Sunday, June 4, 2023

ధరణి వద్దన్న వాళ్ళనే బంగాళాఖాతంలో కలిపేద్దాం..... సీఎం కేసీఆర్....!

*ధరణి వద్దన్న వాళ్ళనే బంగాళాఖాతంలో కలిపేద్దాం..... సీఎం కేసీఆర్....!*
నిర్మల్‌ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన తెరాస జిల్లా కార్యాలయం, రూ.56.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా రూ.10లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ మున్సిపాల్టీలకు రూ.25కోట్లు చొప్పున, జిల్లాలోని 19 మండలాలకు ప్రతి మండల కేంద్రానికి రూ.20లక్షలు చొప్పున నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు.

''పదో తరగతి ఫలితాల్లో నిర్మల్‌ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలను అభినందిస్తున్నా. బాసర ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నాం. త్వరలోనే ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తా. మారుమూల జిల్లా, అటవీ జిల్లా అని పేరున్న ఆదిలాబాద్‌లో ఇప్పుడు నాలుగు జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. గతంలో జిల్లాలో ఒక మెడికల్‌ కాలేజీ ఉంటే.. ప్రస్తుతం మరో 3 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. పేదల కోసం నిర్మించిన రెండు వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ప్రజలకుఅందుబాటులోకి వచ్చాయి.

గతంలో రెవెన్యూ విభాగంలో భయంకరమైన అవినీతి ఉండేది. ఎవరి భూమి ఎవరి పేరుతో ఉందో తెలిసేది కాదు. ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత సులభతరమైంది. దరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్న వారిని బంగాళాఖాతంలో వేయాలి. మళ్లీ అవినీతికి తెరలేపడానికి కాంగ్రెస్‌ నాయకులు యత్నిస్తున్నారు. ధరణి పోర్టల్‌ ఉండటం వల్లే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా? ధరణి పోర్టల్‌ను తొలగించాలా? వద్దా? ప్రజలు ఆలోచించాలి. ఎస్‌ఆర్‌ఎస్పీ కింద 2 స్కీమ్‌లు త్వరలో పూర్తి చేస్తాం. ఎస్సారెస్పీ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లందుతాయి.

తాలూకా స్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ పెట్టే విధంగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. దీని ద్వారాఎంతో మంది యువతకు ఉపాధి లభిస్తుంది. ఏడాదికి రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ఎంత కరెంటు వాడుకున్నా అడిగేవారే లేరు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గానికి 3వేల ఇళ్లు మంజూరు చేస్తున్నాం. ఈ పథకం ద్వారా సొంత జాగాలో ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి రూ.3లక్షలు చొప్పున మంజూరు చేస్తాం. యాదవ సోదరులకు రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టబోతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఇంజినీరింగ్‌ కాలేజీ మంజూరు చేస్తున్నా'' అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సభలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment