Saturday, August 19, 2023

ప్రతిపక్షాలకు ఈ సారి సినిమా చూపిస్తాం.... మంత్రి KTR....!

*ప్రతిపక్షాలకు ఈ సారి సినిమా చూపిస్తాం.... మంత్రి KTR....!*

హైదరాబాద్: ఇందిరా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. దక్షిణ భారత దేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్‌ (వీఎస్టీ-ఇందిరా పార్క్‌)ను మంత్రి ఇవాళ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ప్రారంభించిన ఫ్లైఓవర్లలో ఇది 36వదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి పేరును ఈ స్టీల్‌ బ్రిడ్జ్‌కు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు చెప్పారు. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, అప్పడర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామని తెలిపారు.

మరోవైపు, రాష్ట్రంలో కొంతమంది మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతిపక్షాలకు 2023లోనే సినిమా చూపిస్తామన్నారు.

రూ.450 కోట్ల వ్యయంతో

మొత్తం 2.63 కి.మీల పొడవైన వీఎస్టీ-ఇందిరా పార్క్‌ వంతెనను రూ.450 కోట్ల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద జీహెచ్‌ఎంసీ నిర్మించింది. రాష్ట్రంలోనే తొలి సారిగా మెట్రో బ్రిడ్జిపై నుంచి స్టీల్‌ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ స్టీల్ ఫ్లై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) వలన రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇందిరా పార్క్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్ లింగంపల్లి వీఎస్టీ జంక్షన్ వరకు సులభంగా వెళ్లొచ్చు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment