారు.

No comments:

Post a Comment