Friday, April 14, 2023

జులై 1 నుంచి... అమర్ నాథ్ యాత్ర

జులై 1 నుంచి... అమర్ నాథ్ యాత్ర*

జమ్మూ: దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జులై 1 నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అధికారులు  వెల్లడించారు.ఏప్రిల్‌ 17 నుంచి యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) మనోజ్‌ సిన్హా అధ్యక్షతన రాజ్‌భవన్‌లో జరిగిన శ్రీ అమరనాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు 44వ సమావేశంలో యాత్ర షెడ్యూలును నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎల్జీ షెడ్యూలును ప్రకటిస్తూ.. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, యాత్ర సాఫీగా సాగేలా చూస్తామన్నారు.

యాత్రికులకు వైద్యసేవలు, టెలికాం సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇటు అనంతనాగ్‌ జిల్లాలోని పెహల్గాం ట్రాక్‌ నుంచి, అటు గాందర్‌బల్‌ జిల్లా బల్తాల్‌ నుంచి యాత్ర సమాంతరంగా మొదలవుతుందన్నారు. భక్తుల కోసం ఉదయం, సాయంత్రం జరిగే ప్రార్థనల ప్రత్యక్ష ప్రసారానికి బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాలను యాప్‌లో చూడవచ్చు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment