Tuesday, August 8, 2023

_మానవ హక్కుల కమిషన్‌ పేరుతో బెదిరింపులు_

*_మానవ హక్కుల కమిషన్‌ పేరుతో బెదిరింపులు_*
_# తెలంగాణ రాష్ట్రంలో 48 నకిలీ కమీషన్ లు_
_# పోలీసులు జర చూపేయండి_
_# ఎస్ఐకి ఝలక్.!_
_# నేమ్ ప్లేట్లు, కారుపై లైట్లు పెట్టుకు తిరగటం నేరం_
_# జిల్లాల్లో మానవహక్కుల సంఘ శాఖలు లేవ్_
_# పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదని ఆరోపణలు_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_‘‘వేగంగా వచ్చిన ఇన్నోవా కారుకు బ్రేక్‌ పడింది. అందులోంచి తెల్లని ఖద్దరు చొక్కా.. చేతిలో బ్రాస్‌లెట్‌ ధరించిన వ్యక్తి దిగాడు. ఆయనతో పాటు ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు పురుషులు దిగారు. చకచకా కేపీహెచ్‌బీలోని ఓ గడియారం దుకాణంలోకొచ్చారు. ఇక్కడ జోగు సతీష్‌ ఎవరని అడిగారు. అక్కడున్న వ్యక్తి తానేనంటూ పరిచయం చేసుకున్నాడు.’’ నా పేరు కాశీ సతీష్‌, (వాస్తవానికి అతని సంస్థ మానవ హక్కుల ఫౌండేషన్‌) ప్రభుత్వ రంగ సంస్థ ‘రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) అధ్యక్షుడిని, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శినని చెప్పుకొచ్చాడు._*

*_ఎలా బెదిరిస్తున్నాడో.._*
‘చట్టబద్ధత కలిగిన కమిషన్‌ మాది. విడాకుల కోసం మీ భార్యాభర్తలు కోర్టుకు వెళ్లారని తెలిసింది. నీ భార్య కొత్తగూడెం నుంచి ఫిర్యాదు చేస్తే వచ్చాం. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాం. నువ్వే మా ఆఫీసుకొస్తవా.. లేదా మీ ఇంటికి మమ్మల్నే రమ్మంటావా...అని కాశీ సతీష్‌ తన స్వరాన్ని పెంచాడు. ‘నువ్వు చదువుకున్నొడివి కదా.. చట్టాల గురించి నీకు తెలియదా.. సెటిల్‌మెంట్‌ చేసుకో.. నీ దుకాణంలో మస్తు గిరాకీ ఉంది. బాగానే సంపాదిస్తున్నవ్‌.. అన్ని తెలుసుకొనే వచ్చిన’.. అని దబాయించాడు. నువ్వు మాట వింటే సరే.. నా దగ్గర రివాల్వర్‌ కూడా ఉంది’.. అని కాశీ సతీష్‌ అనడం కొసమెరుపు.

*_ఎస్ఐకి ఝలక్.!_*
బాధితుడు స్థానిక కేపీహెచ్‌బీ ఠాణా ఎస్సైతో ఫోన్‌ చేయిస్తే నేను దిల్లీకి వచ్చిన, వీఐపీలతో ఉన్నానని ఫోన్‌ కట్‌ చేశాడని బాధితుడు తెలిపారు. కాశీ సతీష్‌తో పాటు కొప్పుల నాగమణి, కొండె చంద్రమౌళి ఇతరులు ఉన్నారు. బాధితుడు   రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ), రాచకొండ పోలీసు కమిషనర్‌, రాష్ట్ర డీజీపీలకు మంగళవారం ఫిర్యాదు చేశాడు.

*_నకిలీల హడావుడి_*
తెలంగాణలో మొత్తం 48 నకిలీ మానవ హక్కుల కమీషన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ కమీషన్లలో జిల్లాల వారీగా ఐడి కార్డులు ఇవ్వడానికి రూ. 5వేల నుంచి 15 వేల వరకు రాష్ట్ర నకిలీ నాయకులు గుంచినట్లు తెలుస్తోంది.

*_రాష్ట్ర కమీషన్ ఒక్కటే.!_*
జాతీయ మానవహక్కుల కమిషన్, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లను మాత్రమే ఆ,యా ప్రభుత్వాలు చైర్మన్, సభ్యులను నియమించటం జరుగుతుంది. అంతే తప్ప జిల్లాస్థాయిలో ఎక్కడా ప్రభుత్వం కమీషన్లను ఏర్పాటు చేయలేదు. అవన్నీ సామాజిక సేవా పేరుతో రిజిస్టర్ చేయించుకొని ప్రైవేటు సెటిల్ మెంట్లకు తెగబడుతున్నారు. 

*_జిల్లా కేంద్రాలలో.._*
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల కేంద్రాలలో నకిలీ మానవ హక్కుల కమీషన్లు ఏర్పాటు అయ్యాయి. సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్లు చెప్పుకుంటూ పోలీస్టేషన్ కు వచ్చి సెటిల్ మెంట్లు మాట్లాడే స్థాయికి వీరు చేరారు. ఖమ్మం అర్బన్ ప్రాంతంలో 'పొదిల' అని కారుపై ఉండే ఓ వ్యక్తి కూడా ఇటీవలే ఒక వివాహ సంఘటనలో పోలీస్టేషన్ వద్ద కమీషన్ పేరుతో ప్లేట్ రాయించుకొని హల్చల్ చేయటం గమనార్హం.

*_నేమ్ ప్లేట్లు, కారుపై లైట్లు పెట్టుకు తిరగటం నేరం_*
కారుపై ప్రొటోకాల్ లైట్లు, మానవహక్కుల కమిషన్ అంటూ బోర్డులు పెట్టడం రవాణా చుట్టూ ప్రకారం నేరం. ఇలాంటి వారిపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదనే ఆరోపణలున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment