Friday, June 19, 2020

కరోనా తెలంగాణ

హైదరాబాద్ : 19/06/2020

*కరోనాపై ప్రభుత్వానికి టీఎస్‌ హైకోర్టు ఆదేశాలు*


హైదరాబాద్‌: కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర పభుత్వానికి తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని సూచించింది. వైద్యులకు పీపీఈ కిట్లు, మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం మరోసారి ఇవాళ కూడా విచారణ నిర్వహించింది. దీనికి రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు హాజరయ్యారు. 
రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్లు పబ్లిక్‌ హెల్త్ డైరెక్టర్‌ కోర్టుకు వెల్లడించారు. 
గాంధీలో ప్లాస్మా, యాంటీ  వైరల్‌ డ్రగ్స్‌ ప్రయోగాలు చేస్తున్నట్లు రాజారావు కోర్టుకు తెలిపారు.
విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి పలు ఆదేశాలు ఇచ్చింది. ఎక్కువగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కేసుల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. కేసుల వివరాలు ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని సూచించింది. ర్యాపిడ్‌ యాంటీజెంట్‌ టెస్ట్‌ నిర్వహించాలంటూ ఐసీఎంఆర్‌ చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 54 ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్న విషయాన్ని ప్రచారం చేయాలంది. సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం వివరించాలని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితో పాటు పోలీసులకు కూడా రక్షణ కిట్లు ఇవ్వాలని సూచించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిబ్బందికి షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించింది. ఈ నెల 29లోగా నివేదిక సమర్పించాలని సూచించింది.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment