Saturday, April 22, 2023

రాజీపడటం నారక్తంలో లేదు భయం నా ఒంట్లో లేదు.... రేవంత్!

*రాజీపడటం నారక్తంలో లేదు భయం నా ఒంట్లో లేదు.... రేవంత్!*

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లాలూచీ తన రక్తంలోనే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తుదిశ్వాస విడిచే వరకు కేసీఆర్‌తో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్‌ రూ.25 కోట్లు ఇచ్చారంటూ భాజపా నేత ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడాన్ని రేవంత్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు చార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేశారు. 'ఒక వేళ మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్‌ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. నా కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది' అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

అనంతరం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. భారాస, భాజపాలు భారీగా డబ్బులతో బరిలోకి దిగితే.. కాంగ్రెస్‌ మాత్రం నిజాయితీగా పని చేసే అభ్యర్థి పాల్వాయి స్రవంతిని పోటీలో నిలిపిందని గుర్తు చేశారు. '' మునుగోడు ఉపఎన్నిక కోసం భారాస, భాజపా భారీగా డబ్బులు ఖర్చు చేశాయి. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అమ్ముడు పోయిందని ఈటల ఆరోపించారు. కేసీఆర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ, పాల్వాయి స్రవంతి రూ.25 కోట్లు తీసుకున్నట్లు విమర్శించారు. నా నిజాయితీని శంకిస్తే మంచిది కాదు. నా కళ్లలో నీరు రప్పించావు. కేసీఆర్‌ సర్వం దారబోసినా రేవంత్‌ రెడ్డిని కొనలేరు. రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.'' అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment