Saturday, April 8, 2023

వందేభారత్ రైలును ప్రారంభించిన.... ప్రధాని మోదీ...!

*సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించిన.... ప్రధాని మోదీ...!*

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య నడవనున్న ఈ సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం ప్రధాని నరేంద్రమోదీ 10వ నంబర్‌ ప్లాట్‌ఫాంపై జెండా ఊపి ప్రారంభించారు.ప్రారంభోత్సవంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఉన్నారు.

ఈ రైలులో కొంతమంది విద్యార్థులు నల్గొండ వరకు ప్రయాణిస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని.. నేరుగా వందేభారత్‌ రైలు ఎక్కారు. అక్కడ ఉన్న విద్యార్థులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం జెండా ఊపి రైలును ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం చేర్యాల పెయింటింగ్‌ను రైల్వే శాఖ మంత్రి ప్రధానికి అందించారు.

అంతకుముందు ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమర్‌ స్వాగతం పలికారు. బేగంపేట నుంచి ఎస్పీజీ దళాల ప్రత్యేక కాన్యాయ్‌ పర్యవేక్షణలో మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్‌ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందిస్తుంది.ఈ రైలులో టికెట్ల ధరలను పరిశీలిస్తే..

సికింద్రాబాద్‌ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛార్జీలు ఇలా..

ఛైర్‌ కార్‌

• సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.470

• సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865

• సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.1075

• సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.1270

• సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.1680

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ఛార్జీలు

• సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900

• సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620

• సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045

• సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455,

• సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080... ఈ ఛార్జీలకు టికెట్‌ బుకింగ్‌ కన్వీనియెన్స్‌ ఛార్జీలు అదనంగా ఉంటాయి.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment