Saturday, October 21, 2023

పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం... సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర...!

*పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం... సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర...!*

రాయదుర్గం : పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిగా సిబ్బంది విధుల పట్ల దూరంకితం కావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పిలుపు ఇచ్చారు.పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా శనివారం కమిషనరేట్ ఆవరణలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రత్యేక పోలీస్ బలగాలు పోలీసు లాంఛనాలతో అమరవీరులకు గౌరవ వందనం చేసి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను కమిషనర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 189 మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసినట్లు తెలిపారు. దేశం సమాజం, భావితరాల కోసం పోలీసులు ప్రాణాలు పణ్ణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తుంటారని చెప్పారు. వివిధ సమస్యలు, కష్టాలతో తమ వద్దకు వచ్చే బాధితులకు పోలీసులు న్యాయం చేయాలనిసూచించారు. అలా సేవలందించే పోలీసులు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు సీపీ అవినాష్ మహంతి, జాయింట్ సీపీ నారాయణ నాయక్, డిసిపిలు తదితర పోలీసు అధికారులు అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. డీసీపీలు శ్రీనివాసరావు, శబరీష్, సందీప్, జగదీశ్వర్ రెడ్డి, నారాయణరెడ్డి, ఎల్ సీ నాయక్, రవి చందన్ రెడ్డి, ఏడీసీపీలు షమీర్ ,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment